Posted by Sakshyam Magazine on Saturday, January 26, 2019
అరిస్టాటిల్ సైతం బహిష్టు రక్తం నుండి అండం విడుదలై తద్వారా రక్తం గడ్డకట్టి గర్భంలో పిండం అనేది ఏర్పడుతుందని భావించాడు! ప్రాచీన గ్రీకు, యూరోపియన్లదీ అదే భావన! ఆ తరువాత 1604 సం. లో ఫాక్సికస్ అనే శాస్త్రవేత్త పిండం యొక్క కొన్ని అద్భుతమైన చిత్రాలను మొట్టమొదట ఆవిష్కరించాడు. ఆ తరువాత 1672 సం.లో ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డ ‘మాల్ఫిగి’ పిండోత్పత్తి దశలకు సంబంధించిన మరికొన్ని ఆధునిక చిత్రాలను ఆవిష్కరించాడు. ఆ తరువాత 1694 లో ‘హర్త్టోకేర్’ అనే శాస్త్రవేత్త మరికాస్త ముందుకెళ్లి మానవ స్పెర్మటోజూన్ (ప్రత్యుత్పత్తి వీర్యకణం) లేదా ‘అండం (ovum)’ ద్వారా మానవ దేహానిర్మాణం ఏర్పడుతుందన్న క్రొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. ఆ తరువాత 1775 సం.లో ‘స్పల్లన్జాని’ అనే శాస్త్రవేత్త పిండాభివృద్ధికి ‘అండము (ovum)’ మరియు వీర్యం (Sperm) యొక్క అవశ్యకతను వివరించినప్పుడు ఈ వివాదం కొంతవరకు ముగిసింది. మొత్తానికి 17 వ శతాబ్దంలో మొట్టమొదటి మైక్రో బయాలజిస్ట్ అయిన ‘లియువెన్హోక్’ సూక్ష్మదర్శిని (Microscope) ని కనుగొన్న తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Embryological science) అభివృద్ధి దశ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఆ తరువాత ప్రత్యుత్పత్తి వీర్య కణము (spermatozoon) ద్వారా అండం ఎలా ఫలదీకరణ చెందుతుంది అన్న అంశానికి సంబంధించి 1940 సం. తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం ద్వారా క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఈ విధంగా గర్భంలో పిండ నిర్మాణ దశలను గూర్చి ఎన్నో పరిశోధనల అనంతరం ఏ క్రొత్త ఆవిష్కరణలు అయితే 19 వ శతాబ్దంలో అనేక శాస్త్రవేత్తల ద్వారా జరిగాయో ఆ దశలను గురించి 1400 సం. ల ముందే 7 వ శతాబంలో మక్కా లాంటి ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో చిన్న చిన్న విషయాలకు సైతం కత్తులు దూసుకునే ఆటవిక వ్యక్తుల మధ్య పుట్టి పెరిగిన ఓ నిరక్షరాస్యుడైన వ్యక్తి ద్వారా ఈనాటి ఆధునిక వైధ్య శాస్త్రానికి తీసిపోని విధంగా స్పష్టంగా వివరించబడ్డాయి అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ, ఎవరైనా నమ్మాల్సిందే! అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవాల్సిందే.
మానవ సృష్టి నిర్మాణం గురించి ఆలోచించమని ఖురాన్ స్వయంగా ఆహ్వానం పలుకుతుంది!
“భూమిపై తిరగండి, ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి” – 29:20
“ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా: మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా? లేక దానిని సృష్టించేవారము మేమా?” - 56:58
ఈ విధంగా ఖురాన్ స్వయంగా తనను ఏదో కేవలం సెంటిమెంటుగా కాక, సృష్టిని పరిశీలించి, దానిని జ్ఞానం ఆధారంగా, లాజికల్ గానే నమ్మమని ఆహ్వానం పలుకుతుంది.
చివరకు ఈ ఖురాన్ సత్యమైనదని వారికి విశదమైపోతుంది!
“మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది” – 41:53
పై వాక్యంలో సృష్టికర్త అయిన దేవుడు భవిష్యత్తులో తన సూచనలను చుట్టూ ఉన్న ప్రపంచంలో మరియు స్వయంగా వారిలోనూ చూపటం ద్వారా ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి అంటే దానిని విమర్శించేవారికి విశదమైపోతుందని వాగ్దానం చేస్తున్నాడు. ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుడు చూపుతున్న అనేక సూచనల్లో ఒకటి- స్త్రీ గర్భంలో పిండోత్పత్తి సంబంధించిన దశలను గురించి ఖురాన్ లో ఎంతో స్పష్టంగా వివరించటం, అది ఈనాటి పిండోత్పత్తి శాస్త్రజ్ఞులు (Embryological Scientists) కనిపెట్టిన ఆధునిక ఆవిష్కరణలకు నూటికి నూరుశాతం సరిపోవటమే! ఈనాటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science) చెబుతున్న విషయం ఏమిటంటే – గర్భంలో మానవ దేహ నిర్మాణం వివిధ ప్రత్యేక దశల్లో జరుగుతుందన్నది. దానినే ఖురాన్ ఈ క్రింది విధంగా వివరిస్తుంది.
“వాస్తావానికి ఆయన మిమ్మల్ని వివిధ దశల్లో సృష్టించాడు” - 71:14
గర్భంలో శిశువు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతుందని పై ఖురాన్ వాక్యం ద్వారా తెలుస్తుంది. మానవ పునరుత్పత్తి అన్నది స్త్రీ,పురుష లైంగిక సంపర్కంతో ప్రారంభం అవుతుంది. పురుషుడు ఒకసారి విడిచే వీర్యంలో 350,000,000 ల ప్రత్యుత్పత్తి వీర్యకణాలు (spermatozoa) ఉంటాయి. వాస్తవానికి వివిధ గ్రంధుల (SEMINAL VESICLES, PROSTATE GLAND, COWPERS GLANDS) నుండి ఉత్పత్తి అయ్యే అనేక రకాల పదార్థాలతో కలిసిన ద్రవం “Seminal Fluid (సెమినల్ ఫ్లూయిడ్)” మరియు "వీర్యకణాల" (Sperm cells)” “మిశ్రమ ద్రవపదార్థమే (a mixture sperm-drop)- “వీర్యం” అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని 1400 సం.కు పూర్వమే ఖురాన్ బహిర్గత పరచింది.
“మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని “ఒక మిశ్రమ వీర్య బిందువు (a mixture sperm-drop)” తో సృష్టించాము” - 76:2
వాస్తవానికి ఆధునిక జీవశాస్త్రం (Modern Biology) చెప్పేది ఏమిటంటే స్త్రీ అండాశయం (ovaries) నుండి విడుదల అయ్యే అండం ఫలదీకరణం చెందటానికి (లేదా గర్భం దాల్చటానికి) 350,000,000 పురుష వీర్యకణాలలో కేవలం ఒక్క వీర్యకణం (స్పెర్మటోజూన్/spermatozoon) సరిపోతుందన్నది. ఈ విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా ముందే ప్రస్తావించిందన్నది గమనార్హం.
“ఆయన మానవుణ్ణి స్వల్పమైన వీర్యబిందువు (a sperm) తో సృష్టించాడు” - 16:4
“అతడు (తల్లి గర్భంలో) స్ఖలించబడిన ఒక వీర్య బిందువు (a sperm) కాడా? - 75:36
పై వాక్యాలను అరబ్బీ మూలంలో గమనిస్తే వాటిలో “నుత్ఫత్ / Nutfat” అన్న పదానికి “అతి స్వల్పమైన వీర్యబిందువు (a minute quantity of semen)” అని అర్థం. అంటే వీర్యంలో అతిస్వల్పమైన భాగం లేదా ఒక కణం అని చెప్పవచ్చు. వాస్తవానికి స్త్రీ, పురుషుల కలయికలో పురుషుడు వీర్యం స్ఖలించినప్పుడు ఆ వీర్యం మొట్టమొదట “సెర్విక్స్” (cervix) నుండి గర్భాశయం "Uterus / యుటరస్" ద్వారా ప్రయాణించి “ఫేలోపియన్ ట్యాబ్” (Fallopian tube) కి చేరుకుంటుంది. ప్రతీ స్త్రీకి గర్భాశయం ఇరుప్రక్కలా రెండు అండాశయాలు (ovaries) ఉంటాయి. వాటి ద్వారానే దాదాపు ప్రతీ 28 రోజులకు ఒకసారి అండం (Ovum) అనేది విడుదల అయి “ఫేలోపియన్ ట్యాబ్” లో చేరుకుంటుంది. ఈ అండం పురుష వీర్య కణం తో కలిసినప్పుడే ‘ఫలదీకరణం’ (Fertilization) అంటే పిండం రూపుదాల్చటం అనేది ప్రారంభం అవుతుంది.
