Posted by Sakshyam Magazine on Saturday, February 16, 2019
సృష్టికర్త అయిన అల్లాహ్ యే మా దేవుడు, ముహమ్మద్ (స) మా ప్రవక్త అని నమ్ముతూ, నమాజ్, రోజాలను నిష్ఠగా పాటిస్తున్నప్పటికీ, ముస్లింగా జీవిస్తున్న ప్రతీ ఒక్కారూ అసలు ముస్లిం సమాజ నియామకం అల్లాహ్ ఎందుకు చేశాడు! ముస్లిం సమాజ నియామకం అసలు లక్ష్యం ఏమిటి? అన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి. “అదేమిటండీ, అల్లాహ్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) ను నమ్ముకుని, నిష్ఠగా నమాజ్, రోజాలు పాటిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఒక ముస్లింగా అసలు లక్ష్యం కూడా ఒకటి ఉందా!?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించేవారు సైతం ముస్లిం సమాజంలో కొందరు ఉన్నారు అనటం అతిశయోక్తి కాదు! అందుకే ఇస్లాం అపరిచిత పరిస్థితుల్లో ప్రారంభం అయింది. తిరిగి ఆ అపరిచిత పరిస్థితులే పునరావృతమవుతాయి” అని ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పటం జరిగింది.
అత్యున్నత బాధ్యత నిర్వహణ కొరకు తీసుకురాబడిన ఉత్తమ సమాజమే ముస్లిం సమాజం!
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” - 3:110
1.పై వాక్యంలో స్వయంగా అల్లాహ్ ముస్లిం సమాజాన్ని “ఉత్తమ సమాజం”గా గుర్తిస్తున్నాడన్నది గమనార్హం.
2.అయితే ఏ ప్రాతిపదికమీద “ఉత్తమ సమాజం”గా గుర్తిస్తున్నాడన్నది గమనిస్తే ఆ సమాజానికి అల్లాహ్ ఇచ్చిన “మంచి చేయండి అని ఆజ్ఞాపించటం, చెడు నుండి ఆపటం” అన్న మానవాళిని సంస్కరించే గొప్ప బాధ్యత ఆధారంగా ముస్లిం సమాజాన్ని “ఉత్తమ సమాజం”గా గుర్తిస్తున్నాడు అన్నది.
3.“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే” అని చెప్పటాన్ని బట్టి ప్రపంచ ప్రజలను సంస్కరించే బృహత్తర బాధ్యతను అల్లాహ్ ముస్లిం సమాజంలోని ప్రతీ స్త్రీ-పురుషుని పై మోపాడని తేటతెల్లమవుతుంది. దీనిని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స) వారు చిట్టచివరి ప్రవక్త కావటంతో, వారి అనంతరం ఇక ప్రవక్తల ఆగమనం సైతం లేకపోవటంతో ఇక మానవాళిని సంస్కరించే బాధ్యతను ప్రళయం వరకు ముందుకు తీసుకెళ్లాల్సినవారు ముస్లిములే అని కూడా తెలుస్తుంది.
దీనిని బట్టి ముస్లిం సమాజం అన్నది ఇతర వర్గాల వంటి ఏదో సామాన్య వర్గం కాదు కానీ సర్వమానవాళిని సంస్కరించే ఓ బృహత్తర బాధ్యత ఇవ్వబడి స్వయంగా సృష్టికర్త అయిన దేవునిచే “ఉత్తమ సమాజం” గా గుర్తింపు పొందిన ప్రత్యేక వర్గం అని సుస్పష్టం అవుతుంది. ఇంకా “ముస్లిం” అన్నది ఏదో ప్రభూత్వ పత్రాల్లో క్రిస్టియన్, హిందూ వగైరా కొన్ని మత వర్గాలను సూచిస్తూ వ్రాయబడేటువంటి ఓ సామాన్య మతవర్గం కాదు కానీ, సమాజ సంస్కర్తలుగా అల్లాహ్ చే ఎన్నుకోబడిన విశ్వాసుల వర్గానికి స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ చే పెట్టబడిన ఓ గొప్ప గుర్తింపు పేరు అని తెలుసుకున్నాం.
అయితే ఎప్పటివరకు ముస్లిం వర్గం “ఉత్తమ సమాజం” గా గుర్తించబడుతూ ఉంటుంది?
తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే- “ఉత్తమ సమాజం” గా అల్లాహ్ ఇచ్చిన గుర్తింపు శాశ్వత గుర్తింపు కాదు! కానీ అది అల్లాహ్ ముస్లిం సమాజానికి సర్వమానవాళిని సంస్కరించే బాధ్యత పరంగా ఇచ్చింది మాత్రమే! అంటే ఎప్పటివరకైతే ఈ బాధ్యతను వారు నిర్వర్తిస్తూ ఉంటారో అప్పటివరకు మాత్రమే వారు దేవుని దృష్టిలో “ఉత్తమ సమాజం” గా గుర్తించబడతారు. ఉదా: ఓ ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ, తన పై నున్నవారి ఆదేశాలకు కట్టుబడి ఉన్నంత కాలమే అతడు ఉద్యోగంలో కొనసాగగలడు. లేదంటే చేదు పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ముస్లిం సమాజం సైతం ఎప్పుడైతే సందేశ ప్రచార బాధ్యతను విస్మరిస్తుందో జరిగే పరిణామం ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో గమనించగలరు.
“మేము అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు, ఇంకా శపించేవారంతా శపిస్తారు” - 2:159
మానవులందరి కోసం అల్లాహ్ విశదం చేసిన జ్ఞానబోధలు దాచేవారు అంటే సకల మానవాళి కొరకు దేవుడు ఖురాన్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాన్ని ప్రజల ముందు బహిర్గతం చెయ్యనివారు, లేక ప్రచారం చెయ్యనివారని అర్థం. వారి పర్యవసానం- అలాంటివారిని “అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు, ఇంకా శపించేవారంతా శపిస్తారు”. అంటే అల్లాహ్ దృష్టిలో ముస్లిం వర్గం “ఉత్తమ సమాజం” అనే హోదాలో కొనసాగటానికి “షరతు” ముస్లిములు “అల్లాహ్ మానవులందరి మార్గదర్శకం కోసం అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు ప్రజలలో సర్వసామాన్యం చేసే బృహత్తర బాధ్యతను నిర్వర్తించటమే!” లేదంటే “శాపగ్రస్త సమాజంగా” మిగిలిపోతుందని తేటతెల్లమైంది.
ముస్లిములు అల్లాహ్ సేవకొరకై ఎన్నుకోబడినవారు!
“అల్లాహ్ మార్గంలో పరిశ్రమించండి. పరిశ్రమించవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందినీ ఉంచలేదు” - 22:78
పై వాక్యాన్ని బట్టి ప్రతీ ముస్లిం ఆనందపడాల్సిన విషయం ఏమిటంటే- తాను అల్లాహ్ చే ఆయన సేవకొరకై “ఎన్నుకోబడిన వాడు” అన్నది. దీనిని బట్టి “ముస్లిం” అనేది కేవలం ఏదో ఒక మతావర్గానికి చెందిన సాధారణ గుర్తింపు లాంటిది కాదు అది ఓ బాధ్యతాయుతమైన వర్గానికి ఇవ్వబడిన పేరు అని, వారి బాధ్యత అల్లాహ్ మార్గంలో పరిశ్రమించటం అని తెలుస్తుంది. అతని కర్తవ్యం దేవుని గొప్పతనాన్ని, ఏకత్వాన్ని ప్రజలలో తీసుకెళ్లటమే. ఇదే అల్లాహ్ చెబుతున్నాడు.
“వస్త్రం కప్పుకుని పడుకున్న ఓ మనిషీ! లే; లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు” - 74:1-3
ముస్లిం సమాజంలో సాఫల్యం పొందే ముస్లిములు ఎవరు!?
ఇది కాస్త వినటానికి చిత్రంగా అనిపించవచ్చు! ముస్లిం సమాజంలో సాఫల్యం పొందే ముస్లిములు వేరేగా ఉంటారా? అదేమిటి? ముస్లిం అంటేనే అల్లాహ్ కు విధేయుడు కదా!? సాఫల్యం పొందేవారే ముస్లిములు కదా? అని కొందరికి అనిపించవచ్చు. ఒకసారి ఎవరు సాఫల్యం పొందుతారో అల్లాహ్ చెబుతున్న ఈ క్రింది ఖురాన్ వాక్యాలను గమనించగలరు.
“మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించేవారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు” – 3:104
“విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరులు, వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నామాజును స్థాపిస్తారు. జకాత్ ఇస్తారు. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు. వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు” - 9:71
పై రెండు ఖురాన్ వాక్యాల్లో “ఈ పనిని (ధర్మప్రచారం) చేసేవారే సాఫల్యం పొందుతారు” “(ధర్మప్రచారం చేసే) వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు” అన్న వాక్యాలను బట్టి ఒక్క ధర్మప్రచారం చేసేవారే సాఫల్యం పొందుతారు మరియు అలాంటి వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని అవతరింపజెయ్యాడు అన్న విషయం సుస్పష్టమవుతుంది. ఈ ప్రచార బాధ్యతను నిర్వర్తించాల్సిన విధంగా నిర్వర్తించకపోవటం వలనే నేడు ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వర్గంగా ఉన్నప్పటికీ ఇతర వర్గాలవారి దృష్టిలో ఎంతో చులకన భావం కలిగి ఉన్నారు. మరోప్రక్క గాజా, సిరియా, ఇరాక్, పాలస్తీనా దేశాల నుండి గుజరాత్, రోహింగ్య దాడుల వరకు ముస్లిం సమాజం అనేక అత్యాచారకు గురౌతూనే ఉంది. ఈ దాడులన్నిటిలో కొన్ని వేల మంది ముస్లిములు దారుణంగా చంపబడుతున్నారు. ఇంత దారుణంగా యూదుల, క్రైస్తవుల ఇతర వర్గాల చేతుల్లో అనేక ముస్లిములు అన్యాయంగా చంపబడేంత ఉపద్రవాలు వస్తూ ఉండటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుంటుంటే దానికి సమాధానంగా ఈ క్రింది వాక్యాన్ని గమనించాల్సిందే.
“ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాని వల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు” - 8:29
అత్యంత గమనార్హమైన పై వాక్యంలో చెప్పబడుతున్న విషయం- ఏదైనా ఒక సమాజంపై అల్లాహ్ తరఫునుండి విరుచుకుపడే సామూహిక ఉపద్రవాలు కేవలం ఆ సమాజంలో పాపులకు మాత్రమే పరిమితం అవ్వవు. కానీ, ఆ సమాజంలో వారి చెడు చేష్టలను చూస్తూ, సమాజ సంస్కరణ పట్ల ఎటువంటి బాధ్యతా వహించని వారు సైతం ఆ ఉపద్రవంలో కొట్టుకుపోతారని అర్థం. అయితే అలాంటి ఉపద్రవాలనుండి అల్లాహ్ ఎవరిని కాపాడతాడో తెలిసుకోవాలంటే ఈ క్రింది ఖురాన్ వాక్యంలో చెప్పబడుతున్న ఓ సంఘటన ద్వారా తెలుసుకోగలం.
“ఇంకా వారికి ఈ విషయం కూడా గుర్తుచేయి. వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గం వారితో ఇలా అన్నారు: “మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు అల్లాహ్ నాశనం చెయ్యనున్నవారికి లేక కఠినంగా శిక్షించనున్నవారికి?” వారు ఇలా సమాధానం చెప్పారు: “మేము మీ ప్రభువు ముందు క్షమించబడటానికి ఒక కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము. బహుశా ఈ ప్రజలు ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉంటారనే ఆశతో చేస్తున్నాము”. చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధను పూర్తిగా విస్మరించినప్పుడు మేము చెడునుండి ప్రజలను వారించే వారిని రక్షించాము. దుర్మార్గులైన అందరినీ వారి అవిధేయత కారణంగా కఠిన శిక్షకు గురిచేసాము” – 7: 164-165
