సర్వోన్నతుడైన
సర్వేశ్వరుని పేరూతో...
అక్షరాశ్యత ఒక్కటే సకల సమస్యలకు
ఏకైక పరిష్కారం! విద్యా పరివ్యాప్తి వలనే ప్రగతి సాధ్యం! అన్ని దానల కన్నా
విద్యాదానం మిన్న! వంటి నినాదాలను ఒక్కసారి పునర్విచారించవలసి ఉంది. ఎందుకంటే-
ఎక్కడ అక్షరాశ్యులు, విద్యావంతులు ఉక్కువగా ఉన్నారో అక్కడే నేరాలు-ఘోరాలు
అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యతలు రెండు
ఉన్నాయి. వాటిలో...
మొదటిది- అత్యంత ఆధునిక విద్యావంతులు సైతం ఘోరాలు-నేరాలకు
పాల్పడటానికి మరియు మూఢ విశ్వాసాలను కలిగి,
నిరర్థక ఆచారాలు చేయటానికి గల కారణం ఏమిటో గుర్తించటం.
రెండవది- శాస్త్రీయ దృక్పథం కలిగి
అత్యంత విశాల దృష్టి, నిష్పక్షపాత వైఖరి మరియు తన-పర భేదం లేకుండా కేవలం న్యాయానికి మాత్రమే పట్టం
కట్టే ధైర్యవంతుల నిర్మాణం కావటానికి దోహదం చేసే విద్యను కనిపెట్టటం.
ఎందుకంటే- నేటి
ప్రపంచానికి ఆహార కొరత లేదు. సంపద కొరత లేదు. వైగజ్ఞానిక కొరత లేదు. ఆధునిక వైద్య
సదుపాయాల కొరత లేదు. విద్యావంతుల కొరత లేదు. ఉన్నదల్లా- 'ఉత్తమ పౌరుల' కొరత ఒక్కటే!!
'ఉత్తమ పౌరులు' మాత్రమే 'వ్యక్తిగత జీవితం'లో 'నైతికత'ను కలిగి, తమ మానసిక శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేసే తాగుడు
వ్యభిచారం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండగలరు. అలాంటి వారే 'సామూహిక జీవితం'లో 'మానవత'ను కలిగి ఉండి, ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషం లాంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉంటారు. వారే-
వ్యాపారంలో కల్తీ, లావాదేవీల్లో పరిపాలన నిర్వాహణ లాంటి కార్యకలాపాలలో
మోసం, వంచన, దగ వంటి నేరాలకు పాల్పడరు.
నేటి ఆధునిక ప్రపంచంలో
నేరాలు-ఘోరాల్లో అగ్రస్థానంలో ఉన్నది- విద్యావిహీనులా? విద్యావంతులా?
నేటి మానవ సమాజం 'ఉత్తమ పౌరుల' కొరత వలననే గృహస్థ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి
వరకూ రణరంగాన్ని తలపిస్తుంది. నేటి మన అధిక శాతం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మేధావులు- విద్య, వైజ్ఞానిక, ఆర్థిక రంగాలలో వెనుకబాటు తనాన్ని- నైతిక నేరాలకు
కారణాలుగా చూపిస్తున్నారు. అది వంద శాతమూ తప్పు. ఎందుకంటే- వారు చెప్పేదే నిజమైతే, అగ్ర రాజ్యాల కంటే, వర్థమాన దేశాలకంటే, తృతీయ ప్రపంచ దేశాలే నేరాలు-ఘోరాల్లో ప్రథమ స్థానంలో
ఉండాలి. కాని విచిత్రం ఏమిటంటే- పై మూడు రంగాలలో వంద శాతమూ ముందంజలో ఉన్న అగ్ర
రాజ్యాలే నేరాలు-ఘోరాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయని అంతర్జాతీయ నేర గణాంకాలు నిగ్గు
తేలుస్తున్నాయి! దీనిని బట్టి- సమాజ సంక్షోభానికి మన పెద్దలు చెబుతున్న కారణం
తప్పే కదా!