గర్భంలో శిశువు యొక్క “మూడు చీకటి దశల”ను గూర్చి నేటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం ఏమని చెబుతుంది?
‘ఫలదీకరణం’ (Fertilization) అంటే స్త్రీ గర్భంలో పిండం రూపుదాల్చటం అనే ప్రారంభ ప్రక్రియ నుండి మొదలుకుని గర్భంలో పిండం ముఖ్యంగా మూడు దశలు దాటుకుంటూ పెరుగుతుందని ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర మూల గ్రంథమైన “Basic Human Embryology” ఈ క్రింది విధంగా చెబుతుంది.
“The Life in the Uterus has THREE STAGES: Pre-embryonic; - First two and half weeks, Embryonic;- Until the end of the eight week, and Fetal;- from the eight week to labor” – (P. Williams, Basic Human Embryology, 3rd ed., 1984 p.64)
దీని అర్థం- గర్భంలో శిశువు ముఖ్యంగా మూడు దశలను దాటుకుంటూ పెరుగుతుంది అన్నది. అవి “Pre-embryonic” ఈ దశ మొదటి రెండున్నర వారాలు కొనసాగుతుంది. “Embryonic” ఈ దశ ఎనిమిదవ వారం వరకు కొనసాగుతుంది. “Fetal” ఈ దశ ఎనిమిదవ వారం నుండి పుట్టే వరకు కొనసాగుతుంది. ఈ మూడు దశలను గూర్చి నేటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science) ఏదైతే చెబుతుందో ఆ విషయాన్ని ఖురాన్ 1400 వందల సం.కు ముందే ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.
“ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు” – 39:6
"He makes you, in the wombs of your mothers, in stages one after another in three veils of darkness" - 39:6
పై వాక్యంలో ప్రస్తావించబడిన మూడు చీకటి తెరలు అంటే “Anterior abdominal wall (ఉదరకోశ గోడ)”, “the uterine wall (గర్భాశయ గోడ)” మరియు “Amnio-chorionic membrane (అమినో క్రోనిక్ పొర)”. ఈ విధంగా స్త్రీ గర్భంలో పిండం మూడు చీకటి తెరలలో మూడు మౌలిక దశలను దాటుకుంటూ ఒక రూపం తరువాత మరో రూపం దాల్చుకుంటూ పెరుగుతుందన్న ఏ విషయం అయితే ఖురాన్ ప్రస్తావిస్తుందో అదే విషయాన్ని నేటి ఆధునిక సైన్స్ సైతం ధృవీకరించింది. ఇది మాత్రమే కాదు చివరకు స్త్రీ గర్భంలో పిండ నిర్మాణం ఒకదాని తరువాత మరొకటి దశలవారీగా జరిగే ప్రక్రియను గురించి ఖురాన్ ఎంత స్పష్టంగా వివరిస్తుందో ఒకసారి గమనిద్దాం.
గర్భంలో పిండ నిర్మాణ ప్రక్రియ దశలను 1400 సం.కు పూర్వమే స్పష్టపరచిన ఖురాన్!
ఖురాన్ మనిషి పుట్టుక గురించి ఏదో పై పై విషయాలను ప్రస్తావించటం లేదు. కానీ ఈ నాడు అనేక పరిశోధనలు చేసి నేటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology science) మనిషి శరీర నిర్మాణ దశలను గురించి ఏదైతే చెబుతుందో ఆ దశలను గురించి పూస గుచ్చినట్టుగా 1400 సం. కు పూర్వమే ఖురాన్ ఈ క్రింది విధంగా ప్రస్తావిస్తుందన్నది అత్యంత గమనార్హం.
“మేము మానవుణ్ణి మట్టి యొక్క సారం నుండి సృష్టించాము; తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య బిందువుగా మార్చాము, / ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, / ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము, / తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము, / ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము, / ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు” – 23: 12-14
గర్భంలో పిండ నిర్మాణ దశలను గురించి ఖురాన్ ఏదైతే పేర్కొంటుందో అది ప్రస్తుత మెడికల్ సైన్సుకు సరిపోతుందా? లేక వ్యతిరేకంగా ఉందా? అన్నది కాస్త వివరంగా పరిశీలిద్దాం.
