Posted by Sakshyam Magazine on Tuesday, November 21, 2017
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని ప్రతీ ఒక్కరూ కలలు గంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్తర్లు, ఇంజినీర్లు, ఐఏస్, ఐపిఎస్ లు అవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగా తమ తాహతుకు మించి మంచి,మంచి కాన్వెంట్లలో, కాలేజీల్లో పిల్లలను చదివిస్తారు. ఎంతమంచి స్కూల్లో చదివినా, ఎంతమంచి కాలేజీలో చదివినా కొంతమంది విద్యార్ధులు ఫెయిల్ అవ్వక తప్పదు. దీనికి అనేక కారణాలున్నాయి.
టీచర్ ఎంత అద్భుతమైన రీతిలో క్లాస్ చెప్పినా విద్యార్ధి దాన్ని అర్ధం చేసుకున్నప్పుడే అతనికి లాభం సమకూరుతుంది. విద్యార్ధి గ్రహించలేకపోతే టీచర్ విఫలమైనట్లే. చెప్పింది అర్ధం కాక లేదా అర్ధం చేసుకోలేక పోవడం వల్ల కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడతారు.అర్ధం కాకపోవడానికి కారణాలున్నాయి. టీచర్ అతివేగంగా పాఠాన్ని ముందుకు సాగించడం వల్ల, విద్యార్ధికి టీచర్ అంతే భయం,ఇష్టం లేకపోవడం వల్ల క్లాస్ జరుగుతున్నప్పుడు ఇతర విషయాల వైపు దృష్టి సారించటం వల్ల, పక్కవారితో కబుర్లాడుతూ కూర్చోవటం వల్ల విద్యార్ధి జ్ఞానాన్ని గ్రహించలేకపోతాడు.
ఒకొక్కసారి టీచర్ కే ఏమీ సబ్జెక్ట్ రాకుండా ఉంటుంది. అతను చెప్పే విధానంలో లోపముంటుంది. నిర్ణీత పిరియడ్స్ లో క్లాసులకు రాకుండా, సిలబస్ సరైన సమయానికి పూర్తీ చేయకపోవడం వల్ల విద్యార్ధులు ఎంతగానో నష్టపోతారు. బాగా చదివే విద్యార్ధులు చెప్పినా, చెప్పకపోయినా చదువుకోగలుగుతారు. కాని మామూలు విద్యార్ధులు విషయ అవగాహన లేక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతారు.
కొన్ని స్కూళ్ళలో నేటికీ కొన్ని సబ్జెక్టులకు టీచర్లే లేరు. దీనివల్ల కూడా విద్యార్ధులు నష్టపోతారు.
ఆర్ధిక ఇబ్బందులు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య జగడాల వల్ల పిల్లలు మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతారు.దీనివల్ల ఏకాగ్రత లోపించి చదువుల్లో వెనుకబడే అవకాశాలున్నాయి.
చదువుల విషయంలో ఎక్కువమంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏమిటంటే పిల్లలపై బలవంతంగా తమ కోరికలను రుద్దటం. నువ్వు పుట్టిన దగ్గరి నుండి డాక్టర్ గా చూడాలనేది నా కోరిక. నువ్వు అయ్యి తీరాలి.నువ్వు గొప్ప ఇంజనీరు అవ్వాలి. అంతే నాకు నిన్ను ఐఏఎస్ హోదాలో చూడాలని ఉంది. నాకోరికను నువ్వు తప్పక తీర్చాలి. ఇలా అనేక గొప్ప కోరికలతో తల్లిదండ్రులు తమ పిల్లలను బలవంతం పెడుతుంటారు. వారి పిల్లలకు అంట సామర్ధ్యం ఉందా? లేదా? వారికి ఏ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉంది? అసలు వారు ఏమవ్వాలనుకున్తున్నారు అనే విషయాలకు ఎన్నడూ ప్రాధాన్యతనిచ్చిన పాపానికి పోరు. తల్లి దండ్రులు కోరిన రంగంలో రాణిoచగలిగితే భేష్! లేకపోతె ఆ పిల్లవాడి జీవితం సర్వనాశనమవుతుంది. దీని వల్ల మానసికంగా కృంగిపోతారు పిల్లలు.
