“వైదిక శాస్త్రాల” ఆధారంగా “విగ్రహారాధన” సత్యమని నిరూపించాలనుకునే వారి ఆశ చివరికి అడియాశే అవుతుందన్నది గుర్తించాలి. వారి ఈ ప్రయాస వృధాప్రయాస కాక మానదు! -M. A. అభిలాష్
“భగవద్గీతలో విగ్రహారాధనకు అనుమతి ఉందా?” అన్న అంశంపై శుక్రాచార్యాగారి స్పందన. దానిపై M. A. అభిలాష్ గారి వ్యాఖ్య.
మిత్రులారా! నేడు మనకు కావలసింది- అడ్డతిడ్డ వ్యాఖ్యానాలు కాదు. సుస్పష్టమైన శాస్త్రీయ సిద్ధాంతాలు. ఉదాహరణకు ఈ క్రింది గమనించండి.
“మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అమూర్తమైనది (విగ్రహం కానిది) సత్యం”. -మైత్రాయణ్యుపనిషత్ 5:3
ఈ రకమైన స్పష్టత కలిగిన సిద్ధాంతాలను గురించి మాటలాడుకుంటే మనందరికీ ప్రయోజనకరం!
//
హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు. నిరాకారుడు అని చెప్పిన వెంటనే .. దానికి వివరణ కుడా ఇచ్చుకున్నారు. ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్న వారే అభాసుపాలవుతున్నారు తప్ప మరేమీ కాదు.//
-శుక్రాచార్యా
మిత్రులు శుక్రాచార్యా గారికి నమస్కారాలు.
నా వివరాలపై మీరు ఓపికగా స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరూ, నేనూ, మనమందరమూ గుర్తించవలసిన ప్రాథమిక విషయం ఒకటి ఉంది. అదేమిటంటే- సర్వమానవుల ఇహ-పర సాఫల్య ధర్మ మార్గం ఒక్కటే, దానిని ఈ పుడమిపై ఉన్న సకల దేశాలలోని ప్రజలకు అందించిన మహనీయుడు కూడా ఒక్కడే. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు! అందుకే మనం ఆయన పట్ల గల గౌరవ భావముతో “కృష్ణంవందే జగద్గురుం” అంటాము. దీనిని బట్టి- ఆయనే ఓం ప్రథంలో మన వైదిక శాస్త్రాలు ప్రబోధించాడు. ఆ తరువాత గీతాశాస్త్రమును ప్రబోధించాడు. దానికి ముందు, తరువాత అటు యూదులలో మోషేకు, “తోరా” (ధర్మశాస్త్రము)ను యేసుకు “ఇంజీలు” (సువార్త) ను ఇటు అరబ్బు దేశంలో ముహమ్మదుకు “కుర్’ఆన్” (నిత్యపారాయణ గ్రంధము)ను ఇచ్చినదీ ఆ పరమాత్ముడే! (గీతాశాస్త్రం 4:1-3) అందుకే ఆయన “జగద్గురువు” అయ్యారు.
పరమాత్ముడు “జగద్గురువు” అన్నది మీరు అంగీకరిస్తే, మా హిందూశాస్త్రాలు, మీ ఖురాను, వారి బైబిలు వంటి వేర్పాటు వాదాన్ని సృష్టించే పద ప్రయోగాలను వదలుకోవాలి. లేదంటే- పరమాత్ముడు “జగద్గురువు” కాదు, “భరత గురువు” మాత్రమే అని ఒప్పుకోవాలి. ఈ రెండిటిలో ఏదో ఒక విషయం తేల్చి చెప్పండి.
//హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు// అని మీరు అంటున్నారు. అయితే, “హిందూ మతములో విగ్రహాన్ని పూజించుకో వచ్చు” అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం ఏమైనా ఉందా శుక్రాచార్య గారూ? ఉంటే చూపించండి!
ఇక, మీరు చూపే ఏ శ్లోకమూ మీ విగ్రహారాధనను సమర్ధించదు. పైగా మీరు...
//ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్నారు// అని మాకు తప్పు పడుతున్నారు. మరి మీరేమన్నా భగవద్గీతలోని 701 శ్లోకాలను Randomగా ఎంచుకుని, “విగ్రహారాధన మహా పుణ్య కార్యం” అని నిరూపిస్తున్నారా శుక్రాచార్య గారూ!?
