Posted by Sakshyam Magazine on Friday, January 11, 2019
ఏక కాలంలో రెండు సిద్ధాంతాలు ఉనికిలో ఉన్నాయంటే వాటిలో ఏదో ఒకటి ముందు పుట్టినదై ఉంటుంది రెండవది దానికి భిన్నంగా తరువాత పుట్టినదై ఉంటుంది. కాబట్టి మొట్ట మొదట ఉనికి లోనికి వచ్చింది పాతసిద్ధాంతం అవుతుంది దాని తరువాత ఉనికి వచ్చింది క్రొత్త సిద్ధాంతం అవుతుంది. ఈ విషయాన్ని దృషిలో పెట్టుకుని ఏకేశ్వరోపాసన? బహుదైవోపాసన? అన్న రెండు ప్రస్తుత ఉనికిలో ఉన్న సిద్ధాంతాల్లో ఏది మొట్టమొదట ఉనికిలోకి వచ్చిన పాత విశ్వాసం? ఏది ఆ తరువాత ఉనికిలోకి వచ్చిన క్రొత్త విశ్వాసం? అన్నది గమనిద్దాం.
కపట ధార్మిక పండితుల మహావంచన ఏమిటి?
సామాన్య ప్రజల సాధారణ మనస్తత్వం (సైకాలజీ) ఏమిటంటే- ఎవరైనా ఒక వ్యక్తి దైవగ్రంధాన్ని చేతిలో పట్టుకుని దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే అతను గొప్ప ధార్మిక పండితుడని లెక్కకట్టి అతను తన చేతిలో ఉన్న దైవగ్రంధంలోని పాఠాలనే చెబుతున్నాడు కాబట్టి అతను చెబుతున్నది అనుసరణ యోగ్యమైనదే అన్న నిర్ణయానికి వచ్చేయటం! ఈ కామన్ సైకాలజీ యే ధర్మాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు పండితుల, బోధకుల రూపంలో చలామణీ అవుతున్న వంచకులకు రాబడి మార్గంగా మారింది అనటం అతిశయోక్తి కాదు! ఇక కపట ధార్మిక పండితుల మహావంచన ఏమిటంటే- దైవగ్రంధాలలో ఉన్న శాస్త్రబద్ధ విషయాల నుండి ప్రజలను దూరం చేసి, దాని స్థానంలో మూఢనమ్మకాలు, ఆచారాలతో కూడిన కల్పిత విధానాన్ని అసలు ధర్మం పేరట ప్రజలకు పరిచయం చెయ్యటం. నేడు ఆధ్యాత్మిక రంగంలో పండితుల, బోధకుల రూపంలో చలామణీ అవుతున్న కొందరు ఏ విధంగా ప్రజలను మభ్య పెడుతుంటారో వివరిస్తూ, వారి వంచనను బట్టబయలు చేస్తున్న ఈ క్రింది ఖురాన్ వాక్యంలో గమనించగలరు.
“వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని, గ్రంథం పఠిస్తూ తమ నాలుకలు మెలి త్రిప్పుతారు. కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు, “మేము చదివేదంతా అల్లాహ్ తరఫునుండి వచ్చిందే” అంటారు. కానీ అది అల్లాహ్ తరఫునుండి రాలేదు. వారు బుద్ధి పూర్వకంగా అబద్ధాన్ని అల్లాహ్ కు అంటగడుతున్నారు” – ఖురాన్ 3:78
ఇదే విషయం అటు బైబిల్లోనూ చెప్పబడింది.
“విండ్లను త్రోక్కి వంచునట్లు అబాధమాడుటకై వారు తమ నాలుకలు వంచుదురు” – యిర్మియా 9:3
“వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచూ మీ వలన లాభము సంపాదించు కొందురు” - 2 పేతురు 2:2
పై వాక్యాలను బట్టి వివిధ మత వర్గాల్లో పండితుల, బోధకుల రూపంలో చలామణీ అయ్యే వంచకుల అసలు స్ట్రాటజీ ఏమిటో, వారి టార్గెట్ ఏమిటన్నది బట్టబయలు చెయ్యబడింది. అది- దైవగ్రంథాన్ని చేతిలో పట్టుకుని స్వకల్పిత విశ్వాసాలు బోధించటం. తద్వారా లాభం సంపాదించుకోవటం అన్నది.
