Posted by Sakshyam Magazine on Tuesday, December 26, 2017
మన భారతదేశంలో హిందువులలో అత్యధికంగా క్రైస్తవమత మార్పిడి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా క్రైస్తవులుగా మారిన హిందువులే కన్పిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది?
ఒకప్పుడు బ్రిటీష్ పరిపాలనా కాలంలో అట్టడుగు స్థాయి (సామాన్యులు-పేదరికపు) ప్రజలు కూడు,గుడ్డ కోసం బ్రిటీష్ బోధనలకు, వారి ఆదరణకు లోబడిపోయి క్రైస్తవులుగా మారిపోయేవారు. అప్పటి రోజులలో పండితవర్గం,లేక బ్రాహ్మణ వర్గం వారిని ముఖ్యంగా దళితులను దరిదాపులకు రానీయకపోవడం కూడా క్రైస్తవమత వ్యాప్తికి కారణమయ్యింది.
కాని నేటి రోజుల్లో కూడా అంతకంటే ఎక్కువుగా క్రైస్తవమత వ్యాప్తి పెరిగిపోతుంది. పైగా ఈ క్రైస్తవమత స్వీకరణలో కేవలం పేదవారే ఉన్నారనుకుంటే పెద్ద పొరపాటు. ఎవరినైతే అగ్రకులాలని చెప్పుకుంటున్నామో వారు కూడా ఉన్నారు. అన్నీ పుష్కలంగా ఉంది తులతూగుతున్న ధనికులు కూడా చేరిపోతున్నారు. మరొక ముఖ్య విషయమేమిటంటే బ్రాహ్మణ వర్గస్తులలో కూడా అనేకులు చర్చి ఫాదర్లుగానూ, బోధకులుగానూ అవతారం చెందుతున్నారు.
నిజం చెప్పాలంటే బ్రాహ్మణ పురోహిత్యం క్రమేపీ తగ్గుతూ క్రైస్తవ పురోహిత్యం పెరిగిపోతుంది. హిందూ సమాజం ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటి? ఏం జరుగుతోంది? అనే విషయ పరిజ్ఞానం మీద దృష్టి వదిలి పెట్టి " హిందువుగా పుట్టావు,హిందువుగా జీవించు" అనే నినాదం మాత్రం ప్రచారం అవుతుంది. దీని వలన ఉపయోగం ఏముంది? అలాగని క్రైస్తవులను దండించడం, లేక శిక్షించడం లాంటి పనులు కూడా మూర్ఖపు పనులుగానే మిగిలిపోతాయి. ఇది క్రస్తవ మాట వ్యాప్తికి మరింత తోడ్పడుతుంది తప్ప ఏ విధంగానూ హిందూ సమాజానికి ఉపయోగం కలిగించదు.
దీని సమస్యకు ఒక్కటే పరిష్కారం వుంది. మన వైదిక శాస్త్ర బోధనలను ప్రజలలో సర్వసామాన్యం చేయాలి. శాస్త్ర విరుద్ధమైన క్రతువులను రూపుమాపాలి. ఈ పని సాధ్యమేనా అన్నది సందేహమే! ఎందుకంటే హిందుత్వాన్ని వ్యాపారం చేసుకున్న బడాబాబుల చేతుల్లో నుండి, భగవంతుణ్ణి స్థానంలో కూర్చుని కాళ్ళకు మొక్కించుకుని దైవ భక్తిని పూర్తిగా వదిలి పెట్టించేసి, కేవలం గురు భక్తిని మాత్రమే ప్రతిపాదిస్తూ లాభాన్ని పొందుతున్న గురువులనుండి, వేదం శాసనం కంటే తమ స్వకల్పిత శాసనాలతో ప్రజలను నమ్మిస్తున్న స్వామీజీల కూటముల నుండి నిజమైన వేద ప్రతిష్టను స్థాపించడం కష్టమే!
ఈ పని జరగాలంటే మాత్రం ప్రజలలో, సామాన్య ప్రజలలో సైతం వేద శాస్త్ర అవగాహన పెరగాలి. వేదాన్ని అడ్డుపెట్టుకుని నేడు కల్పించబడుతున్న తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విశ్వాసాలు అప్పుడే ప్రజలకు తెల్సిపోతాయి.అప్పుడే మనిషి జ్ఞాన పరిపక్వత చెందుతాడు. అప్పుడు ఎవరికీ వారు నిజమైన సాధువు అవుతాడు. అది జరిగిననాడు నేటి కాల్పనిక సాధువులు మటుమాయమవుతారు. ఇది సాధ్యమేనా? అన్నది సందేహమే!!
ఈ వేదం జ్ఞాన ప్రతిష్టత జరగక పొతే ఈ మోసాలన్నీ తెల్సుకున్నవారు, ఈ తప్పుడు సిద్ధాంతాలు గందరగోళానికి గురైనవారు మతమార్పిడి చేసుకోవడం తధ్యమయిపోతుంది. ఎందుకంటే వారికి వేదజ్ఞానం లేక అసలు హిందూ ధర్మమంటేనే ఇంతేనేమో అన్న అపోహ మాత్రమే మిగిలిపోతుంది. అటువంటప్పుడు "హిందువుగా పుట్టావు, హిందువుగా జీవించు" అనే నినాదం ఎందుకు పనికొస్తుంది? ఈ పనికి బదులు "వేదశాస్త్ర" అవగాహనకు కృషి చేయడమే ఉపయోగపడుతుంది. దీనికి మీరేమంటారు?