Posted by Sakshyam Magazine on Saturday, July 15, 2017
హిందువులలో అత్యధికులు సనాతన థర్మం గూర్చి వాదించేవారే గాని అసలు సనాతనథర్మమంటే ఏమిటో తెలియదు. హైందవ శాస్త్రాలైన వేదోపనిషత్తులు గాని, భగవద్గీత గాని ఎవరూ పెద్దగా చదవరు. ఎవరో స్వామీజీయో, బాబాయో చెప్పిన నాలుగు మాటలు వినేసి ఈ బ్రతుక్కి చాలు అనే ఉద్దేశ్యంతో ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ థార్మిక గ్రంధాలనేవి మనిషి ఏవిధంగా జీవించాలో మార్గాన్ని చూపించేవి. అటువంటి వీటినే ఇంత అశ్రద్ధ చేయడం సమంజసమా చెప్పండి. భక్తి పేరు చెప్పుకుని కనిపించిన ప్రతి బాబా మీద పడడం చాలా అజ్ఞానం. ఎవరికైతే వేద పరిజ్ఞానం ఉంటుందో వారి మాటలే అక్షర సత్యమవుతాయి అదీ వేద గ్రంధాలు సమర్ధిస్తేనే! నిజానికి ఈరోజుల్లో అటువంటి పండితులు బహు అరుదు! మనమే వేద నిపుణులు కావాలి. ఆ సర్వేశ్వరుడు అందరూ పఠించి పాటించడానికే ఆ అపౌరిషేయములు పంపించాడు తప్ప వాటిని కళ్ల కద్దుకుని ఏదో గూటిలో పెట్టుకుని పూజించడానికి కాదు. వాటిని పఠించి మనం ఎలా నడవాలో తెలుసుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనశ్శాంతి, ముక్తి రెండూ దక్కుతాయి. శాస్త్ర అనుచరణ లేకపోతే ఇవేవీ దక్కవు. ఈక్రింది శ్లోకం ఒకసారి చూడండి.
యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత:
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. గీత 16:23
తా:-
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తనయిష్టము వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు.
పై శ్లోకం ప్రకారం ఎవరైనా సరే తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే మనిషికి మనశ్శాంతిగాని, సుఖముగాని ముక్తిగాని ఏవీ దొరకవు. మన జీవితం శ్శాస్త్రప్రకారం ఉండాల్సిందే! ఆ బాబా ఇలా చెప్పాడు, ఈ స్వామీజీ ఇలా చెప్పాడని కాకుండా శాస్త్రం ఏమి చెప్పిందో దాని ప్రకారం నడవాలి. దానికి ఆధారం ఈ క్రింది శ్లోకం చూడండి.
తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. గీత:16:24
తా:-
కావున చేయదగునదియు,చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలిసికొని దానిననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును.
కాబట్టి మిత్రులారా మనం జీవితంలో ముఖ్యంగా భక్తి విషయానికి వస్తే శాస్త్ర అనుమతితోనే మన భక్తి భావాలుండాలి. మనక్రతువులుగాని, పూజలుగాని, ఆరాధనలుగాని ఏవైనా సరే శాస్త్ర అనుమతి ఉండాల్సిందే! అప్పుడే మనకు అన్నీ దక్కుతాయి. అంతేగాని నలుగురితో నారాయణ, గుంపులో గోవిందయ్య అనే చందాన మన జీవితం ఉండకూడదు. అసలైన భక్తి అంటే ఏమిటో, నిజమైన థర్మమంటే ఏమిటో ఆ వాస్తవ సృష్టికర్త ఎవరో తెలియాలంటే మనం ఈ వేద గ్రంధాలను అధ్యయనం చేయాలి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. జైహింద్!!