Posted by Sakshyam Magazine on Saturday, February 16, 2019
World Interfaith Harmony Week Organized by U N O
భారత దేశ హిందు-ముస్లిం మత సామరస్యానికి, ఖురాన్ విధానం అవలంబించటమే శరణ్యం!?
ఉపోత్ఘాతం
నేటి ప్రపంచంలో ప్రకృతి వనరులకు, భౌతిక సంపదకు ఏమాత్రం లోటులేదు. అయినప్పటికీ, మానవాళిలో ఒకవైపు- నిర్దయ కలిగిన ధనికుల వలన సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. మరొకవైపు- మత బోధకుల సంకుచిత బోధనల కారణంగా మత వర్గాల మధ్య విమర్శ ప్రతి విమర్శలు పెరిగి పోతున్నాయి. పర్యవసానంగా ‘సామరస్యం’ తరిగి ‘అసహనం’ రోజురోజుకీ పెరిగి పోతుంది. అణ్వస్త్రాల వంటి అత్యంత వినాశనకర అణ్వాయుధాలు కలిగి ఉన్న నేటి ప్రపంచానికి ఏ విధమైన అసహనమైనా ప్రమాదమే!
ఈ నేపథ్యంలో U N O ‘ప్రపంచ మత విశ్వాసాల మధ్య సామరస్య వారోత్సవం’ నిర్వహించే బాధ్యత తీసుకోవటం ముదావహం. ఈ మహోద్యమం నిర్వహించటాన్ని ప్రభుత్వాలకి, సంస్థలకి తప్పనిసరి చేయటం సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పక తప్పదు. గత ముప్ఫై ఐదు సంవత్సరాలుగా నేను ఇదే ప్రయత్నంలో ఉన్నాను. అలాంటి నన్ను ఈ యజ్ఞంలో భాగస్థుణ్ణి చేసినందుకు ‘A Little Kindness Trust - Haydarabad’ వారికి కృతుజ్ఞతలు తెలుపుతున్నాను.
మత మౌలిక మూలాలు రెండు
ఏ మతానికైనా ప్రదానమైన మూలాలు రెండు ఉంటాయి. వాటిలో...
1. ధర్మ శాస్త్రాలు
2. వాటిని అందించిన రుషులు లేక ప్రవక్తలు
ఇవి రెండూ ఆ యా మతస్థులకు ప్రాణంకన్న ప్రియమైనవై ఉంటాయి. కనుక ఏ మతస్థుడూ తమ తోటి మతస్థులకు చెందిన పై రెండిటిని విమర్శించటం గాని, ఖండించటం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.
ధర్మ శాస్త్రాలు సామరస్యం బోధిస్తున్నాయి!
ఇక్కడ నేను ఒక వాస్తవాన్ని చెప్పి, దాని ఆధారలను చూపిస్తాను. వాస్తవం ఏమిటంటే- ‘మన ధర్మ శాస్త్రాలైన గీతా-బైబిల్-ఖురాన్ ‘మత సామరస్యాన్ని తప్పనిసరి చేసి, బోధిస్తున్నాయి’. కానీ, హిందు-ముస్లిం-క్రైస్తవ వర్గాలకు చెందిన ‘అధిక శాతం మత బోధకులు మత వైషమ్యాన్ని కల్పించి, పోషిస్తున్నారు’.
"మీ మత బోధనలు కేవలం కట్టుకథలు. మావే సత్య బోధనలు. కనుక మీ మతాన్ని వడచి, మా మతంలో మారండి!" అని ఒక మత వర్గం మరొక వర్గంలో ప్రచారం చేసే విధానం మత సామరస్యాన్ని పాడుచేసి, మత వైషమ్యం పెంచుతుంది. అటు- మన ఉమ్మడి రాజ్యాంగం ఎవరి మత గ్రంథాలను - మహా పురుషులను వారు అనుసరించుకుంటూ, తోటి మత వర్గం వారికి చెందిన మత గ్రంథాలను - మహా పురుషులను గౌరవించమంటుంది.
ఇక ఖురాన్ గ్రంథమైతే ఒక అడుగు ముందుకువేసి ఎదుటి వారి మత గ్రంథాలను - మహా పురుషులను గౌరవించటమే కాక, అవి సత్యమైనవని విశ్వసించమని ఆదేశిస్తుంది!. అటు రాజ్యాంగం ఇటు ఖురాన్ ఇస్తున్న ఆదేశాన్ని కనుక పాటిస్తే, మత వైషమ్యం అంతమై మత సామరస్యం పరివాప్తి చెంది, మ దేశం శక్తివంతం కాగలదనటంలో ఎలాంటి అతి సయోక్తి లేదు.
