“హిందూ ధర్మం” లేక “వైదిక ధర్మం” అత్యంత ప్రాచీనమైనది. దాని మూడు ప్రత్యేకతలు అత్యంత గమనార్హమైనవి. వాటిలో-
1. సార్వజనీనత 2. సార్వకాలికత 3. హేతుబద్ధత.
పై మూడు విషయాలను నిరూపించటానికి ఎన్నో శ్లోకాలను ప్రస్తావించవచ్చు. అయితే విషయం విస్తరించి పోతుంది కనుక మచ్చుకు కొన్నిటిని మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాను. “వైదిక ధర్మ” మొదటి ప్రత్యేకత అయిన “సార్వజనీనత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు.
ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక
ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్ఠగల్గియుండు అట్టివారియొక్క
యోగక్షేమములును నేను వహించుచున్నాను. -9:22
పై శ్లోకములో ఫలానా వంశం, ఫలానా వర్గం, ఫలానా వర్ణం ఫలానా లింగం కలిగిన వారు లేక ఫలానా ప్రాంతంలో నివసించేవారు మాత్రమే “దైవప్రసన్నత”కు “మోక్షప్రాప్తి”కి అర్హులు అని కాక, తన ప్రతిపాదిత “దృక్పథము”ను ఏప్రజలు అనుసరిస్తారో (ఏజనాః పర్యుపాసతే) వారే “దైవప్రసన్నత”కు “మోక్షప్రాప్తి”కి అర్హులు అని ప్రకటిస్తుంది. దాని ఈ ప్రకటనే వైదిక ధర్మ “సార్వజనీనతకు ప్రబల గుర్తు!”. కనుక ఈ సనాతన ధర్మానికి మేమే గుత్తదారులము అని చెప్పుకునే అర్హత ఏదో ఒక ప్రత్యేక వర్గానికి ఏమాత్రమూ దఖలు పడదు. కాకపోతే, దానిని ఎవరు వ్యాఖ్యానించినా అది- మన ప్రాచీనుల “వ్యాఖ్యానము”లకు మరియు వారి “ఆచరణా విధానము”లకు లోబడి ఉండాలి తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యానించకూడదు. తరువాత, “వైదిక ధర్మ” రెండవ ప్రత్యేకత అయిన “సార్వకాలికత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు.
సాధు, సజ్జనులను సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశమొనర్చుట
కొరకు, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందును
అవతరించుచుందును. -4:8
పై శ్లోకంలో “ఫలానా మతవర్గము”ను “రక్షిస్తాను” మరియు “ఫలానా మతవర్గము”ను “శిక్షిస్తాను” అని కాక, “సజ్జనులు” అయిన వారిని “రక్షిస్తాను” మరియు “దుర్జనులు” అయిన వారిని “శిక్షిస్తాను” అని ప్రకటిస్తుంది. ఇది ఎంతో సంజసమైనదే కాక, అత్యంత న్యాయవంతమైంది కూడా! ఈ విధానం ఏ కాలంలో అయినా చెల్లుబాటు అయ్యేదే. దాని ఈ ప్రకటనే వైదిక ధర్మ “సార్వకాలికతకు ప్రబల గుర్తు!”. ప్రజలు చేసుకున్న “మంచి-చెడు”లను అంటే- “శీలము” Characterను బట్టి కాక, “కుల-మత” వర్గాలను అంటే- Cast-Communityలను బట్టి గాని, స్త్రీ-పురుష లింగ (Sex) భేదములను బట్టి గాని “శిక్ష-బహుమానం” అన్నది కాలం చెల్లిన అత్యంత అన్యాయపూరితమైన సిద్ధాంతం! అలాంటి తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం లేదు కాబట్టే- వైదిక ధర్మం “సార్వకాలిక ధర్మం” అయ్యింది.
ఇక, “వైదిక ధర్మ” మూడవ ప్రత్యేకత అయిన “హేతుబద్ధత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు.
1. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు సమస్తమును
అదియేనని తగుల్కొనియుండునో, 2. అందుకు తగిన హేతువు లేకుండునో,
3. తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో, 4. అల్పమైనదిగా
యుండునో 5. అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.-18:22
పై శ్లోకము భౌతిక విజ్ఞాన శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. మెలకువగా ఉన్న ప్రతి ఒక్కరూ “త్రివిధ కర్మలు” చేస్తుంటారు. “త్రివిధ కర్మలు” అనగా- “ఆలోచనలు”-“మాటలు”-“చేతలు”. అవి: 1. “జ్ఞానయుక్తమైనవి” కావచ్చు లేక 2. “అజ్ఞానపూరితమైనవి” కావచ్చు. అయితే ఆ రెండు విషయాలు చెప్పుకోవటానికైతే బాగానే ఉన్నాయి. వాటిని “విచక్షణ” (Discriminate) చేయటం ఎలా అన్నదే అసలు సమస్య! దాని పరిష్కారానికి పై శ్లోకాన్ని దాని విషయాల వారీగా ఈ క్రింది మరొకసారి గమనించగలరు:
1. ఏ జ్ఞానమువలన మనుజుడు ఏదేని ఒక్కపనియందు సమస్తమును అదియేనని తగుల్కొనియుండునో
ప్రతి మనిషి నిత్యం అనునిత్యం “ఆలోచనలు”-“మాటలు”-“చేతలు” అనే “త్రివిధ కర్మల”లో ఏదో ఒక దానిని చేస్తూ ఉండటం కద్దు లేక అనివార్యం! ఆ సహజ పరిణామాన్నే పైన పేర్కొన్న శ్లోకపు మొదటి భాగం చూపిస్తుంది. అయితే ఏదైనా ఒక పనిని వేలంవెర్రిగానో గుడ్డెద్దు వచ్చి చేలో పడ్డట్టో, గుంపులోగోవింద నలుగురితో నారాయణ అన్నట్టో చేసుకుంటూ పోక, అది చేయటం వలన నాకు 1. మానసికంగా గాని, 2. శారీరకంగా గాని 3. నైతికంగా గాని లేక 4. సామాజికంగా గాని ఏమైనా లాభం ఉందా? లేక నష్టం ఉందా? అని బాగా ఆలోచించి, పైన పేర్కొన్న నాలుగు ప్రయోజనాలు గాని లేక అథమం వాటిలో ఏదో ఒక ప్రయోజనం గాని ఉన్న కర్మనే చేయటానికి ఉపక్రమించాలి. అలాంటి ఏప్రయోజనమూ లేని కర్మను ఎట్టిపరిస్థితులలోనూ చేయరాదు.
ఈ క్రింది పై శ్లోకపు రెండవ భాగం గమనించగలరు.
2. అందుకు తగిన హేతువు లేకుండునో,
అలాంటి కర్మ చేయరాదు. అంతే కాదు, ఎవడో వచ్చి ఒక యాభై వేలు నాకు ఇస్తే మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నాడనుకోండి... లేక మరొకడు వచ్చి మీరు మా మతంలోనికి మారిపోతే మీకు పట్టిన దారిద్ర్యం పోతుంది అన్నాడనుకోండి దాని “సాధ్యాసాధ్యాలు” మరియు దాని “వాస్తవాస్తవాలు” తేలుసుకోవాలి. ఆ విషయాన్నే ఈ క్రింది
పై శ్లోకపు మూడవ విషయము తెలుపుతుంది.
3. తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో,
అంటే తను తల పెట్టబోయే “కర్మ వాస్తవికత”ను గుర్తించాలి.
4. అల్పమైనదిగాయుండునో
అంటే తను తల పెట్టబోయే “కర్మ” గంభీరమైనదిగా గొప్పదిగా ఉండాలి. ఎవడో తుమ్మితే భయపడటం, పిల్లి ఎదురోస్తే వెంక్కు పారిపోవటం, వితంతు స్త్రీ ఎదురు పడితే ఆందోళనకు గురవ్వటం, ఈ మధ్య సాధారణ తలనొప్పి తగ్గినందుకూ హిదువులలో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్నవారున్నారు! ఇది వైదిక సమాజ దుఃస్థితికి పరాకాష్ఠ!