అమ్మానాన్నల కోరిక తీర్చలేకపోయాననే బాధ ఒకవైపు ఉంటే , మరోవైపు తనకు ఇష్టమున్న రంగంలోనికి అడుగు పెట్టలేక పోయాననే వేదన మనస్సును పిండేస్తూ ఉంటుంది.
ఈ పెద్ద,పెద్ద కోరికలు తీర్చుకోవడానికి వేలకు వేలు ఫీజులు చెల్లించి ఇప్పించిన కోచింగులు గుర్తుకొస్తాయి. నలుగురిలో పరువు పోయినట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. అంతే ఇక జీవితాన్ని చాలించాలనే ఆలోచన జనిస్తుంది. ఎంతోమంది విద్యార్ధులు ఫెయిల్ అవడం వల్ల సమాజం, ఇంట్లో వాళ్ళు తమ పట్ల అవలంభించే వైఖరిని గురించి భయపడి ఆత్మహత్యలకు పాల్పడతారు.
పిల్లవాడు ఫెయిల్ అయ్యాడని తెలిసి చితకబాడే తల్లిదండ్రులూ లేకపోలేదు.
పిల్లలు ఫెయిల్ అయినప్పుడు ముందు నుంచే మానసికంగా ఏంటో కృంగిపోయి ఉంటారు. అలాంటప్పుడు కొట్టి, తిట్టి ఇంకా వారి శరీరాన్ని, మనస్సును గాయపరచకూడదు. టెన్త్ క్లాసులో తొలిసారి ఫెయిల్ అయిన విద్యార్ధులకు మానసిక క్షోభ ఎక్కువుగా ఉంటుంది.
కొంతమంది ఎన్నిసార్లు రాసినా పరీక్ష తప్పుతూనే ఉంటారు. అలాంటి వారిని లోకులు విలువలేని వారిగా చూస్తుంటారు. పరీక్ష ఫెయిల్ అయితే తప్పు చేసినట్టు ఏమీ కాదు. మహాత్మాగాంధీ,ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు కూడా ఫెయిల్ అయినవారే!
ఫెయిల్ అయిన విద్యార్ధికి తల్లిదండ్రులు మనోధైర్యాన్నివ్వాలి. ఎక్కడ లోపం ఉందో గుర్తించి దాన్ని సవరించాలి. ఈసారి జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇప్పటికైనా శ్రద్ద వహించి, మనసు లగ్నం చేసి చదువు అని మృదువుగా బోధించాలి.ఈసారి ఫెయిల్ అయితే ఏమైంది. వచ్చేసారి కష్టపడి చదువు తప్పక ఉత్తీర్ణత సాధిస్తావు. మంచి ర్యాంకు సాధించగలవు అని వెన్ను తట్టాలి. నీ వెంట నేనున్నాను అనే మనోధైర్యానివ్వాలి. అప్పుడు మొదట పరీక్ష తప్పినా విద్యార్దే ఫస్ట్ క్లాస్ మార్కులతో విజయభేరి మోగిస్తాడు.తరవాత ఇక జీవితంలో వెనక్కు చూసే అవసరమే ఉండదు. మీ పిల్లలను మీ కంటి చలువలుగా తయారు చేసుకోండి.మనకు కావసింది వారి మనోవేదన,కన్నేరుమున్నీరు కాదు. వారి కన్నులలోని ఆనందం. అది ఉంటే చాలు వారికి మనం గొప్ప జీవితాన్ని బహుకరించినట్లే. శుభం.
Click Here to Education website :
Sakshyam Education