వ్యక్తులకు మతం ఎలా లభిస్తుంది?
వివిధ వ్యక్తులకు వివిధ మతాల్లో ఉండటానికి రెండు కారణాలు. వాటిలో...
1. ఆ యా మతాలకు చెందిన తలిదండ్రులకు జన్మించటం (By chance)
2. ఆ యా మతాలను ఇష్టపూర్వకంగా స్వీకరించటం (By choice)
మత సామరస్యం అంటే ఏమిటి?
తన మత గ్రంథాన్ని తన మత ప్రవక్తను 1) విశ్వసిస్తూ 2) అనుసరిస్తూ, ఇతరుల మత గ్రంథాలను, మత ప్రవక్తలను ‘విశ్వసించటం’. ఇదే మత సామరస్యం!
మత వైషమ్యం అంటే ఏమిటి?
తన మత గ్రంథాన్ని తన మత ప్రవక్తను 1) విశ్వసిస్తూ 2) అనుసరిస్తూ, ఇతరుల మత గ్రంథాలను, మత ప్రవక్తలను ‘తిరస్కరించటం’. ఇదే మత వైషమ్యం!
ఖురాన్ మత సామరస్యం బోధిస్తుందా?
ఖురాన్ అవతరణా నేపథ్యంలో యూదులు క్రొత్త నిబంధనను, క్రైస్తవులు పాత నిబంధనను విశ్వసించేవారు కాదు. ఆ రెండిటినీ అరబ్బు బహుదైవోపాసకులు విశ్వసించేవారు కాదు. వీరంతా కలసి ప్రవక్త ముహమ్మద్పై అవతరిస్తున్న ఖురాన్ను విశ్వసించేవారు కాదు. అంటే ఎవరి గ్రంథాన్ని వారు తప్ప ఒకరి గ్రంథాన్ని ఒకరు విశ్వసించేవారు కాదన్నమాట.
దాని కారణంగా ఆనాటి మత వర్గాల మధ్య ‘మత సామరస్యం’ పూర్తిగా మృగ్యమై, సర్వత్రా విపరీతమైన ‘మత వైషమ్యం’ తాండవించేది. పర్యవసానంగా ఆనాటి సమాజం నిత్య రణరంగంగా ఉండేది. అలాంటి సందర్భంలో అల్లాహ్ ముస్లిములకు ఇస్తున్న ఆదేశం ఏమిటో గమనించగలరు.
ప్రవక్త ముహమ్మద్ తన ప్రభువు తరఫు నుండి తనపై అవతరించిన దానిని (అనగా ఖురాన్ను) విశ్వసించారు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడ దానిని (అనగా ఖురాన్ను) విశ్వసించారు.
వారంతా (అనగా ప్రవక్త ముహమ్మద్ మరియు ప్రవక్తను విశ్వసించేవారు) అల్లాహ్నూ, ఆయన దూతలనూ, ఆయన అవతరింపజేసిన గ్రంథాలను మరియు ప్రవక్తలను విశ్వసిస్తారు. ఇంకా- “మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావము చూపము” అని ప్రకటిస్తారు. “మేము (నీ ఆదేశం) విన్నాము మరియు శిరసా వహించాము” అని ప్రకటిస్తారు. ఇంకా- “నీ క్షమాబిక్షను అర్థిస్తున్నాము. కనుక ఓ మా ప్రభూ! మా పయనం నీ వైపునకే” అని కూడ ప్రకటిస్తారు. -2:285
విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మరియు ఆయనపై అవతరించిన దానిని (అనగా ఖురాన్ను) ఇంకా, ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. -4:136
పై వాక్యాల ప్రకారం- “ముస్లిములు తమ వద్ద ఉన్న ఖురాన్ గ్రంథాన్నే కాక, దానికి పూర్వం అవతరించిన సకల ధర్మ గ్రంథాలనూ విశ్వసించాలి” అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇక, ప్రవక్త ముహమ్మద్తో పాటు, ‘సకల ప్రవక్తలను విశ్వసించము’ అనే వారిని అల్లాహ్ ఎంత తీవరంగా గద్ధిస్తున్నాడో ఈ క్రింది గమనించగలరు.
