Posted by Sakshyam Magazine on Saturday, January 31, 2015
నేటి అధిక శాతం క్రైస్తవ పండితులు ప్రజల నైతిక సంస్కరణను పూర్తిగా విస్మరించారు. అందుకే ఇతర సమాజాలలో అనేక జాడ్యాలు ఏవిధంగా పేరుకు పోయి వున్నాయో క్రైస్తవ సమాజంలో కూడా అలాగే పేరుకు పోయి ఉన్నాయి. నేటి క్రైస్తవ సమాజాన్ని అన్యుల సమాజాలకంటే ఒక ప్రత్యేక స్థానంలో చూపించలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. అన్యులలో కులతత్వం పేరుకుపోయి ఉంటే క్రైస్తవ సమాజంలో డినామినేషన్ ల తత్వం ఉన్నది. అన్యులలోని అనైక్యత, అనైతికత, మద్యపానం, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, హత్యలు, మానభంగాలు, మోసం, దగా, వంచన, లంచగొండితనం, మానసిక శారీరక రుగ్మతలు, ఇత్యాది జాడ్యాలన్నీ క్రైస్తవ సమాజంలోనూ తిష్ఠవేసుకుని ఉన్నాయి.
కారణం ఏమిటంటే- వ్యక్తిత్వాలలో "నైతికత" కొరకు వ్యక్తుల మధ్య ఐక్యత కొరకు యేసు చేసిన బోధనలను పూర్తిగా వదలి కేవలం యేసుకు దైవత్వాన్ని అంటగట్టే ప్రయత్నం చేయటంలో నేటి బోధకులు నిమగ్నమై పోవటమే! నిజానికి పాతనిబంధనలోని లేఖనాలుగాని, స్వయంగా యేసునుగాని, యేసు ప్రత్యక్ష శిష్యులుగాని, యేసు సమకాలికులుగాని, యేసు అనంతరం సాగిన అపోస్తలుల సువార్తా ప్రస్తానంలో గాని యేసు దైవత్వన్ గురించి ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంధం వరకు సాగిన చరిత్రలో యేసును గూర్చి రెండే రెండు విషయాలు ప్రముఖంగా కనిపిస్తాయి. అవి:
1.యేసును క్రీస్తుగా నమ్మాలి. 2.యేసు బోధనలను అనుసరించాలి.
ప్రధానమైన ఈ రెండు విషయాలలో, నేటి క్రైస్తవ పండితుల ప్రయాస ఏ కోశానా కనిపించదు. వారి ప్రయాస అంతా యేసును దేవునిగా లేనిపోని కధనాలతో కల్పితమైన సిద్ధాంతాలతో నిరూపించే ప్రయత్నం చేస్తారు. ఇది బైబిలులో లేని ప్రయాస. దేవుడుగాని, యేసుగాని కోరని వృధా ప్రయాస! ఈ ప్రయాసలో భాగంగా ఈ పుస్తకంలో రాబోయే వాక్యాలను అంశాలను వారు ఉపయోగిస్తూ ఉంటారు. అవన్నీ క్రైస్తవ పండితుల అపార్ధాలే కాని బైబిలు గ్రంధ యధార్ధాలు కావు. వారు ఏవైతే వాక్యాలను ఎన్నుకుని తమ సిద్ధాంతాలను ఏర్పరచుకున్నారో వాటి వాస్తవికత తెలుసుకొనే ప్రయత్నం చేద్ధాం.