అసలు విషయము ఏమిటంటే- పవిత్ర, జ్ఞానయుక్త, ధర్మబద్ధ, సనాతన “ఏకేశ్వరోపాసన”ను మాత్రమే సమర్ధిస్తున్న మా వైదిక శాస్త్రాలను, బైబిలు, ఖురాన్ శాస్త్రాలను చేతపట్టుకొని, హిందూ-క్రాయిస్తవ-ముస్లిం పండితులలోని అధికులు- అపవిత్ర, అజ్ఞానపూరిత ధర్మవిరుద్ధ, కాల్పనిక “విగ్రహారాధన”ను సమర్ధించుకోవటానికి వాడుకుంటున్నారన్నది మీరు గమనించాలి. నక్కకు నాగలోకానికి ఏమాత్రమూ సంబంధం లేనట్లే, “విగ్రహారాధన”కు “వైదిక శాస్త్రాలకు” ఎలాంటి సంబంధామూ లేదు. “వైదిక శాస్త్రాల” ఆధారంగా “విగ్రహారాధన” సత్యమని నిరూపించాలనుకునే వారి ఆశ చివరికి అడియాశే అవుతుందన్నది గుర్తించాలి. వారి ఈ ప్రయాస వృధాప్రయాస కాక మానదు.
శుక్రాచార్య గారూ! మీరు మరొక వివరణ ఇస్తూ, 12:1 వ శ్లోకంలో, “పరమాత్ముడైన మిమ్మల్ని” ఉపాసించేవాడు యోగము (ధర్మము) ను సరైన రీతిలో ఎరిగిన వాడా? లేక ఇంద్రియములకు గోచరముకాని “అక్షరపరబ్రహ్మ”ను ఉపాసించేవాడు యోగము (ధర్మము) ను సరైన రీతిలో ఎరిగిన వాడా? అన్న అర్జునుని ప్రశ్నకు సమాధానముగా-
“నన్ను ఎవరు ఉపాసించూచున్నారో వారు ఉత్తములని నా అభిప్రాయము” అని పరమాత్ములు శెలవిచ్చారు. అన్నది చూపి... ఇదిగో దీనిని బట్టి మా విగ్రహారాధన సరైనదే! అని మీరు తొందరపడి తీర్మానించేశారు. ఆ విషయానికీ నిన్నా మొన్నా మొదలెట్టిన అజ్ఞాన పూరితమైన శాస్త్ర విరుద్ధమైన ఈ విగ్రహారాధనకు అసలు సంబంధం ఏమిటి? శ్రీరాముడి తరువాత కాలములోని మహనీయులుగానీ శ్రీకృష్ణుని తరువాత కాలములోని మహనీయులుగానీ మీ ఈ శాస్త్రవిరుద్ధ విగ్రహారాధన చేసినట్లు చరిత్రలో ఎక్కడైనా ఒక్క ఆధారాన్ని చూపగలరా శుక్రాచార్య గారూ? అంటే మీ అంతలోతుగా వారు శాస్త్రాలను అధ్యయనము చేయలేకపోయారేమో! లేక ధర్మము పేరుతో ప్రజలను దోచుకోవాలనే దురుద్దేశ్యము వారికి లేకపోయిందేమో! అందుకే అలాంటి ఆధారాలు హిందూ ధార్మిక చరిత్రలో మచ్చుకైనా దొరకవు!
శాస్త్ర విరుద్ధమైన విగ్రహారాధనను సమర్ధించుకొనే కంగారులోపడి 12:5 వ శ్లోకాన్ని మీరు గమనించలేదు. అందులో చెప్పబడుతుందేమిటో ఈ క్రింది గమనించగలరు.
అవ్యక్త (నిర్గుణ) అక్షరపరబ్రహ్మము నందు ఆసక్తిగల మనస్సుగల వారికి
(బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగుణోపాసకులకంటే) ప్రయాస చాల
అధికముగ నుండును. ఏలయనిన, నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానముగాల
వారిచేత అతికష్టముగా పొందబడుచున్నది. -12:5
సగుణోపాసన ఇంద్రియ నిగ్రహములేని “దేహాభిమానము”గల వారి కొరకే గాని ఇంద్రియ నిగ్రహము గల “స్థిత ప్రజ్ఞుల”కు కాదని పైశ్లోకం తెలుపుతుందన్నది గమనార్హం! అది కూడా తాత్కాలికంగా మాత్రమే అని వ్యాఖ్యాతలు తెలుపుతున్నారు. ఇంతకూ విగ్రహారాధన ఎవరి కొరకో లేక విగ్రహారాధకులు ఎవరో ఈ క్రింది గమనించగలరు.