పై సంఘటనలో చెప్పబడుతున్న పట్టణంలో మొత్తం మూడు రకాల ప్రజలు ఉండేవారు. మొదటి రకంవారు- బహిరంగంగా దైవాజ్ఞలను తిరస్కరించేవారు. రెండవ రకంవారు- వీరు తిరస్కారులైతే కాదు కానీ, ఇతరులు దైవాజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పటికీ వారిని సంస్కరించే విషయంలో మౌనంగా ఉన్నవారు. మూడవ రకంవారు- దైవసందేశం ద్వారా ప్రజలు ఋజుమార్గం పై వస్తారనే ఆశ కలిగి, మంచిని ఆజ్ఞాపించటంలో, చెడు నుండి ప్రజలను ఆపటంలో చురుకుగా ఉన్నవారు. పై సంఘటనలో ప్రతిఒక్కరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఒక వర్గం వారు “మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు అల్లాహ్ నాశనం చెయ్యనున్నవారికి లేక కఠినంగా శిక్షించనున్నవారికి?” అని అన్నప్పుడు సందేశదాతలైన రెండవ వర్గంవారు చెబుతున్నది ఏమిటంటే- “మేము మీ ప్రభువు ముందు క్షమించబడటానికి ఒక కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము. బహుశా ఈ ప్రజలు ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉంటారనే ఆశతో చేస్తున్నాము”. దీనిని బట్టి దైవసందేశం ఇస్తూ ఉన్నప్పుడు కచ్చితంగా ప్రజలు దైవవిధేయులుగా మారాలనే తపన అయితే ప్రతీ విశ్వాసీ కలిగి ఉండాలి. అయినప్పటికీ, ఒకవేళ ఎవరికైతే అతను సందేశం వినిపిస్తున్నాడో వారు అతని సందేశాన్ని నమ్మినా, నమ్మకపోయినా, అంగీకరించినా, తిరస్కరించినా ఒక ముస్లింగా అతను నిర్వర్తించాల్సిన బాధ్యత తీరిపోయినట్లే తద్వారా దేవుని సమక్షంలో అతను క్షమించబడటానికి మరియు తన కర్తవ్య నిర్వహణ సమర్పించుకునేందుకు.
చాలామంది సందేశదాతలు “క్రైస్తవులకు, హిందువులకు ఎంతచెప్పినా వినరండీ! అడ్డంగా వాదిస్తూ ఉంటారు! అలాంటి వారికి చెప్పటమే వేస్టు!!” అని తీర్మానించేస్తుంటారు పైసంఘటనలో మాదిరిగా! ఇక్కడ గమనించాల్సిన విషయం- ప్రజలు వింటారా, వినరా అన్నది కాదు మీరు మీ సందేశాన్ని ఇచ్చే బాధ్యతను నిర్వర్తిస్తున్నారా? లేదా? అన్నదే. కేవలం సందేశదాత పై ఉన్న బాధ్యత సందేశం చేరవెయ్యటమే. ధర్మస్వీకారం కొరకు శ్రోతల హృదయాలను తెరిచే బాధ్యత అల్లాహ్ ది! అయితే చెప్పటం వరకే మా బాధ్యత అన్నట్టు కాకుండా లేక ఎలా పడితే అలా ప్రజలతో మాట్లాడెయ్యక దేవుడు సందేశాన్ని ఎలా ఇవ్వమంటున్నాడంటే “ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమ రీతిలో వాదించు” - 16:125 అని చెబుతున్నాడు. కాబట్టి ప్రజలతో 1. వివేకంతో మాట్లాడాలి. 2. చక్కని హితబోధ చెయ్యాలి 3. ఉత్తమోత్తమ రీతిలో వాదించాలి. తప్ప విమర్శాత్మకంగా, హేళనగా, కోపోద్రేకాలు ప్రేరేపించే విధంగా మాట్లాడకూడదు.
సరే, ఇంతకూ పై ఖురాన్ వాక్యంలో చెప్పబడుతున్న సంఘటనలో మొత్తం మూడు రకాల ప్రజలలో అల్లాహ్ ఎవరిని కాపాడాడు? అంటే- “మేము చెడునుండి ప్రజలను వారించే వారిని రక్షించాము. దుర్మార్గులైన అందరినీ వారి అవిధేయత కారణంగా కఠిన శిక్షకు గురిచేసాము” అంటే ఒక్క సందేశ బాధ్యత నిర్వర్తించే వారిని తప్ప తిరస్కారులతో పాటు, సందేశ ప్రచారం పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని సైతం అల్లాహ్ తన శిక్షకు గురిచేసేశాడు. అందుకే “ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాని వల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు” - 8:29 అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నేటి సార్వత్రిక ముస్లిం సమాజం తమపై విరుచుకుపడుతున్న ఉపద్రవాలనుండి బయటపడాలంటే అల్లాహ్ కారుణ్యం నూటికీ నూరుశాతం కురియాలంటే తాము ఇళ్లల్లో ముఖ్మల్ గుడ్డలో చుట్టి, దాచి ఉంచిన ఖురాను గ్రంథాలను బయటకు తీసి, అందులో ఉన్న దైవ సందేశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లటం ఒక్కటే మార్గం! ఒకసారి ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.