నేడు ప్రపంచవ్యాప్తంగా
అందించబడుతున్న 'వైజ్ఞానిక విద్య' మనుషులను కేవలం 'వైజ్ఞానికులు'గా నిర్మించగలదే కాని 'ఉత్తమ పౌరులు'గా మలచటానికి దానితో పాటు
మరొక విద్య అవసరాన్ని పై దుస్థితి ఆలోచింపజేస్తుంది.
మనుషులు 'వైజ్ఞానికుల'తోపాటు, 'ఉత్తమ పౌరులు'గానూ మలచబడాలంటే!
మనుషులనే ఈ జీవులు
మహాత్ముల స్థాయి నుండి మానవుల స్థాయికి దాని నుండి పశువుల స్థాయికి పడిపోవటానికి
గల కారణాలు ఏమిటో ఈ క్రింది గమనించగలరు. జీవులలో ఉండే వివిధ మౌలిక
లక్షణాలు.
1. మనోవాంఛలను పరిపూర్తి చేసుకొనే 'తపన',
2. కళల 'సామర్థ్యం',
3. సాంకేతిక 'పరిజ్ఞానం',
4. నైతిక 'స్పృహ'.
పశుపక్షాదులలో పైన
పేర్కొన్న వాటిలో మొదటి ప్రత్యేకత మాత్రమే 'అతి ఎక్కువ మోతాదు'లో ఉంటుంది. కాని మిగతా మూడు ప్రత్యేకతలు 'అతి తక్కువ మోతాదు'లో ఉంటాయి. కాని
మానవులలోనైతే- పై నాలుగు ప్రత్యేకతలూ 'ఎక్కువ మోతాదు'లోనే ఉంటాయి.
ఉదాహరణకు: Poetry, Painting వంటి తదితర 'కళల'కు మరియు Science, Maths వంటి వివిధ 'శాస్త్రాల'కు సంబంధించిన సామర్ధ్యాలు వివిధ వ్యక్తులలో వివిధ స్థాయిలలో 'ముడి పదార్థల' రూపంలో 'స్తబ్దు'గా ఉంటాయి. వాటిని 'భౌతిక సామర్థ్యాలు' అని అంటారు. అచ్చం అదే
విధంగా- మంచి, చెడు అనే ప్రవృత్తులకు
సంబంధించిన స్వభావాలు కూడా ప్రతి మనిషిలోనూ కాస్త హెచ్చు-తగ్గుల్లో 'ముడి పదార్థల'రూపంలో 'స్తబ్దు'గానే ఉంటాయి. వాటిని 'నైతిక సామర్థ్యాలు' అని అంటారు. అవి జన్మతః ప్రకృతి సిద్ధంగా కలుగుతాయి.
సకల జీవరాశులలో ఒక
జీవరాశిగా ఉన్న ఈ జీవి పైన పేర్కొన్న వాటిలో కేవలం మొదటి విషయాన్ని మాత్రమే కలిగి
ఉంటే- ఒక పశువు అవుతాడు.
తరువాతి రెండు, మూడు ప్రత్యేకతలను కలిగి ఉంటే- మానవుడు అవుతాడు. నాలుగోవ ప్రత్యేకతను
కూడా కలిగి ఉంటే- మహాత్ముడు అవుతాడు.
'విద్య-శిక్షణ'ల ప్రత్యేకత మరియు వాటి
మహత్తు ఏమిటి?
నేను ఇవ్వబోయే ఈ ఉదాహరణను
అపార్ధం చేసుకోవద్దు. విద్య-శిక్షణల 'విశిష్టత'ను చూపటానికి, వాటి వలన ఎంత 'నీచ' స్థాయిలో ఉన్న ఒక జీవి ఎంత 'ఉచ్ఛ' స్థాయికి ఎదిగిపోతుందో చూపాలన్నదే నా ఉద్దేశ్యం.