పాత విశ్వాసాల ముసుగులో క్రొత్త విశ్వాసాలు – ఇది రెండవ మహా వంచన!
పండితుల, బోధకుల రూపంలో చలామణీ అయ్యే కొందరు డబ్బుసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి దైవ గ్రంథాలను చేతిలో పట్టుకుని బోధించటం- మొదటి వంచన అయితే పాత విశ్వాసాల ముసుగులో క్రొత్త విశ్వాసాలు ప్రవేశపెట్టటం అన్నది వారి రెండవ మహా వంచన అన్నది అందరూ తెలుసుకోవాలి.
దేవుణ్ణి విశ్వసించటం అన్న విషయంలో జ్ఞాన యుక్తంగా ఆలోచించలేని సాధారణ ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే- “ఫలానా అతన్ని మా తాత-ముత్తాతల కాలం నుండి పూజిస్తూ రావటం చూస్తున్నాం కాబట్టి ఫలానా అతనే మా దేవుడు” అన్నది. ఈ విషయాన్ని క్రింది ఖురాన్ వాక్యాలలో గమనించగలరు.
“మేము మా తాత ముత్తాతలు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూశాము; మేము వారి అగుడు జాడలలోనే నడుస్తున్నాము” - 43:22
“మేము మా పూర్వీకులు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూసాము. మేము వారి అడుగు జాడలనే అనుసరిస్తున్నాము” - 43:23
ఈ సెంటిమెంటుని అడ్డం పెట్టుకునే ప్రజలను సులువుగా తమ గుప్పెట్లో పెట్టుకుని వారిని ఆడించటానికి వంచకులైన పండితులు చేసేదేమిటంటే- 1. ప్రజలను నిజ దేవుని నుండి దూరం చెయ్యటం. ఆ లింకు తెంచెయ్యటం ద్వారా వారిని ఎటు పడితే అటు ఆడించటం సులువు అవుతుంది. 2. అనేక దైవాల ఆరాధన పాత విశ్వాసంగా, ఏక దేవుని ఆరాధన క్రొత్త విశ్వాసంగా భ్రమింపజేయటం. ఈ ప్రక్రియ అనాది నుండి సాగుతూనే వస్తుంది. అందుకే ప్రజలకు అనేక దైవాల ఆరాధన విధానానికి బదులు ఏక దైవారాధన విధానాన్ని పరిచయం చేసినప్పుడు దానిని అతి విచిత్రమైన విషయంగా గమనిస్తూ ఉంటారు. పైగా వారు ఏమంటారంటే...
“సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే ఒక్క దైవాన్ని నిలబెట్టాడేమిటి? ఇది ఎంతో విచిత్రమైన విషయం” – ఖురాన్ 38:5
పై సంఘటన దైవ గ్రంథాలు పరిచయం చేస్తున్న ఒకే ఒక్క దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేసే సత్య బోధకులకు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయమే! ఒక్క దైవాన్ని పరిచయం చెయ్యటం ఎందుకు విచిత్రమైన విషయంగా కనిపిస్తుందంటే బహుదైవాల ఆరాధాన అన్నది ఎప్పటి నుండో ఉనికి ఉన్న పాత విశ్వాసం అన్న భావన ప్రజల మనోమస్తిష్కాల్లో నాటుకు పోవటమే! ఈ ఒక్క విషయమే దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ప్రజలు అంత తొందరగా అంగీకరించకపోవటానికి ప్రధాన కారణం. ఈ పరిణామానికి కారణం- బహుదైవోపాసన పాత విశ్వాసం, ఏకదైవోపాసన క్రొత్త విశ్వాసం అన్న అపార్థం ప్రజల్లో నాటుకు పోవటమే. అందుకే ప్రవక్త ముహమ్మద్ (స) సైతం ఏక దైవారాధన వైపు ఆహ్వానం పలికినప్పుడు ప్రజలు ఏ విధంగా మాట్లాడుతూ వెళ్లిపోయేవారో క్రింది వాక్యంలో గమనించగలరు.
“జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు- పదండి! పదండి!! మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి. ఈ విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతుంది. ఈ విషయాన్ని (అంటే- ఏకేశ్వరోవాదాన్ని) మేము ఇటీవల కాలపు సమాజంలో ఎవరి నోటా వినలేదు. ఇది (ఏకేశ్వరోపాసన) ఒక కల్పిత విషయం తప్ప మరేమీ కాదు” - 38:5,6
పై సంఘటన ఒక్క ప్రవక్త ముహమ్మద్ (స) విషయంలోనే కాదు అంతకు పూర్వం నిజ దేవుణ్ణి పరిచయం చేయటానికి వచ్చిన ప్రతీ ప్రవక్తకూ ఎదురైనదే. ఉదాహరణకు యేసు తన బోధను ప్రారంభించినప్పుడు సైతం ప్రజలు ఇలానే మాట్లాడుకునే వారు.
“అందరును విస్మయమొంది- ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే” – మార్కు 1:27
కాబట్టి అసలు సమస్య సత్యమా? అసత్యమా? అన్నది కాదు పాత? క్రొత్తా? అన్నదే!
ఇప్పటివరకూ గమనించిన దానిని బట్టి “ఏకేశ్వరోపాసన” “బాహుదైవోపాసన” అన్న రెండు విశ్వాసాల్లో ఏది సత్యం? ఏది అసత్యం? అన్నది అసలు సమస్య కాదు ఏది పాత? ఏది క్రొత్తా? అన్నదే అన్నదే అసలు సమస్య! కాబట్టి ప్రజలకు “ఏకేశ్వరోపాసన” “బాహుదైవోపాసన” అన్న రెండు విశ్వాసాల్లో ఏది పాత? ఏది క్రోత్తా? అన్నది అవగాహన పరిస్తే ఆటోమేటిక్ గా ఏది సత్యమో? ఏది అసత్యమో? ప్రజలే తేల్చుకుంటారు.
అందుకే దైవగ్రంథాలు “పాత” విశ్వాసాల వైపునకు ఆహ్వానం పలికేది!
తనకు ఎంతో ప్రియతమ జీవిగా సృష్టించుకున్న దేవుడు తన సృష్టి అయిన మానవ జాతికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే- తనను మాత్రమే ఏకైక దైవంగా విశ్వసిస్తూ ఆరాధించాలన్నది! ఈ ఏకదేవుని విశ్వాసానికి అనుగుణంగా ఎలా జీవించాలో చూపటానికే దేవుడు తన ప్రవక్తలను సైతం పంపటం జరిగింది. ఆ తరువాత కాలానుగుణంగా ప్రవక్తలు పరమపదించాక కొందరు వంచకులు పండితుల రూపం ఎత్తి, ప్రజల జేబుల్లో ఉన్న డబ్బును తమ జేబుల్లో తెచ్చుకోవాలనే పన్నాగం పన్నారు. దానికి ఉన్న అడ్డ దారి వారిని అసలు దేవుని విశ్వాసం నుండి తప్పించటం ఒక్కటే మార్గం! దానికి గాను వారు చేస్తూ వచ్చింది ఏమిటంటే- అప్పటికే ప్రజల వద్దకు నిజ దేవుణ్ణి పరిచయం చేయటానికి దేవునిచే పంపబడిన దైవ ప్రవక్తలను వారు పరమపదించాక వారిని దేవుని అవతారాలుగా ప్రజలను భ్రమింపజేసి వారినే దైవాలుగా నిలబెట్టటం! పైగా ఇలా ప్రజలను భ్రమ పెట్టటం కూడా ఎంతో సులువైన పని కూడా. దానికి గానూ వారు చేస్తూ వచ్చిందల్లా ప్రజలకు తమ ప్రవక్తల పై ఉన్న ప్రేమను భక్తిలోకి మార్చేయటమే!