1. “తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య బిందువు (Nutfa) గా మార్చాము” అన్న వాక్య భాగం స్త్రీ గర్భాశయంలోని పురుష వీర్యకణం స్త్రీ అండం (Ovum) తో కలిసి బీజం (zygote) ఏర్పడే స్థితిని వివరిస్తుంది.
2. “ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” అన్న వాక్యభాగాన్ని గమనిస్తే ఎప్పుడైతే అండం ఫలదీకరణం (Fertilization) చెందుతుందో అది ‘ఫేలోప్పియన్ ట్యూబ్’ ద్వారా స్త్రీ గర్భం (uterus) కు చేరుకుని ఒక గడ్డకట్టిన రక్తపు ముద్ద ఆకారంలో రూపాంతరం చెందుతుంది. ఇదే విషయాన్ని ఖురాన్ “ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” అని పేర్కొంటుంది. ఇదే విషయం మరోచోట ఖురాన్ “మేము మిమ్మల్ని వీర్యపు బొట్టుతో ఆ పైన రక్తపు గడ్డతో” – 22:5 అని ప్రస్తావిస్తుంది. స్త్రీ గర్భంలో ఈ దశ- పిండం రూపుదాల్చుకున్న 15 వ రోజు నుండి 24 వ రోజు వరకు సాగుతుంది. ఆ తరువాత పిండం ఒక “జలగ” ఆకారంలో రూపాంతరం చెందుతుంది. ఇక ఈ వాక్యం అరబీ మూలంలో “ముద్ద ఆకారం” అన్న చోట “Alaqah” అని చూడగలం. ఈ పదానికి మూడు అర్థాలు ఉన్నాయి 1. జలగ 2. వ్రేలడే వస్తువు 3. రక్తపు గడ్డ. గమనార్హమైన విషయం ఏమిటంటే గర్భంలో పిండం ప్రారంభ దశలో ఒక జలగ ఆకారంలోనే ఉంటుందన్నది.
3. “ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము” అన్న వాక్య భాగం పిండం యొక్క రెండవ దశను వివరిస్తుంది. ఈ వాక్యం అరబీ మూలంలో “కండ” అనే పదం “Mudghah” అని చూడగలం. అంటే “నమలబడిన ఒక పదార్థం వంటిది” అని అర్థం. వివరంగా చెప్పాలంటే జలగ ఆకారం నుండి పిండం ఒక నమలబడిన మాంసం ముద్ద ఆకారంలో మారుతుంది అని అర్థం.
4. “తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము” అన్న వాక్యం అర్థం కావాలంటే ముందు తెలుసుకోవలసింది గర్భంలో పిండం “ఒక మాంసపు ముద్ద” ఆకారం (Mudghah) స్థితిలో 6 వారాలవరకు మాత్రమే ఉంటుంది, ఆ తరువాత 7 వ వారం ప్రారంభం నుండే అస్తిపంజరం రూపుదిద్దుకోవటం ప్రారంభం అవుతుందన్నది! తరువాత 8 నుండి 9 వారాల వరకు మానవ రూపం దాల్చికుంటుంది. ఇది మాంసపు కండ ఎముకలుగా మారే దశ.
5. “ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము” అన్న వాక్యం గమనించే ముందు మనం పై వివరణలో “మాంసపు ముద్ద” ఆకారంలో ఉన్న పిండం 7 వ వారం ప్రారంభం నుండే అస్తిపంజరంగా రూపుదిద్దుకోవటం ప్రారంభం అవుతుందని తెలుసుకుని ఉన్నాము. ఇక ఆ తరువాత నుండి అంటే దాదాపు 8 లేదా 9 వారాల నుండి ఖచ్చితమైన కండరాల అభివృద్ధి మొదలై మానవ దేహం రూపుదాల్చటం ప్రారంభం అవుతుంది. ఆ తరువాతే పిండం సంపూర్ణంగా మానవ ఆకారంలో రూపుదిద్దుకుని, గర్భ సంచి నుండి ప్రతీ మానవుడూ ఈ భూమి మీదకు అడుగు పెట్టటం జరుగుతుంది. ఈ విషయాన్నే “ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము” అని ఖురాన్ చెబుతుంది.