ఒక కుక్కను చూడండి-
దానిని అలాగే వదిలేస్తే 'ఊరకుక్క' అని అంటారు. దాని వలన ఎవరికీ ఎలాంటి ప్రత్యేక
ప్రయోజనమూ ఉండదు. దానిని అందరూ అత్యంత 'చులకన భావన'తో చూస్తారు. దానికి ఎలాంటి ఆలనాపాలనా ఉండదు. అలాంటి
కుక్కకే కనుక ఒకవేళ 'శిక్షణ' ఇస్తే- దానిని 'జాగిలం' అంటారు. దాని వలన ఎందరికో ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. దానిని అందరూ అత్యంత 'గౌరవ భావన'తో చూస్తారు. దానికి ప్రత్యక ఆలనాపాలనా ఉంటుంది. దాని గొప్పతనానికి పరాకాష్ట ఏమిటంటే- అది దొంగలను గాని, బాంబులను గాని గుర్తించటానికి బయలు దేరినప్పుడు, మానవ జాతికి చెందిన ఉన్నత విద్యావంతులైన- I.P.S, I.A.S అంతటి గొప్ప పట్ట భద్రులు సైతం దాని మార్గ దర్శనంలో దాని వెనకాల అది ఎటు పోతుంటే అటు పరుగులు తీస్తుంటారు. ఇదీ 'విద్య-శిక్షణ'ల మహత్తు!
మీరు ఎందుకు 'నైతికం'గా ప్రవర్తించటం లేదు? అని
విద్యార్థులను ప్రశ్నించే అర్హత పెద్దలకు ఉందా?
'వైజ్ఞానిక' విద్యారంగం ఎన్నెన్నో శ్యాఖోపశ్యాఖలుగా ఉందన్నది
అందరికి తెలిసిందే. అలేగే ఏ శాఖకు సంబంధించిన విద్యను గరిపితే ఆ సామర్థ్యమే
విద్యార్థులలో వికాసం చెందుతుందన్నదీ అందరికీ
ఎరుకే.
ఒక విద్యార్థి ఏదైనా ఒక
ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించ వలసిన బాధ్యుడు ఎప్పుడవుతాడు? ఒకటి- అతనిలో జన్మతః 'స్తబ్దు'గా ఉన్న ఆ సామర్థ్యమును 'వికాస' పరచటానికి దోహదం చేసే 'పాఠ్య అంశాలు' ఉండాలి. రెండు- వాటిని బోధించే 'అధ్యాపకులు' ఉండాలి. మూడు- వాటిని ఒక ప్రత్యేక క్రమంలో 'బోధించాలి'.
ఉదాహరణకు: నీవు పద్యాలను
ఛందో బద్ధంగా ఎందుకు వ్రాయటం లేదు? అని ఛందస్సును బాగా నేర్పించిన విద్యార్థిని తప్ప ఏ
గణిత శాస్త్రమో, విజ్ఞాన శాస్త్రమో
చదివించిన విద్యార్థిని
ప్రశ్నించలేము కదా! అయితే నేటి మన విద్యావంతులను మీరు 'నైతికం'గా ఎందుకు ప్రవర్తించటం లేదు? అని ప్రశ్నించే అర్హత ఎక్కడ ఉంది?
వారికి 'నీతి శాస్త్ర' సంబంధిత 'పాఠ్య అంశాలు' ఎక్కడ? వాటిని బోధించే అధ్యాపకులు ఎక్కడ? ఎందుకంటే- ఇతర సామర్థ్యాల మాదిరిగానే 'నైతికత' అనేది కూడా ప్రతి మనిషిలోనూ జన్మతః 'స్తబ్దు'గా ఉండే ఒక సామర్థ్యం.