పై శ్లోకపు ఈ క్రింది విషయం ప్రకారం-
5. అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.
అంటే- విషయ వాస్తవికతను గురించి తెలుసుకోకుండా కర్మ చేసే వారు అజ్ఞానంలో ఉన్నారని పై శ్లోకం హెచ్చరిస్తుంది. ఇది ఎంతటి యథార్థమో ఒక్కసారి ఆలోచించండి! దాని ఈ హెచ్చరికే వైదిక ధర్మ “హేతుబద్ధతకు ప్రబల గుర్తు!”.
దీనిని బట్టి- వైదిక ధర్మానికి చెందిన ప్రతి “ఆలోచనా దృక్పథము” ప్రతి “ఆచరణా క్రతువు” ఎంతో హేతుబద్ధమైనది, అర్థవంతమైనదని తెలుస్తుంది. అంటే- వైదిక “ఆలోచన-ఆచరణ” విధానాల వలన- 1. మానసిక 2. శారీరక 3. నైతిక లేక 4. సామాజిక ప్రయోజనం వంటివాటిలో అన్నీ గాని అథమం ఒకటి గాని తప్పనిసరిగా ఉండితీరుతుందన్నమాట!
గమనిక: హేతుబద్ధమైన, అర్థవంతమైన వైదిక “ఆలోచన-ఆచరణ” విధానం కనీసం ఒక్కగాని ఒక్క శాతమూ నేటి హిందూ సమాజంలో “ఆచరణాత్మకం”గా లేదన్నది ఒక చేదు వాస్తవం! దానికి ప్రధాన కారణం- నేటి అధిక శాతం హిందూ పండితులు ఆ మహోన్నత సనాతన హేతుబద్ధ ధర్మాన్ని ధర్మశాస్త్రాలలో సమాధి చేసి, కాకమ్మ కథలతో కాలం వెళ్ళబుచ్చుతూ, అనవసరమైన భయాలను ప్రజలలో సృష్టించి, వాటి నివారణ పేరిట దోపిడీ పరువాన్ని నడపటమే! అన్నది ఇక్కడ అత్యంత గమనార్హం!
చెట్టుపేరుచెప్పుకొని కాయలు అమ్ముకొనే చందంగా వైదిక శాస్త్రాల పేరుచెప్పుకుంటూ నిర్హేతుకమైన నిరర్ధకమైన నిష్ఫలమైన తమ కాల్పనిక “తప్పుడు విశ్వాసాల”ను మరియు “తప్పుడు కర్మకాండల”ను ప్రజలలో చలామణి చేసుకుంటున్నారు నేటి అధిక శాతం పండితులు. అయితే వంచక పండితుల ఈ దుర్మార్గపు నిర్వాకం వలన ఒకవైపు- ఎంతో మహత్తరమైన వైదిక ధర్మం అన్యుల (వైదికేతరుల) దృష్టిలో అభాసుపాలవుతుంది. రెండవవైపు- వైదికులు సర్వ విధాలా క్షవరానికి గురౌతున్నారు! కాని, వారికి మటుకు “రాబడి-పలుకుబడి” అడ్డ దారిలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుంది!
కనుక స్వార్ధపరులైన పండితుల బండారాన్ని బట్టబయలు చేయటానికి భయపడి “వైదిక ధర్మాన్ని” మరియు “వైదిక ప్రజానీకాన్ని” బలి చేసి, ఆన్యుల దృష్టిలో అభాసు పాలౌదామా? లేక స్వార్ధ పండితుల “కాల్పనిక ధర్మము”ను ఖండించి, హిందూశాస్త్రాలలో సమాధి చేయబడి ఉన్న “సశాస్త్రీయ వైదిక ధర్మము”ను బయటకు తీసి, గత వైభవాన్ని సాధించుకుందామా? అన్నది విజ్ఞులైన మీరే నిర్ణయించుకోవాలి. జైహింద్!