అజ్ఞానం భావనార్ధాయ ప్రతీమాః పరికల్పితాః
అనగా మూఢులకు భావనకై విగ్రహాలు కల్పించబడ్డాయి –దర్శనోపనిషత్తు 4:5
మనుషులలో “విషయ అవగాహన పరము”గా రెండు తరగతులుగా ఉంటారు. ఒక వర్గం- “మూర్త ప్రజ్ఞులు” రెండవ వర్గం- “అమూర్త ప్రజ్ఞులు” దీనిని “అజ్ఞాన దశ” మరియు “జ్ఞాన దశ” అని చెప్పవచ్చు. ఉదాహరణకు: గణితం నేర్పిస్తున్నప్పుడు రెండులో రెండు కలిపితే ఎంత? అని ప్రశ్నిస్తే, దానిని “అమూర్తం”గా లేక “అభౌతికం”గా ఊహించి చెప్పటం చిన్న పిల్లలకు కష్టం. అందుకే- ఆ చిన్నపిల్లవాని చేతి రెండు వేళ్లను లేదంటే అతనికి చొక్కా బొత్తాలను “మూర్తం”గా లేక “భౌతికం”గా చూపి వాటిలో రెండు కలిపితే, మొత్తం ఎన్ని అవుతాయి? అంటే నాలుగు! అని వివరించటం జరుగుతుంది.
ఈ ప్రక్రియ ఎంతకాలం సాగిస్తారు? ప్రాజ్ఞత వచ్చేవరకే. ఆ తరువాత అతని “అమూర్త ప్రజ్ఞ” అంటే “ఊహాశక్తి” పనిచేయటం ప్రారంభం అయిపోతుంది. ఇక అప్పటి నుండి- చేతి వేళ్లు, చొక్కా బొత్తాలు అంటే విగ్రహాలు, ప్రతిమలు వంటి “భౌతిక” వస్తువులను అతడు ఉపయోగించడు. కాదు, ఉపయోగించకూడదు! ఒకవేళ ఎవడైనా చేతి వేళ్లు, చొక్కా బొత్తాలతోనే నేను లెక్కలు ప్రారంభించాను, కనుక నేను అలాగే సాగిపోతాను అన్నా లేక మేము ఫలానా వర్గానికి చెందినవారము కాబట్టి అలాగే చేసుకుంటాము. మీరు ఫలానా వర్గం వారు కాబట్టి ఆలా చేయ్యరు అని వాదించే వారినే శాస్త్రాలు మూఢులు ఆజ్ఞానులు అని ప్రకటిస్తున్నాయన్నది గమనార్హం!
దేవతామూర్తులను ఆరాధించే వారిని భగవద్గీత ఎలాపరిగణిస్తుందో, ఎలాంటి వారు దేవతామూర్తులను ఆరాధిస్తారంటుందో, దేవతామూర్తులను ఆరాధించే వారు పొందుఫలమెట్టిదంటుందో ఈ క్రింది శ్లోకాలలో గమనించగలరు.
(కొందరు) తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపించబడినవారై విషయాదులండలి
కోరికలచే వివేకమునుకోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆ యా
నియమములను అవలంబించి ఇతరదేవతలను భజించుచున్నారు. -7:20
పై శ్లోకం ప్రకారం- మనోవాంఛాప్రియులైన ఆజ్ఞానులు మాత్రమే దేవతారాధన చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ దేవతారాధన అజ్ఞానం ఎందుకయ్యిందంటే- ఉదాహరణకు: అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “సంపదకు” గుర్తు (ఐకాన్)గా “లక్ష్మి విగ్రహము”ను అలాగే అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “జ్ఞానానికి” గుర్తు (ఐకాన్)గా “సరస్వతి విగ్రహము”ను ఇంకా, అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “శక్తికి” గుర్తు (ఐకాన్)గా “దుర్గా” లేక “కాళికా” ఇతర విగ్రహములను మన పూర్వీకులు ఏర్పరిచారు. మన సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు అపారమైన సంపద, అపారమైన జ్ఞానం, అపారమైన శక్తి కలిగి ఉన్నాడు అన్న సమాచారాన్ని ఆ విగ్రహాల (ఐకాన్ల) ద్వారా గ్రహించి, తనకు కావలిసిన సంపద, జ్ఞానం, శక్తి వంటి వాటి కొరకు సర్వోన్నతుడైన సర్వేశ్వరుడినే నేరుగా ప్రత్యక్షముగా వేడుకోవాలి. ఇదీ మన సనాతన వైదిక ధర్మ పూజా విధానం. ఇది ఎంతో హేతుబద్ధం మరియు జ్ఞానయుక్తం కూడా. దానికి విరుద్ధంగా- ప్రదాతను వదిలేసి, ప్రదాత సామర్ధ్యాలను చూపించే విగ్రహాలను (ఐకాన్లను) అర్ధించటం అహేతూకం అజ్ఞానం.