దానిని 'వికాస' పరిచే వ్యవస్థను ఏర్పరచకుండానే ఆ సామర్థ్యాన్ని వారి
నుండి కోరటం విజ్ఞతా కాదు, న్యాయమూ కాదు. ఎందుకంటే-
ఇది "మేము మీకు కారు నడపటం
నేర్పించాము కదా మీరు విమానం ఎందుకు నడపలేరు!?" అని ప్రశ్నించే అంతటి అజ్ఞానపు పోకడ! ఒకవైపు-
ఈ పోకడే నేటి విద్యార్థుల పాలిట ఒక శాపం అయి వారిని పీడిస్తంది. మరోవైపు- అలాంటి
విద్యావంతుల కారణంగా మానవ సమాజం యావత్తూ అతలాకుతలం అయిపోతుంది.
నేటి
వైజ్ఞానిక విద్యావంతులను 'ఉత్తమ వ్యక్తులు'గా మలచ గలిగేది- 'తాత్విక విద్య' ఒక్కటే!
ఈ తత్వశాస్త్రం లేక 'తాత్విక విద్య' మనిషిలో జన్మతః 'స్తబ్దు'గా ఉన్న
మంచి-చెడులనే 'నైతిక' సామర్థ్యమును 'వికాస' పరచి- సంకుచిత
తత్వం, స్వార్థ పరత్వం, వర్గ తత్వం లాంటి భావ దాస్యపు సంకెళ్ళను తెంచి, విశాలత్వం, నిస్వార్థ పరత్వం, సార్వజనీనత్వం లాంటి భావ స్వేచ్చా వినువీధుల్లో విహరింపజేస్తుంది.
ఆ విద్య వలన మనిషి తన ప్రాణం విలువతో పాటు ఎదుటి వారి ప్రాణం
విలువను గుర్తిస్తాడు.
తన
ఆత్మ గౌరవంతో పాటు ఎదుటి వారి ఆత్మ గౌరవమును తెలుసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆధునిక పశువుగా ఉన్న నేటి మనిషి ఆధునిక
మహత్మునిగా రూపాంతరం చెందుతాడు! దానికి గల కారణాలు ఏమిటో తదుపరి
అంశాలలో ఒక్కొక్కటిగా గమనించగలరు.
తత్వశాస్త్ర
ప్రత్యేకతలు
1. 'వాస్తవికత'ను వివేచనాత్మకంగా మరియు శాస్త్రీయంగా
అధ్యయనం చేస్తుంది.
2. 'వాస్తవికత' అనగా
A. మనిషి ఇంద్రియాలకు, B. గ్రహణకు మరియు C. హేతువుకు అందేది.
3. తత్వశాస్త్ర పరిధి- 'మనిషి' మరియు 'ప్రకృతి' అలాగే 'భౌతిక' మరియు 'అభౌతిక' విషయాలను
కూడా తన పరిధిలో తీసుకుంటుంది. అంటే అది సకల విషయాలను గురించి చర్చిస్తుంది.
4. అది దేనినైనా పూర్వ నిశ్చితాభిప్రాయాలు గాని పక్షపాత
వైఖరినిగాని లేకుండా చూడమంటుంది. దానినే- కళంకం లేని (Clear and distinct) ఆలోచన అంటారు.
5. అది ఒక వ్యక్తి, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండదు.
అంటే- అది సామాన్య దృక్పథాన్ని (Holistic concept) పాటిస్తుంది. కాస్త వివరంగా
చెప్పాలంటే- సార్వత్రికతను (Universality) కలిగి ఉంటుందన్నమాట.
6. అది వ్యక్తుల, వస్తువుల బాహ్యంలో
కనిపించే వైరుధ్యానికి బదులు వాటి అంతర్గతంగా ఉండే సామాన్య లక్షణాలను గుర్తించటం
తత్వశాస్త్ర ముఖ్య లక్షణాలలో ఒకటి. ఐక్యపరిచే సూత్రాలను (Unifying principles) ఇష్టపడుతుంది.
7. అలాగే ఏదో ఒక అభిప్రాయాన్ని అదే సత్యమనో లేక అసత్యమనో
నిర్ణయించుకొని, ఇక ఎలాగైనా దానిని సమర్ధించుకొనే ప్రయత్నాన్ని ఈ
శాస్త్రం అంగీకరించదు.