“ఒక జాతి తన నడవడికను మార్చుకోనంతవరకు, అల్లాహ్ తాను దానికి ప్రసాదించిన అనుగ్రహాలను ఉపసంహరించడు” - 8:53
పై అల్లాహ్ ఆదేశాన్ని బట్టి అల్లాహ్ ముస్లిం జాతికి ఇచ్చిన గొప్ప అనుగ్రహాలను ఉపసంహరించుకోకుండా ఉండాలంటే ఎవరో ఒకరో ఇద్దరో కాదు సార్వత్రిక ముస్లిం జాతి తన నడవడికను ఖురాన్ కు అనుగుణంగా మార్చుకోవాల్సిందే! ఇప్పుడు ఈ క్రింది ఖురాన్ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి.
“యదార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చస్తారు. తౌరాతులో, ఇంజీలులో, ఖురానులో వారికి అల్లాహ్ చేసిన (స్వర్గం) యొక్క వాగ్దానం సత్యమైనది. తన వాగ్దానం నెరవేర్చటంలో అల్లాహ్ ను మించినవాడెవడు? కనుక సంబర పడండి మీరు దేవునితో చేసిన ఈ వర్తకానికి; ఇదే అన్నిటికంటే మహత్తర సాఫల్యం. అల్లాహ్ వైపునకు మాటి మాటికీ మరలేవారూ, ఆయనను ఆరాధించేవారూ, ఆయనను స్తుతించేవారు, ఆయన కొరకు భూమిమీద సంచారం చేసేవారు, ఆయన సన్నిధిలో రుకూ, సజ్దాలు చేసేవారు, మంచిని చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు చేయవద్దు అని నిరోధించేవారూ అయినటువంటి విశ్వాసులకు (ఓ ప్రవక్తా) శుభవార్త అందజెయ్యి” - 9:111-112
పై వాక్యం అయితే ఇక అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఇందులో అయితే ముస్లిముల ప్రాణాలను, వారి సంపదను అల్లాహ్ స్వర్గానికి బదులుగా కొన్నానని చెబుతున్నాడు. దీనిని బట్టి స్వర్గం కొనాలనుకునే ముస్లిములు భూమంత బంగారం ఇచ్చినా ఆ నిత్య స్వర్గాన్ని కొనలేరు కేవలం వారి ప్రాణాలను, సంపదను ఇవ్వటం ద్వారా తప్ప. ప్రాణాలను అర్పించటం అంటే ఓ ముస్లిం అవసరమైతే అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే విధంగా ఉండాలి. కాబట్టి పై వాక్యాన్ని బట్టి అల్లాహ్ వైపు మరలటం, ఆయనను ఆరాధించటం, రుకూ, సజ్దాలు చేయటంతో పాటు “మంచి చేయండి అని ఆజ్ఞాపించటం, చెడు నుండి ఆపటం” అన్న మానవాళిని సంస్కరించే అల్లాహ్ ఇచ్చిన గొప్ప బాధ్యతను నిర్వర్తించేవారికే అల్లాహ్ తరఫు నుండి శుభవార్తలు అందుతాయి అని తేటతెల్లమవుతుంది.
“ప్రవక్త (స) మాకు ఆదర్శం” అని చెప్పే అర్హత కలిగిన వారెవరు?