నిశ్చయంగా అల్లాహ్ను ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారు మరియు నిశ్చయంగా అల్లాహ్ను ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారు. ఇంకా, మేము కొందరిని విశ్వసిస్తాము, కొందరిని తిరస్కరిస్తము అని అనే వారు (విశ్వాస - అవిశ్వాసలకు) మధ్య (ఒక సరి క్రొత్త) మార్గాన్ని కల్పించేవారు. ఇలాంటివారే నిశ్చయంగా ప్రరమ తిరస్కారులు. అలాంటి వారి కొరకు మేము అవమాన భరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము. -4:150,151
“ప్రవక్త ముహమ్మద్తో పాటు, ఆయనకు పూర్వపు సకల పరవక్తలను కూడ విశ్వసించాలి” అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు ఆవిధంగా విశ్వసించని వారు అవిశ్వాసులే కాక పరమ అవిశ్వాసులు అని అల్లాహ్ తీర్మానిస్తున్నాడు.
ముస్లిములు కేవలం ఖురాన్లో పేఏర్కొన్న ప్రవక్తలనే విశ్వసించాలా?
ఖురాన్ అరబ్బు దేశానికి చెందిన మక్కా-మదీనా నగరాల్లో మాత్రమే అవతరించినా, దాని సందేశం విశ్వజనీనం. అయితే మక్కా-మదీనాల్లో ఉన్న ప్రవక్త మరియు ఆయన సహచరులు ఏ విధంగానైతే ఒకవైపు- ఖురాన్ గ్రంథాన్ని, ప్రవక్త ముహమ్మద్ను అనుసరిస్తూనే, మరొకవైపు- అక్కడి స్థానిక ప్రజలకు- "మీ గ్రంథాల పట్ల మరియు మీ ప్రవక్తల పట్ల మేము విశ్వాసము కలిగి ఉన్నాము" అన్న మత సామరస్య సందేశం ఇస్తే, దానికి ప్రతి స్పందనగా వారు కూడ తిరిగి- "మేమూ మీ ఖురాను గ్రంథం పట్ల మరియు మీ ప్రవక్త ముహమ్మద్ పట్ల విశ్వాసము కలిగి ఉన్నాము" అని ప్రకటించారు.
సరిగ్గా అదే ఆదర్శమును అనుసరించి, ఆ యా దేశాల్లో ఉన్న ముస్లిములు, ఒకవైపు- ఖురాన్ గ్రంథాన్ని, ప్రవక్త ముహమ్మద్ను అనుసరిస్తూనే మరొకవైపు- స్థానిక గ్రంథాల పట్ల మరియు స్థానిక ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉనండాలి. అలా చేసేవారే నిజమైన విశ్వాసులు కాగలరు. ఇంకా, ముస్లిములకు ముస్లిమేతరులతో ఉన్న ‘మత వైషమ్యం’ కాస్తా ‘మత సామరస్యం’గా రూపాంతరం చెందుతుంది.
గమనిక: “అరబ్బు దేశ స్థానిక గ్రంథాలనే, స్థానిక ప్రవక్తలనే విశ్వసించాలి” అనే ఎలాంటి ఆదేశమూ అటు- ఖురాన్లో కానీ, ఇటు- ప్రవక్త ముహమ్మద్ బోధనల్లో కానీ లేదన్నది గమనార్హం. అలా కనుక ఉంటే, ఖురాన్ సందేశం ప్రాంతియమే తప్ప విశ్వజనీనం కాబోదు కదా!
అల్లాహ్ ఈ సమాచారం ఎందుకు ఇస్తున్నాడు?
ఖురాన్ ద్వారా అల్లాహ్ అందిస్తున్న ప్రతి సమాచారమూ అర్థవంతమైనదే! అంటే, ఖురాన్లో అల్లాహ్ అందించిన ప్రతి విషయంలోనూ ఏదో ప్రబోధ దాగి ఉంటుంది. దానిని కనుగొనటం విశ్వాసుల విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏమిటో గమనించగలరు.
ఇంతకు ముందు నీతో ప్రస్తావించిన (అనగా అబ్రాహీం సంతతిలో ప్రభవించిన) ప్రవక్తల వైపునకు సందేశం (అనగా శృతిని) పంపించాము. ఇంకా, నీతో ప్రస్తావించని (అనగా నూహ్ సంతతిలో ప్రభవించిన) ప్రవక్తల వైపునకు కూడ సందేశం (అనగా శృతిని) పంపించాము... -4:164
నీతో ప్రస్తావించిన ప్రవక్తలు అనగా అబ్రాహీం సంతతిలో ప్రభవించిన ప్రవక్తలు అని మరియు నీతో ప్రస్తావించని ప్రవక్తలు అంటే నూహ్ సంతతిలో ప్రభవించిన ప్రవక్తలని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించే వారికి ఈ క్రింది వాక్యమే సమాధానం.
