Posted by Sakshyam Magazine on Wednesday, July 8, 2015
భగవద్గీతను చదివే అత్యధిక పండితులు శ్రీకృష్ణుడు దేవుడనే అభిప్రాయానికి వచ్చారు.అయితే శ్రీకృష్ణుడు దానికి భిన్నంగా మరొక అస్తిత్వాన్ని ప్రార్ధించమని సెలవిస్తున్నారు. గీతలో ప్రత్యక్ష, పరోక్ష శ్లోకాలుంటాయి.అవన్నీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికే సహకరిస్తాయి తప్ప గీతను బోధించిన శ్రీకృష్ణపరమాత్మను దేవుణ్ణి చేయడానికి ఎంతమాత్రము కాదు.ఆ శ్లోకాలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవని గమనించాలి.
ఉదాహరణకు ఈక్రింది శ్లోకాన్ని గమనించండి.
తమేవ శరణం గచ్ఛ! సర్వభావేన భారత
తత్ ప్రసాదాత్పారామ్ శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతమ్ 18:62
ఓ అర్జునా సర్వ విధముల అతనినే శరణు బొందుము.అతని అనుగ్రహముచే సర్వోత్తమగు శాంతి, శాశ్వతమగు స్థానమును నీవు పొందగలవు.
శ్రీకృష్ణులవారు "అతనినే" అంటూ తనకతీతమైన అస్తిత్వాన్ని ఆయన చూపిస్తూ శరణు బొందమని చెబుతున్నారు. ఇంకా అతని అనుగ్రహమంటూ పేర్కొన్నారు.
శ్రీకృష్ణులవారు దేవుడైతే మరొక అస్తిత్వాన్ని ఎందుకు శరణుబొందమన్నట్టు? కాస్త ఆలోచించాలి కదా?
మరొక శ్లోకం తీసుకుందాం!
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయ:
పరమ్ భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ 7:24
నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమై విలసిల్లినట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు నన్ను పాంచభౌతిక దేహమును పొందినవానినిగా తలంచుచున్నారు.
భగవంతుడు పాంచభౌతికదేహం పొందలేదని గీత చెబుతుంది. ఇక్కడ సందేహం రావచ్చు. "నన్ను" అన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడని కొంతమందివాదన. ఒకవేళ శ్రీకృష్ణులవారే దేవుడనుకుంటే ఆయన పాంచభౌతిక దేహమును పొందలేదా? అని అడిగితే సమాధానం లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే పై రెండు శ్లోకాలు కూడా భగవంతుణ్ణి ఉద్దేశించినవే. ప్రత్యక్ష,పరోక్ష శ్లోకాలుగా గుర్తిస్తేనే విషయ అవగాహన అవుతుంది.కాబట్టి ప్రియులారా శ్రీకృష్ణులవారు యోగాన్ని బోధించే మహానుభావుడే గాని సృష్టికర్త ఎంతమాత్రం కాదు.