నిజానికి ముస్లిం సమాజం ప్రవక్త ముహమ్మద్ (స) వారి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఎంత అంటే ఆయన విషయంలో ఎవరైనా ఏ కాస్త నోరు జారినా చాలు మొత్తం ముస్లిం సమాజం ఎంతో సెన్సిటివ్ గా రియాక్ట్ అవ్వటం జరుగుతుంది. మంచిదే! మరి ప్రవక్త (స) సున్నత్ (సాంప్రదాయాల) గురించి అంతగా వాదులాడేవారు మరి సందేశం ఇచ్చే విషయంలో ప్రవక్త ఆదర్శం అవసరం ఉండదంటారా? ప్రజలకు సందేశం ఇచ్చే విషయంలో ప్రవక్త (స) ఎంతగానో పరితపిస్తూ, విపరీతమైన వేదనకు గురైపోయేవారు. ఎంతగా అంటే...
“ప్రవక్తా! వారు విశ్వసించరు అని దుఃఖ పడుతూ, బహుశా నీవు నీ ప్రాణాలు కోల్పోతావేమో” - 26:3
ఇంతిలా అల్లాహ్ యే స్వయంగా చెబుతున్నాడంటే ప్రవక్త ముహమ్మద్ (స) దైవసందేశం ప్రజలకు అందించే విషయంలో ఎంతటి ఆవేదనకు గురైపోయేవారో తెలుస్తుంది. కాబట్టి నిజంగా “ప్రవక్త (స) మాకు ఆదర్శం” అని చెప్పగలిగే అర్హత ఉన్నవారు ఎవరు కాగలరు? అంటే... కేవలం నమాజ్, రోజా, హజ్ ఇతరత్రా క్రతువులను నిష్ఠగా పాటించటమే కాదు, ప్రజలకు దైవ సందేశం అందించే విషయంలో ప్రవక్త (స) నిత్యం కలిగి ఉండేటువంటి పై విధమైన వేదనను, తపనను సైతం కలిగి ఉండాలి. అలాంటి వారు మాత్రమే “ప్రవక్త (స) మాకు ఆదర్శం” అని చెప్పగలిగే అర్హత ఉన్నవారు కాగలుగుతారు. లేదంటే నామ మాత్ర ప్రవక్త ప్రేమికులే కాగలరు.
సాఫల్యానికి మార్గం – ధర్మ అనుసరణ, ధర్మ ప్రచురణ ఒక్కటే!
“అల్లాహ్ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి, నేను దైవ విధేయుడిని అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట ఎవరిది కాగలదు?” – 41:33
ఇస్లాం పట్ల ప్రతి ముస్లిం రెండు విధాలైన సంబంధాలను కలిగి ఉన్నాడు. 1. ధర్మ అనుసరణ 2. ధర్మ ప్రచురణ. ఇదే విషయాన్ని పై ఖురాన్ వాక్యంలో గమనించగలం. “అల్లాహ్ వైపునకు పిలిచి” అన్నది ధర్మ ప్రచారం అన్న పరిధిలోనికి వస్తుంది. “మంచి పనులు చేసి” అన్నది ధర్మ అనుసరణ పరిధిలోనికి వస్తుంది.
“అల్లాహ్ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి, నేను దైవ విధేయుడిని అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట ఎవరిది కాగలదు?” అని అల్లాహ్ యే చెబుతున్నదానిని బట్టి అల్లాహ్ దృష్టిలో ఉత్తముడు ఎవరంటే 1. ధర్మ అనుసరణ 2. ధర్మ ప్రచురణ అన్న రెండు పనులనూ చేసే ముస్లిం మాత్రమే! కాబట్టి ప్రతీ ముస్లిం తనకు ఉన్న పరిధిలో, తనకు ఉన్న అవకాశం మేరకు, తన జ్ఞానం మేరకు దేవుని సందేశాన్ని చేరవేస్తూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ (స) వారు చెప్పేదేమిటంటే- “మీలో ఎవరు చెడును చూస్తారో వారు దాన్ని చేత్తో ఆపాలి. అంత శక్తి లేకపోతే నోటితో. అదీ సాధ్యపడకపోతే కనీసం హృదయంతో ఇది విశ్వాసంలో అత్యంత హీనమైన స్థాయి”. ఈ రకంగా సమాజ సంస్కరణ అన్న తపన కలిగి ఉంటేనే ముస్లిం పరిపూర్ణ ముస్లిం కాగలడు. అందుకే అల్లాహ్ “విశ్వాసులరా మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి” – 2:208 అని తాకీదు చేస్తుంది.