మేము నూహ్నూ, ఇబ్రాహీమ్నూ పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ పెట్టాము. -57:26
అల్లాహ్ ఇస్తున్న పై సమాచారాన్ని బట్టి, ‘ప్రస్తావించని ప్రవక్తలు’ అనగా నూహ్ సంతతిలో వచ్చిన వారు కాకపోతే మరెవరు కాగలరు!?
ఇక, నూహ్ అనగా మహారుషి మనువు అని కొందరు ఖురాన్ వ్యాఖ్యాతలు ప్రకటించి ఉన్నారు. చారిత్రకంగా పరిశీలించినా అది పూర్తిగా వాస్తవమని నిర్ధారణ అవుతుంది. అటు- అరబ్బు దేశంలో వేలాది ప్రవక్తలు, వందలాది ధర్మ గ్రంథాలు ఉన్నాట్లే, ఇటు- మన హిందూ దేశంలోనూ వేలాది రుషులు, వందలాది ధర్మ గ్రంథాలు ఉన్నాయి. మేము చేసిన ఈ పోలిక ఖురాన్ ఇస్తున్న సమాచారం సత్యమైనదని నిరూపిస్తుంది. కనుక భారత దేశంలో ఉన్న ధర్మ గ్రంథాలూ, రుషులూ అల్లాహ్ ఇచ్చతోనే సంభవించారని గుర్తించవలసి ఉంటుంది.
భారత దేశ హిందూ-ముస్లింల వర్గాల మధ్య మత సామరస్యానికి ఖురాన్ ఆదేశిస్తున్న విధానమే శరణ్యం ఎలా అవుతుంది!?
ఎలాగైతే అరబ్బు దేశ మక్కా-మదీనా నగరాలకు చెందిన 'ముష్రికుల్లో' అనగా 'బహుదైవోపాసకుల్లో' 'యహూద్ వ 'నసారాల్లో' అనగా 'యూద మరియు 'క్రైస్తవుల్లో' నిలబడి ఏవిధమైన ప్రకటన చెయ్యమని అల్లాహ్ సకల ముస్లిములకు ఆజ్ఞాపిస్తున్నాడో ఈ క్రింది గమనించగలరు.
'...ఖూలూ ఆమన్నా బిల్లజీ ఉంజిల ఇలైన వ ఉంజిల ఇలైకుం...' అనగా- (ముస్లిములారా!) మిరంతా (ముస్లిమేతరుల సమక్షంలో నిలబడి)- "మేము మాపై అవతరించిన దానిని (అనగా ఖురాన్ను) మరియు మీపై అవతరించిన దానిని కూడ విశ్వసించాము అని ప్రకటించండి!" (29:46)
అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. దాని ప్రకారం- ప్రవక్త ముహమ్మద్ ఆయన ప్రియతమ సహచరులు నాటి కాలంలో పై విధంగా ప్రకటించారు. అదే విధానంలో నేడు భారతీయ ముస్లిమేతరుల మధ్య నిలబడి నేటి ముస్లిములు ప్రకటన చేసినట్లైతే, భారత దేశంలో ఉన్న మత వైషమ్యం అంతమై, మత సామరస్యం ఏర్పడగలదంటలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే, అది ఖురాన్ చూపిస్తున్న పరిష్కారం కనుక!
ఖురాన్ ప్రకారం-ఒకరి ధార్మిక గ్రంథాన్ని ఒకరు విశ్వసించకపోతే నరక శిక్షలా!?
మానవులు చేసిన మేలు ఔన్నత్యాన్ని బట్టి అల్లాహ్ ఇచ్చే బహుమానపు ఔన్నత్యం ఉంటుంది. అలాగే మానవులు చేసిన కీడు తీవ్రతను బట్టి అల్లాహ్ విధించే శిక్షల తీవ్రత ఉంటుంది. ఇదే అల్లాహ్ సాంప్రదాయం. ఈ క్రింది రాబోయే వాక్యంలో ఏ నేరం కారణంగా తీవ్ర శిక్షలు విధిస్తానని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడో గమనించగలరు.
అల్లాహ్ వాక్యాల (అనగా దృక్పథాల) విషయంలో వాదులాడే వారిని నీవు చూడలేదా? ఇంతకూ వారెక్కడికి మరలించబడుతున్నట్లు? వారు ఈ ఖురాను గ్రంథాన్నీ, మా ప్రవక్తల ద్వారా పంపబడిన గ్రంథాలను కూడ ధిక్కరించారు. (దీని పర్యవసానాన్ని వారు) తెలుసుకుంటారు. అప్పుడు వారి మెడల్లో కంఠ పాశాలు ఉంటాయి. సంకెళ్ళు కూడ ఉంటాయి. వారు సలసల కాగే నీటిలో ఈడ్వబడతారు. తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు. -40:69-72
చాలా తీవ్రమైన శిక్షలను గురించి అల్లాహ్ హెచ్చరిస్తున్న వైనం పై వాక్యా ల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. దానికి గల కారణం కూడ సుస్పష్టమే. అది, ‘తమ తమ గ్రంథాను మాత్రమే విశ్వసిస్తూ, ఒకరి ధర్మ గ్రంథాలను ఒకరు విశ్వసించకపోవటం!’