8. తత్వశాస్త్ర పరిశీలనలో ముఖ్యమైనది
స్వేచ్చ. అదీ ప్రజ్ఞ (Intellect) తో కూడిన స్వేచ్చ.
'తాత్విక విద్య' ఇలాంటి ఇత్యాది గొప్ప లక్షణాలను ఒక
విద్యార్థిలో జాగృత పరుస్తుంది. అందులో అతి ముఖ్యమైనది- తనలో అందరినీ, అందరిలో తనను చూచుకొనే భావోద్వేగ పూరితనైన స్పందన ఏర్పడి, అతడు విశ్వజనీన వ్యక్తిగా మారి ఒక 'విరాట్ పురుషుడు' అయిపోతాడు. అప్పుడు అతడు-
తనను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంప్రదాయక
(Rote) దృష్టితో కాక, తార్కిక (Logical) దృష్టితో
చూడటం ప్రారంభిస్తాడు.
అలాంటి
నైతిక స్పృహ జాగృతమైన వ్యక్తి, ఒక శాస్త్రజ్ఞుడు అయితే, తన పరిశోధన కేంద్రం (Lab) లో ఎంత తార్కికత (Logic) ను
కలిగి ఉంటాడో తన పూజా ప్రార్థనా విధానాలలోనూ అంతే తార్కికత (Logic) ఉంటేనే వాటిని ఆచరిస్తాడు.
అలాగే
తన విషయంలో ఎదుటి వారు ప్రవర్తించే విధానం ఎంత న్యాయంగా ఉండాలని కోరుకుంటాడో
తనూ ఎదుటి వారితో అంతే న్యాయంగా ప్రవర్తించాలనే ఇంగితాన్ని కలిగి ఉంటాడు. తన ప్రాణమంటే తనకు ఎంత ప్రీతో
ఎదిటి వారి ప్రాణము వారికీ అంతే ప్రీతి అన్నది గుర్తిస్తాడు. అతని
ప్రవర్తన సకల జీవనరంగాలలోనూ అలాగే ఉంటుంది.
ఎందుకంటే-
కాలాలు మారినా 'న్యాయం' మారదు. అది 'సార్వకాలికం' అన్న యథార్థం అతనికి తెలిసి ఉంటుంది. ఇంకా వ్యక్తులు మారినా వారి 'స్పందనలు' మారవు. అవి 'సార్వజనీనం' అన్నది అతను గుర్తించి ఉంటాడు కనుక.
అలాంటి
సార్వత్రిక నియమాలను అందించే 'తత్వశాస్త్ర' అవగాహన
కలిగిన వ్యక్తి మత తత్త్వం, కుల తత్త్వం, వర్గ తత్త్వం, ప్రాంతీయ తత్త్వం మరియు భాషా తత్త్వం వంటి
సకల సంకుచిత తత్వాలకు అతీతుడైపోయి, అతను ఒక విశ్వజనీన వ్యక్తిగా
మారిపోతాడు. అలాంటి వ్యక్తినే 'మహాత్ముడు' అని
అంటారు.
దీనంతటిని బట్టి- 'ఆధునిక విద్యా' వంతులలో సంకుచిత తత్వం, నేర ప్రవృత్తి వంటి దుర్లక్షణాలు తొలగక పోవటానికి గల ప్రధాన కారణం- నేటి విద్యార్థులకు 'ఆధునిక విద్య'తో పాటు 'తాత్విక విద్య'ను అందించకపోవమేనని అర్థం అవుతుంది.
జై హింద్!
తత్వశాస్త్ర
అవగాహనకు ఈ (https://archive.org/stream/tatvashastramant024289mbp#page/n7/mode/1up)
లింకులోని
పుస్తకాన్ని తప్పక చదవగలరు!
M.A.Abhilah
9666488877
tmcnewstmc@gmail.com