Posted by Sakshyam Magazine on Friday, December 25, 2015
ప్రియ క్రైస్తవులారా! ఒక వైపు యెహోవా దేవుడు, మరొక వైపు యేసు క్రీస్తు అబద్ధ ప్రవక్తలను గురించి మిమ్ములను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారో గమనించగలరు.
మీకు ప్రవచములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును బ్రమ పెట్టుదురు.వారు నన్ను తృణీకరించువారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో - మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యిర్మియా 23:16-17.
నిజమే నేటి అధికశాతం బోధకులు దేవుని వాక్యాన్ని బట్టి కాక, ఎవనికి తోచిన దర్శనం చొప్పున వాడు సామాన్య ప్రజలను భ్రమలకు గురిచేస్తూ ఎవరి సంఘం వారు కట్టుకుంటూ పోతున్నారు. అలాంటి వారి మాటలు వినవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అటువంటి వారి గురించి యేసు ఏవిధంగా హెచ్చరిస్తున్నారో ఈక్రింది గమనించగలరు.
"ఆబద్ధ ప్రవక్తల"ను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. - మత్తయి 7:15.
(యేసు) ఇట్లనేను- శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు విధవ రాండ్ల యిండ్లను దిగ మ్రింగుచు మాయ వేషముగా దీర్ఘప్రార్ధనలు చేయదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. -లూకా 20:45-47
పై వాక్యాలలో హెచ్చరిస్తున్నట్లే సంఘస్తుల ద్వారా బాగుపడి సంఘాన్ని ఏమాత్రం పట్టించుకొనని మరియు అమాయకుల ఆస్తులను కాజేసే క్రూర స్వభావం కలిగిన బోధకులే నేడు ఎక్కువైపోయారు. ప్రజలను దోచుకుంటే దోచుకున్నారు. కనీసం స్వచ్చమైన "
క్రీస్తు బోధ" బోధిస్తున్నారా అంటే అదీ లేదు. వారి లక్షణాలు.
మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీ (క్రైస్తవుల)లోనూ అబద్ధ బోధకులుందురు. వీరిని బట్టి సత్యమార్గము (క్రైస్తవ్యం) దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ (సంఘస్తుల) వలన లాభము సంపాదించుకొందురు. - 2పేతురు 2:1-3
ఈ వాక్యమును బట్టి వారిని ఈ మూడు లక్షముల ద్వారా కనిపెట్టవచ్చు.
1.పడియవ వంతు అందరి దగ్గరా తీసుకుంటారు. కానీ వారు మాత్రం ఎవరికీ ఇవ్వరు. ఇది వారిలో ఉన్న లోభత్వానికి గుర్తు. వాస్తవానికి యేసు - "ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి. -మత్తయి 10:82 అని ఆజ్ఞాపించి ఉన్నారు. ఇక,
2.పరిశుద్ధ గ్రంధంలో లేని కల్పనా వాక్యములు (తప్పుడు విశ్వాసములు) బోధిస్తుంటారు. అందుకే "అనైతికత - అనైక్యత"ల వంటి చెడులు నేటి క్రైస్తవ సమాజంలో నూ ఏర్పడ్డాయి.
3.కడు బీద విశ్వాసుల వలన సైతం లాభము (కానుకలు) సంపాదించుకుంటారన్నది అందరికీ తెలిసిందే. పైవాక్యం ప్రకారం అబద్ధ బోధకుల మౌలిక లక్షణాలు ఇవే! అలాంటి వారిని గురించి యేసు శిష్యుడైన యోహాన్ హెచ్చరికను ఈక్రింది గమనించగలరు.
చిన్న పిల్లలారా,యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో (క్రైస్తవులలో) నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబoద్ధులు కారు. -1.యోహాను 2:18-19
పై వాక్యాల ప్రకారం - క్రైస్తవులలో నుండే క్రైస్తవ్యాన్ని నాశనం చేసే అబద్ధ బోధకులు వస్తారని తెలుస్తుంది. అలాంటి వారి నుండి క్రైస్తవ్యాన్ని కాపాడుకొని, క్రీస్తు ప్రకటించిన సత్య సువార్త ద్వారా "నైతికత - ఐక్యత"లను తిరిగి సాధించాలనుకునే క్రైస్తవులు బైబిల్ "యధార్ధ సువార్త"ను తెలుసుకోవల్సిన అవసరం ఉంది.
Written by : M.A.అభిలాష్