అల్లాహ్ ఇస్తున్న ఈ దృక్పథాన్ని అంగీకరించకపోయిన కారణంతోనే కదా ఒకవైపు- డబ్భై శాతం ప్రజలు కనీస అవసరాలు తీరక ఘోర యాతనలు అనుభవిస్తున్నారు. మరోవైపు- యావత్ ప్రపంచాన్ని సర్వ నాశనం చేసే అణ్వాయుధాల నిర్మాణానికి వాటి నిర్వాహణకు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యం మానవాళి పాలిట అతి దారుణమైన శాపం కాదా!? అవును, అందుకే ఈ దుస్థికి కారకులైన వారికి అత్యంత ఘోరమైన నరక శిక్షలను విధిస్తానని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు.
అల్లాహ్ ప్రకారం- మత సామరస్యానికి ముందడుగు ఎవరు వేయాలి?
ధర్మం గురించి చెప్పటం సులువే, ఆచరించటమే కష్టం. ఆచరణతో తప్ప, ఆకాంక్షలతో మత సామరస్యం రాదన్నది మీకు తెలియనిది కాదు. ఎవరి గ్రంథాలను వారు ఎలాగూ విశ్వసిస్తున్నారు. అల్లాహ్ కోరేది ఒకరి గ్రంథాన్ని ఒకరు విశ్వసించాలన్నదే! అయితే అది అత్యంత సాహసంతో కూడిన విషయం. ఇక మీ గ్రంథాన్ని విశ్వసిస్తున్నాము అని ప్రకటించటానికి ఎవరు ముందు అడుగు వేయాలి? అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఈ క్రింది వాక్యంలో చూడగలరు.
మీరైతే (అనగా ముస్లిములైతే) వారిని (అనగా ముస్లిములతో శత్రుత్వం వహించే వారిని) ప్రేమిస్తున్నారు. కానీ వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరైతే ధర్మ గ్రంథాలన్నిటినీ విశ్వసిస్తారు... -3:119
నిజమైన ముస్లిముల లక్షణాన్ని పై వాక్యంలో అల్లాహ్ తెలుపుతున్నాడు. ఎదుటి వారు మిమ్మల్ని ప్రేమించకపోయినా మీరు వారిని ప్రేమిస్తారు అని అలాగే ఎదుటి వారు మీ గ్రంథాలను విశ్వసించకపోయినా మీరు వారి గ్రంథాలను విశ్వసిస్తారని అల్లాహ్ స్వయంగా ప్రకటిస్తున్నాడు.
కనుక అల్లాహ్ ఆజ్ఞమేరకు- "మన భారత దేశ ధార్మిక సాహిత్యంలోనూ అల్లాహ్ అవతరింపజేసిన సందేశం ఉందని నేను విశ్వసిస్తున్నాను!" అని నా తోటి జాతీయులైన హిందూ ప్రజానీకం ముందు ప్రకటిస్తున్నాను.
పై వాక్యం ప్రకారం- ఈ వ్యాసం చదువుతున్న మీరు ఒకవేళ ముస్లిములైతే హిందువుల ముందు అలాగే ప్రకటించాలి. ఒకవేళ మీరు హిందువైతే- "ఖురను గ్రంథమును నేను విశ్వసిస్తున్నాను!" అని ప్రకటించాలి.
ఈ విధంగా మనమందరమూ కలసి ఎవరి గ్రంథాలను వారు అనుసరితున్నప్పటికీ, ఒకరి గ్రంథాలను ఒకరు విశ్వసిస్తూ, మత వైష్మ్యాన్ని అంతం చేసి, మత సామరస్యాన్ని పెంపొందిద్దాం. మన భారత జాతిని బలోపేతం చేద్దాం. ప్రపంచ శాంతిని కాపాడుదాం. జై హింద్!
Mushtaque Ahmad Abhilash, 98485 16362; 96664 88877;
(U N O తలపెట్టిన ‘ప్రపంచ మత విశ్వాసాల మధ్య సామరశ్య వారోత్సవం’ (1 నుండి 7-2-2019) సందర్భంగా ‘A Little Kindness Trust - Haydarabad’ వారు నిర్వహించిన సభలో చేసిన ప్రసంగం).