ఉదాహరణకు: కొందరు రోగులకు వారి వైధ్యం కొరకు ఒక ఆసుపత్రి చిరునామా తెలుపుతూ- “మీరు ఫలానా రహదారి మీదకు వెళితే, ఎదురుగా “వైద్యాలయం” అని ఒక “సైన్బోర్డు” అనగా “సూచిక బల్ల” కనిపిస్తుంది. దాని మీద పైకి సూచిస్తూ ఒక బాణం గుర్తు ఉంటుంది. దాని ప్రకారం పైకి వేళితే మీ రోగాలు నయం అయి, మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది” అని చెబితే అలాగే ఆ రోగులందరూ బయలుదేరారు. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత, ఆ రోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవర్గం- “వైద్యాలయం” అని ఉన్న “సైన్బోర్డు” దగ్గరే ఆగిపోయి, తమ బాధలను అక్కడే వెళ్ళగక్కుతున్నారు! రెండవ వర్గం- ఆ “సైన్బోర్డు”ను కేవలం ఒక “సూచిక”గా మాత్రమే తీసుకొని, అది సూచించే అసలు వైద్యుని వద్దకు చేరిపోయి, వైద్యం చేయించు కుంటుంది. ఈ ఇరువర్గాలలో ఎవరి విధానం అజ్ఞానపూరితం? ఎవరి విధానం జ్ఞానయుక్తం?
సరిగ్గా పైవిధమైన లక్ష్యం కొరకే పాశ్చాత్తులు నిన్నా మొన్న కనిపెట్టిన ‘Unknown through known’ అనే గొప్ప సూత్రాన్ని మన ప్రాచీనులు ఏనాడో కనిపెట్టారు. దాని ఆధారంగానే- శిల్ప ఆగమన శాస్త్రాన్ని ఆవిష్కరించి, విగ్రహాల రూపకల్పన చేశారు. అది రాతియుగం నాటి “సమాచార సాంకేతిక పరిజ్ఞానం” Information Technology!
కనుక “వ్యక్తం”గా ఉన్న “విగ్రహాల” దగ్గరే ఆగిపోకుండా వాటి ద్వారా “అవ్యక్తం”గా ఉన్న “దేవుని” తమ “గ్రహణ”లోనికి తెచ్చుకొని, ఆయననే “ప్రత్యక్షం”గా వేడుకోవాలి. గత నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం వరకూ అలానే జరిగింది. కాకపోతే మన వైదిక ధర్మం చూపిస్తున్న “భగవంతుని”కి “భక్తుని”కి మధ్య “ప్రత్యక్ష సంభంధం” అన్న గొప్ప అధ్యాత్మిక విధానాన్ని తెంచేసి, హిందూ సమాజాన్ని నాశనం చేయటానికి విగ్రహాల ఆవిర్భావం వెనుక ఉన్న మహత్తరమైన, బృహత్తరమైన, ఉదాత్తమైన ఈ “జ్ఞాన అంశము”ను ప్రజల నుండి దోచుకున్నారు కొందరు దుష్టులైన పండితులు!
అందుకే దేవతారాధన చేసే వారిని- హృతాజ్ఞానాః అనగా “జ్ఞానం దొంగలించబడినవారు!” అని శాస్త్రం చెబుతుంది. నిజమే వారి జ్ఞానాన్ని దోపిడీ దారులైన పండితులు దొంగలించేశారు కదా! ఇక, ఈ క్రింది శ్లోకాన్ని గమనించగలరు.
అల్పబుద్ధి కలిగిన వారియొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది.
(ఎందుకంటే)దేవతలను పూజించువారు దేవతలచే పోందుచున్నారు.
నా భక్తులు నన్నే పొందుచున్నారు.-7:23
ఇక, దేవతారాధన కారణంగా బుద్ధిహీనులైన వారు పొందే ఫలం వారికి ఏమైనా లాభదాయకం అవుతుందా? అని శాస్త్రాన్ని ప్రశ్నిస్తే- అది నాశనవంతమై పోతుందని సమాదానం ఇస్తుంది. కనుక శుక్రాచార్యాగారూ! మీరూ మీ అనుయాయులూ సృష్టి పూజ, విగ్రహారాధన, మూఢ విశ్వాసాలతో కలుషితమైపోయిన కాల్పనిక హిందూ ధర్మాన్ని వదిలేసి, సర్వోన్నతుడైన ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధించే ఏకేశ్వరవాద, జ్ఞానయుక్త స్వచ్చ వైదిక ధర్మాన్ని స్వీకరించండి. తథాస్తు. ఓం తత్ సత్.