దీనికి గొప్ప ఉదాహరణ- ఆనాడు యేసు “తండ్రి (దేవుడు) ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు (మత్తయి 23:9)” “దేవుడు అద్వితీయుడు (మార్కు 12:29)” “ఒక్క తండ్రిని మాత్రమే ప్రార్థన చెయ్యాలి (మత్తయి 6:6)” అంటూ బైబిల్లో యేసు చెప్పిన వాక్యాలు ఉన్నప్పటికీ “యేసు దేవుని ప్రార్ధించుచుండెను (లూకా 6:12)” అన్న విషయం కనపడుతున్నప్పటికీ వారి పండితులు క్రైస్తవ సమాజాన్ని యేసే దేవుడన్న భ్రమలలో తేలియాడే విధంగా తయారు చేశారు. చివరకు సామాన్య క్రైస్తవ ప్రజానీకాన్ని ఎంత అమాయకులుగా మార్చేశారంటే యేసు దేవుడు ఒక్కడే అని చెప్పిన మాటలు, దేవునిని ప్రార్ధించినట్లు ఉన్న వాక్యాలన్నీ ఆయన ఈ లోకంలో కేవలం మానవునిగా ఉన్నారు కాబట్టి అలా చేప్పారంతే! నిజానికి ఆయనే దేవుడు అని ఆడ్డగోలు వాదన చేసేంతగా తయారు చేసేశారు. యేసు దైవత్వం లేని క్రైస్తవ్యాన్ని కల్లోనే కాదు పీడకల్లో సైతం ఊహించుకోవటానికి ఇష్టపడనంత దూరం తీసుకెళ్లి వదిలి పెట్టేశారు. ఈ విధంగా తమ ప్రవక్తలను (ఋషీశ్వరులను) దైవాలుగా భావించే విధానం హిందుత్వంలో ఎప్పటినుండో కొనసాగుతూనే ఉంది. దాని ఫలితమే ఈనాడు అటు హిందూత్వంలో ఇటు క్రైస్తవంలో సర్వసామాన్యం అయిపోయిన “బహు దైవాల ఆరాధన” మరియు విగ్రహారాధన! ఈ నేపథ్యంలో దైవగ్రంథాలు ప్రజలను ఏకేశ్వరోపాసననే పాత విశ్వాసం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ పాత విశ్వాసం వైపునకే ఆహ్వానం పలుకుతున్నాయి.
“మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విశదపరచి, ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు” -ఖురాన్ 4.26
“మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీము పద్ధతినే అనుసరించాలి. ఇబ్రాహీము షిర్కు (బహుదైవోపాసన) చేసే వారిలోని వాడు కాడు” – 3:93-95
పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గం- ఏకేశ్వరోపాసనా? బహుదైవోపాసనా? అంటే దానికి సమాధానం స్వయంగా దేవుడే – “ఇబ్రాహీము షిర్కు (బహుదైవోపాసన) చేసే వారిలోని వాడు కాడు” అని చెబుతున్నాడు. కనుకనే పూర్వం గతించిన ఇబ్రాహీము పద్ధతినే అనుసరించాలి అని స్వయంగా అల్లాహ్ చెబుతున్నాడు. దీనిని బట్టి పూర్వం గతించిన సజ్జనులు, పూర్వ గ్రంథాలలో ఉన్నది సైతం ఏకేశ్వరోపాసనే తప్ప బహుదైవోపాసన ఎంత మాత్రం కాదు. అందుకే “ఇప్పుడు ఒకవేళ మేము నీపై అవతరింపజేసిన హితబోధను గురించి ఏ మాత్రం సందేహం ఉన్నా పూర్వం నుండీ గ్రంథాలను చదువుతున్న ప్రజలను అడుగు” - 10:94 అని స్వయంగా అల్లాహ్ యే చెబుతున్నాడు.
బైబిల్లో సైతం దేవుడు పాత విశ్వాసం వైపునకే ఆహ్వానిస్తున్నాడు!
“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు- మార్గములలో నిలిచి చూడుడి; పురాతన మార్గములను గూర్చి విచారించుడి” – యిర్మియా 6:16
పై పరిశుద్ధ వాక్యంలో స్వయంగా దేవుడు “పురాతన మార్గములను” గూర్చి విచారించమంటున్నాడు. అలాగే శిష్యుడైన యోహాను సైతం చెబుతున్నదేమిటంటే-
“మీరు మొదట నుండీ దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి” – 1 యోహాను 2:24
బైబిల్ ప్రకారం మొదటినుండీ ఉన్న విశ్వాసం ఏమిటన్నది గమనిస్తే-
“ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు” – ద్వితీ 32:39
“యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు” – 1 సమూయేలు 2:2
పై వాక్యాలను బట్టి మొదటి నుండీ ఉన్న విశ్వాసము “ఒక్క యెహోవా యే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు” అన్నది. మరి మొదటినుండీ ఉన్న ఈ పాత విశ్వాసాన్నే యేసు బోధించారా? లేక ఆ పాత విశ్వాసానికి వ్యతిరేకంగా క్రొత్త విశ్వాసాన్ని యేసు బోధించారా? అంటే...
