Posted by Sakshyam Magazine on Wednesday, September 2, 2015
సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుని పేరుతో
సర్వ సృష్ఠికర్త అయిన దేవుడే సర్వమానవాళినీ పుట్టించాడు. కనుక మానవులందరికీ కర్త ఒక్కడే. ఒక్కడైన ఆ దేవుడే మానవాళి భౌతిక అవసరాలైన గాలి, నీరు, వేడి, వెలుతురు మొదలైనవి ప్రసాదించాడు. వివిధ మత విశ్వాసాలు కలిగిన వారికి వేరువేరుగా కాకుండా అందరికీ సమాన స్థాయిలోనే వాటన్నింటిని అందిస్తున్నాడు. అదే విధంగా మానవ జీవన విధానాన్ని తెలియజేయడానికి సృష్టికర్త అవతరింపజేసిన గ్రంధాల బోధనలు అందరికీ సమానంగా ఉండాలనేది న్యాయం. మన దేశంలో ప్రామాణికంగా అలరారే గ్రంధాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి. అవి : గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలు. ఇవే కాకుండా భూమిపై నివసించే మానవాళి కోసం ప్రతి ప్రాంతంలో సృష్టికర్త తన తరుపున గ్రంధాలను అవతరింపజేశాడనే విషయం వాటి అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అవి అవతరించిన కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి వాటి భాషలు వేరు కావచ్చు కాని అవన్నీ ఒకే సృష్టికర్త నుండి వచ్చాయి కనుక వాటి "మౌలిక సందేశం" మటుకు ఒక్కటే అయి ఉండాలి.
అలాగే మనిషి మనో సంబంధమైన శాంతి సుఖముల వంటి వాటిని సాధించటానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేశాడు. అవి ధ్యానము, స్మరణ, సేవ ఇత్యాదివి. విత్తనాలు, సాగుచేసే విధానం ఉత్తమమైనది అయినప్పటికీ సాగు చేసే నేల (క్షేత్రం) సరైనది కాకపోతే పంటరాదన్నది జగమెరిగిన సత్యమే. సరిగ్గా అదే ప్రకారం సర్వసృష్టికర్త అయిన అసలు సీసలు దైవం ఎవరో గుర్తించక చేసే ధ్యానవ్రతాలు, దానధర్మాలు కూడా ఫలరహితమై పోతాయి. అందుకే నేడు గొప్ప,గొప్ప ఆధ్యాత్మికుల జీవితాలు సైతం అశాంతిమాయం అయి ఉన్నాయి. ఎందుకంటే- వాస్తవ దైవాన్ని గుర్తించక చేసే సకల ధార్మిక క్రతువులూ గురిలేని బాణాలు, బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే కాగలవు. కనుక మనం నిజమైన దైవాన్ని గుర్తించాలి. తద్వారా మన ధ్యాన వ్రతాల సంపూర్ణ ఫలితాన్ని పొంది, ఇహలోకంలో "మనో ప్రశాంతత"ను మరియు పరలోకంలో "ముక్తి"ని సాధించాలి.
అంతర్వాణి! - దాని ప్రత్యేకత ఏమిటి?
సర్వసృష్టికర్త అయిన దైవం ప్రతి మనిషి ఆంతర్యంలోనూ విచక్షణ చేసే అంతరాత్మను ఉంచాడు. దానినే మనస్సాక్షి లేక "అంతర్వాణి" అని అంటారు. దేని విషయంలోనైనా "ఉన్నది ఉన్నట్లు"గా చెప్పటమే దాని ప్రత్యేకత.
ఆకాశవాణి! - దాని ప్రాధాన్యత ఏమిటి?
మానవాళి ఇహ-పరాల ప్రశాంత మనుగడ కొరకు సృష్టికర్త ఆది నుండి తన మార్గదర్శకత్వాన్ని పంపిస్తూ వచ్చాడు. దానికి గాను ప్రజలలోని ఒక ఉత్తమ వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకుని, వానిపై తన సందేశాన్ని అవతరింపజేసేవాడు. ఆ విధమైన సందేశ అవతరననే "ఆకాశవాణి" అని అంటారు. అంటే ప్రవక్తలపై అవతరింప జేయబడే గ్రంధాలు, వాటిలోని ఆదేశాలే దైవాజ్ఞలు అవుతాయి. కనుక వాటి ప్రాధాన్యత ఏమిటో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
గీతా శాస్త్రం.
కావున నీవు చేయునదీయు, చేయరానిదియు నిర్ణయించునపుడు
శాస్త్రము నీకు ప్రమాణమైయున్నది. శాస్త్రమందు చెప్పబడిన దానిని
తెలుసుకొని దానిననుసరించి ఈ ప్రపంచమున కర్మము చేయవలెను. - 6:24
బైబిల్ శాస్త్రం.
మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించునట్లు ఆయన సన్నిధిని
ఈ సమస్తమైన ఆజ్ఞాలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు
మనకు నీతి కలుగును. ద్వితీ.కాం 6:25
ఖురాన్ శాస్త్రం
ఇది (ఖురాన్) శుభాలు కల ధర్మశాస్త్రం. కావున మీరు దీనిని
అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంభించండి. మీరు కరుణింప
బడటం సాధ్యం కావచ్చు. -6:155
దైవ ప్రోక్తమైన ఈ గ్రంధాలు కేవలం పుణ్యం కోసం పారాయణం చేసుకోవడానికి కాదు. అవి బోధించే సిద్ధాంతాలు మరియు ఆజ్ఞాల ప్రకారం ప్రజలు తమ జీవితాలను మలచుకోవాలనే ఉద్దేశ్యంతో సృష్టికర్త అయిన దైవం వాటిని అవతరింపజేశాడు. అవి ప్రతిపాదించే సమిష్టి జీవన మార్గదర్శక సూత్రాల అనుసరణలోనే మనందరి క్షేమం ఇమిడి ఉంది. కనుక ఆ గ్రంధాల వెలుగులో సృష్టికర్తను గుర్తించే మౌలిక విషయాలను ముందుగా తెలుసుకుందాం.
(ఇంకా వుంది)