ముస్లిముల బాధ్యత కేవలం ధర్మ ప్రచారం, సమాజ శీల నిర్మాణమే తప్ప మరొకటి లేదు!
మానవాళికి బద్ధ శత్రువైన సాతాను అందరికంటే ముఖ్యంగా సందేశదాతల మీదే తన ప్రభావం ఎక్కువగా వెయ్యటానికి చూస్తూ ఉంటాడు. అయితే దైవ సందేశం ఎలాగైనా ప్రజలకు అందించాలనే ప్రగాఢమైన తపన ఉన్న విశ్వాసులనైతే ఏమీ చెయ్యలేడు కానీ, సందేశానికి బదులు అతనికి తెలియకుండానే కొన్ని వ్యర్థ కార్యాకలాపాల్లో ఇరికించేసి, అనవసరమైన విషయాల మీద అతని టైమ్ ని, ఫోకస్ ని పెట్టేలా చేస్తుంటాడు. వివరంగా చెప్పాలంటే ఏదైనా విషయాన్ని చక్కటి విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్నోల్లని ధర్మానికి చెందిన విశ్లేషణలకు బదులు అనవసర విషయాలు, రాజకీయాలు, రాజకీయ వేత్తల గురించి వారి లోపాల గురించి ఎత్తి చూపుతూ పనికిమాలిన విషయాల్లో నిత్యం విశ్లేషణలు చేసుకుంటూ కూర్చునేలా చేసి, అలాంటి వాటి పట్ల ఆకర్షణ పెంచేస్తాడు. నిజానికి అల్లాహ్ ముస్లిం సమాజానికి చెబుతున్నదేమిటంటే-
“అల్లాహ్ మార్గంలో పరిశ్రమించండి. పరిశ్రమించవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందినీ ఉంచలేదు” - 22:78
కాబట్టి విద్యావంతులు, విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నవారు, చక్కగా వ్రాయగలిగే, చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు అసలు చెయ్యాల్సిన పని రాజకీయ విశ్లేషణలో, లేక మరొకటో కాదు అల్లాహ్ ఏ సేవకై ఎన్నుకున్నాడో ఆ పనిని సార్వత్రిక ముస్లిం వర్గం చేస్తూపోతే సమాజసంస్కరణ అనేది ప్రాక్టికల్ గా జరిగే అవకాశం ఉంటుంది. అయితే రచనాభిలాష ఉన్నవారు, సమాజం పట్ల, రాజకీయాల పట్ల అసలే స్పందించాల్సిన పని లేదా? అంటే స్పందించటంలో తప్పులేదు కానీ అదే పనిగా దానిమీదే ఉండిపోకూడదు. అసలు ముస్లిం చెయ్యాల్సిన డ్యూటీ అయితే "అల్లాహ్ మార్గంలో పరిశ్రమించవలసిన విధంగా పరిశ్రమించటమే!" పైగా ఆ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే గొప్ప విషయం ఏమిటంటే “ధర్మంలో మీకు ఏ ఇబ్బందినీ ఉంచలేదు” అని అల్లాహ్ యే చెబుతున్నాడు. నిజానికి “ఉత్తమ సమాజం” అనే ఏ హోదా అయితే నేడు ముస్లిములకు ఇవ్వబడిందో అది ఒకానొకప్పుడు యూదులకు ఇవ్వబడి ఉండేది. వారు నాడు చూపిన సందేశ ప్రచారంలో చూపిన నిర్లక్ష్యం, అవిధేయతల కారణంగానే ఆ గొప్ప హోదాను యూదుల నుండి తొలగించి, ముస్లిం సమాజానికి అల్లాహ్ ఒక బహుమానంగా ఇచ్చాడు. అటువంటప్పుడు “ముస్లిం సమాజ” నియామకం “అసలు లక్ష్యం” అయిన “సందేశ ప్రచార బాధ్యత”ను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడే అల్లాహ్ తరఫు నుండి కారుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వర్తించే విషయంలో అలక్ష్యం వహిస్తూ పోతే అకస్మాత్తుగా ఏదైనా ఉపద్రవం వచ్చిపడినప్పుడు ఎంత రోదించినా, ఎన్ని ఆర్తనాదాలు పెట్టినా ఆ భయంకర పరిస్థితులలో నుండి బయటపడే మార్గం ఇక ఉండదు.