“యేసు- ఓ ఇశ్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” – మార్కు 12:29
అంటూ యేసు సైతం పాత విశ్వాసాన్నే స్థాపించారు తప్ప క్రొత్త విశ్వాసాన్ని స్థాపించలేదు. మరి యేసు అనంతరం పౌలు, యేసు చెప్పిన “యెహోవా యే దేవుడ”న్న పాత విశ్వాసానికి భిన్నంగా యేసే దేవుడన్న క్రొత్త విశ్వాసాన్ని ఏమైనా స్థాపించాడా? అన్నది గమనిస్తే... “ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము... మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి (యెహోవా)” – 1 కోరింధీ 8:4-6.
ఈ విధంగా బైబిల్లో మొదట నుండీ ఉన్న పాత విశ్వాసము “దేవుడు ఒక్కడే” అన్న ఏక దేవుని వాదమే! దానినే యేసు, యేసు శిష్యులు, పౌలు సైతం బోధించి వెళ్లారు. వారి అనంతరం ఉనికి లోనికి వచ్చిన క్రొత్త సిద్ధాంతాలు యేసే దేవుడు! దేవుడు త్రిత్వమై ఉన్నాడు! యెహోవా యే యేసు! వగైరా సిద్ధాంతాలు.
అటు ఖురానులోనూ, ఇటు బైబిల్లోనూ దేవుడు "ఏకేశ్వరోపాసన" అన్న "పాత" విశ్వాసాన్నే స్థాపించమంటున్నాడు. అటువంటప్పుడు బహుదైవాల ఆరాధన చేసేవారు "మేము మా పూర్వీకులు, మా తాత ముత్తాతల కాలం నుండీ ఫలానా ఫలానా వారిని ఆరాధిస్తూ వస్తున్న వారినే దైవాలుగా భావిస్తాం అనే వారు నిజానికి పూర్వీకులు ఆరాధించిన దేవుణ్ణే ఆధించాల్సి వస్తే అసలు పూర్వీకులు అబ్రాహాము, మోషే, యేసు, రాముడు, కృష్ణుడు, ముహమ్మద్ వగైరా పుణ్య పురుషులే అసలు పూర్వీకులౌతారు! తప్ప తమకు దగ్గర పూర్వీకులైన తమ తాత ముత్తాతలు అసలు పూర్వీకులే కాదు! కాబట్టే ఒకవేళ మీరు మీ పూర్వీకులు ఆరాధించిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలనుకుంటే మీ అసలు పూర్వీకుడైన అబ్రహాము ప్రార్ధించిన దేవుణ్ణే ఆరాధించమని అటు ఖురానులో అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే అనేక మంది ప్రవక్తలు ప్రార్ధించిన ఒక్క దేవుణ్ణే ఆరాధించమని ఇటు యేసూ, అలాగే యేసు ఆరాధించిన దేవుణ్ణే ఆరాధించమని యేసు శిష్యులు, పౌలు ప్రజలను "పాత ఏకేశ్వరోపాసన" వైపునకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు.
అయితే పండితుల, బోధకుల అవతారమెత్తిన కొందరు స్వార్థపరులు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని చేసినదల్లా ఏమిటంటే- “బహుదైవాల ఆరాధనా విధానం” పాత విశ్వాసం! “ఏక దేవుని ఆరాధనా విధానం” క్రొత్తది! అన్న భ్రమలో ప్రజలను నెట్టేయటం!. కాలానుగుణంగా చివరకు అధికశాతం ఆస్తికులైన సామాన్య ప్రజలు బహుదైవాల ఆరాధన విషయంలో ఎంత దూరం వెళ్లిపోయారంటే తాము నమ్మే విశ్వాసం ఎంతవరకు గ్రంధానుసారమైనది అన్నది కనీసం ఆగి ఒకసారి వెనుతిరిగి ఆలోచించలేనంత దూరం వెళ్ళిపోయారు. “దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు” అన్న విషయాన్ని వారి గ్రంధాల నుండే ఎత్తి చూపి, బహుదైవోపాసన క్రొత్త విశ్వాసము అన్న విషయాన్ని నిరూపించినప్పుడు ఏకేశ్వరోపాసనను అత్యంత విచిత్రమైన విషయంగా పరిగణించే స్థితికి చేరిపోయారు.