ఈ విధంగా ఈనాటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology science) మనిషి శరీర నిర్మాణ దశలను గురించి ఏదైతే చెబుతుందో ఆ దశలను గురించి పూస గుచ్చినట్టుగా 1400 సం. కు పూర్వమే ఖురాన్ ఆవిష్కరించింది. వాస్తవానికి పై వ్యాసంలో సామాన్య ప్రజలకు సైతం అర్థమవ్వటానికి ఎన్నో విషయాలు సంక్షిప్తంగానే పేర్కొనటం జరిగింది. నిజానికి, ఖురాన్ వాక్యాలను ఇంకా ఎంతో లోతుగా విశ్లేషించవచ్చు కూడా! ఇక గమనించాల్సిన విషయం ఏమిటంటే- ఖురాన్ లో కేవలం ఒక్క పిండోత్పత్తి శాస్త్రం గురించే కాదు ఈనాటి ఆధునిక ఖగోళ శాస్త్రం పేర్కొంటున్న “బిగ్ బ్యాంగ్” థియరీ మొదలుకుని పర్వతాలు, గ్రహాల కక్ష్యలు, నక్షత్రాలు వగైరా ఎన్నో విషయాలు, ఇంకా “ప్రకృతి శాస్త్రం (Natural Science)” సంబంధించిన మరెన్నో విషయాలు 1400 సం. కు ముందే ఖురాన్ లో స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి.
కానీ, ఖురాన్ ను విమర్శించటమే పనిగా పెట్టుకున్న వారి కళ్ళకు ఇలాంటి జ్ఞానవంతమైన విషయాలు ఏ మాత్రం కనపడవు కదా! పైగా ఖురాన్ ను లోతుగా అవగాహన చేసుకోవటం ప్రక్కనపెడితే కనీసం ఒక్క సారి కూడా చదవకుండానే ఖురాన్ ను గ్రుడ్డిగా విమర్శిస్తూ ఉంటారు. వారి ఆందోళన ఏమిటంటే ఖురాన్ ఎక్కడ సత్య గ్రంధమని నిరూపణ జరిగిపోతుందో, అలా జరిగిపోతే తమ వర్గం ప్రజలు ఎక్కడ దాని పట్ల ఆకర్షితులు అయిపోతారో అన్నది. కానీ, ఖురాన్ లో దేవుడు చేస్తున్న వాగ్దానం " చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది” – 41:53-54 అన్నది. పైగా మా వద్ద ఉన్న గ్రంధాలే అసలైన గ్రంధాలు, మేమే పెద్ద తోపులం అని భావించుకునే ఈనాటి ఖురాన్ విమర్శకుల అమాయక ఆలోచన ఏమిటంటే- ఇస్లాం బలవంతంగా వ్యాపించింది! అబద్ధ విషయాలతో నిండిన ఖురాన్ ను సైతం ఎవరో కొందరు అమాయకులు, లోక జ్ఞానం లేనోళ్లు అనుసరిస్తూ ఉంటారు తప్ప తమ లాంటి తోపులు దానిని నమ్మరన్నది! ఇలాంటి అమాయకులు తెలుసుకోవలసింది- అటు అమెరికా, యూరప్, లండన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈనాడు అత్యంత విస్తృతంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం అన్నది. దానికి కారణం ఆయా దేశాల్లో ఉన్నత విధ్యను అభ్యసించినవారు, అనేక రంగాల్లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు ఖురాన్ చెబుతున్న విషయాలను నిస్పక్షపాతంగా పరిశీలించి, ఈనాడు ఆధునిక సైన్స్ చెబుతున్న ఎన్నో విషయాలను ఖురాన్ ఆనాడే చెప్పిందన్న విషయాన్ని గ్రహించి, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదివి, ఆయన తీసుకుని వచ్చిన గొప్ప సామాజిక నైతిక మార్పును బట్టి ఆయన బోధలు అర్థం చేసుకోవటం ద్వారా ఇస్లాం ను స్వీకరిస్తున్నార అన్నది. కాబట్టి ఆలోచించటం అన్నది జ్ఞానులు చేసే పని! అనాలోచితంగా విమర్శించటం అన్నది ఆజ్ఞానులు చేసేపని! ఆలోచించే గుణం లేనోళ్లకు జ్ఞానం గురించి, పరిశీలించే అలవాటు లేనోళ్లకు సత్యం గురించి మాట్లాడే హక్కు ఉండదు.
Md Nooruddin