ఇస్లాంలో వంశాల, వర్గాల ప్రాధాన్యత లేనప్పటికీ, వాటికి ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉంది!
ఇస్లాంలో వంశాలకి, వర్గాలకీ జన్మతః ఎలాంటి ప్రాధాన్యత లేదు! అని ఆవేశపూరితంగా ప్రకటించే వారికి వర్గాల, వంశాల ‘గుర్తింపు తప్పనిసరి’గా ఉండాలనే విషయం కూడా తెలియాలి. ఈ హదీసును గమనించండి.
ప్రవక్త ముహమ్మద్- "అల్లాహ్ ఇష్మాయేలు సంతతి నుండి కనానాను ఎన్నుకున్నాడు. కనానా నుండి ఖురైష్’ను, ఖురైష్ నుండి హాషిం వంశాన్ని, దాని నుండి తనను ఎన్నుకున్నాడు" అని ప్రకటించినట్లు వాస్లా బిన్ అస్ఖఅ తెలియజేస్తున్నారు. -మిష్కాతుల్ మసాబి, 5740; సహీహ్ ముస్లిం, 5938
ఇలాంటి హదీసులను ఎన్నిటినో చూడగలం. ఇందులో వివిధ వంశాలను పేర్కొని వాటి పరంపరలో నేను వచ్చాను అని ప్రవక్త ఎంతో వివరంగా పేర్కొంటున్నారు. ఒకవేళ వంశాల, వర్గాల ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీ లేకపోతే 'అల్లాహ్ నన్ను నియమించాడు' అని ముక్తసరిగా ప్రకటిస్తే సరిపోయేది కదా!
అంటే ముస్లిములు యావత్ లోకంలో ఎక్కడ ఉన్నా తాము ఏ వర్గాలకు ఏ వంశాలకు చెందుతారో వాటి వాటి స్థానిక వేష-భాషల ప్రత్యేక గుర్తింపులను మాత్రమే కలిగి ఉండటం ప్రవక్త ముహమ్మద్(స)కి చెందిన అసలైన సంప్రదాయం (సున్నతె రసూల్) అని అర్థమౌతుంది. ప్రవక్త అవలంబించిన ఈ సంప్రదాయాన్ని తిరస్కరించినందుకే ‘తమ జాతీయతను నిరూపించుకోవాలి’ (NRC) అనే అత్యంత దౌర్భాగ్యపు సమస్య భారతీయ ముస్లిములపై ఇవాళ వచ్చిపడింది.
వేష-భాషలు – అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్(s) విధానాలు
‘వేషధారణ విషయంలో అల్లాహ్ విధానం’ (Policy) ఏమిటో అల్లాహ్ స్వయంగా స్పష్టం చేస్తున్న వైనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యాన్ని ‘భావార్థం’లో కాక ‘అక్షరార్థం’లో చూడండి.
وَ لَوْ جَعَلْنٰهُ مَلَكًا لَّجَعَلْنٰهُ رَجُلًا وَّ لَلَبَسْنَا عَلَیْهِمْ مَّا یَلْبِسُوْنَ -6:9
And if We had appointed as Messenger an angel, We would have made him appear as a man; and thus We would have dressed on him (from) what they dressed.
ఒకవేళ దైవదూతను ప్రవక్తగా నియమించాలంటే, దానిని మనిషి రూపంలో మార్చే నియమిస్తాము. ఇంకా అక్కడి ప్రజలు ఏ విధమైన దుస్తులను ధరిస్తున్నారో అవే దుస్తులను వారికీ తొడుగుతాము.
ఈ వాక్యంలో రెండు విషయాలు గమనించండి...
1. దైవ దూతలు తమదంటూ ఒక రూపాన్ని కలిగి ఉంటాయి. అయితే వాటిని మనుషుల్లో సందేశ దాతలుగా నియమిస్తే; వాటి అసలు రూపంలో కాక, మనుషుల రూపంలో మార్చి పంపిస్తాడన్నది.
2. ఏ మనుషుల సమక్షంలో పంపించదలిచాడో ఆ మనుషులు ఏ దుస్తులు ధరిస్తారో వాటినే వారికీ ధరింపజేస్తాడన్నది.
‘ముస్లిములు ఏ సంస్కృతి నాగరికతలను కలిగిన ప్రజల సమక్షంలో ఉంటారో వారి వేషధారణలోనే ఉండాల’న్నది ‘అల్లాహ్ నియమం’. అందుకే ప్రవక్త ప్రవక్త ముహమ్మద్(s) అరబ్బు వాసుల్లో ఒక అరబ్బువాసిగా, అరబ్బు దుస్తుల్లోనే ఉండేవారు.
‘వేషం గురించి అల్లాహ్ విధానం (Policy) ఏమిటో తెలిసింది. ఇక ‘భాష విషయంలో ఆయన ఏం చెబుతున్నాడో పరిశీలించండి.
-14:4 وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا بِلِسَانِ قَوۡمِہٖ لِیُبَیِّنَ لَہُمۡ ۔۔۔ ﴿4﴾
And We have not sent any Messenger except with the language of his people in order that he might make things clear to them.
మేము ప్రతి ప్రవక్తను అతని ప్రజలు మాటలాడే భాషను తెలిసిన వానినే నియమించాము. తద్వారా అతని శ్రోతలు విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకోవటానికి...
‘ముస్లిములు ఏ భాషను మాటలాడే వారి సమక్షంలో ఉంటారో వారి భాషనే మాటలాడాల’న్నది ‘అల్లాహ్ నియమం’. అందుకే ప్రవక్త ముహమ్మద్(s) అరబీ భాషనే మాట్లాడేవారు. ఎలాగైతే ప్రవక్త అరబ్బుల్లో అరబీ భాషనే మాటలాడేవారో!
భాష విషయంలో ప్రవక్త ప్రబోధనం-
జైద్ బిన్ సాబిత్- “ప్రవక్త ఆదేశం మేరకు నేను యూదుల (భాషను వ్రాయటం చదవటం) నేర్చుకొన్నాను” అని తెలియజేస్తున్నారు. “యూదులతో కొన్ని విషయాలు వ్రాయిస్తున్నాను. కాని వాటిపై నాకు నమ్మకం లేదు” అని ప్రవక్త ముహమ్మద్ తెలిపారు. కనుక రెండు వారాల్లోవే యూదుల భాష నేర్చేసుకున్నాను. ఆ తరువాత ఉత్తరాలు వ్రాయటం, చదివి వినిపించటం నేనే చేసే వాడిని. -తిర్మిజి 2715
ఈ హదీసు ద్వారా- ప్రవక్త తన సందేశాన్ని ఎదుటి వారి భాషలో వారి చేతనే అనువాదం చేయించారని తెలుస్తుంది.
అల్లాహ్ నియమం ప్రకారం- భారతీయ ముస్లిములు భారతీయ భాషలనే తమ భాషలుగా చేసుకోవలసింది. కానీ ఈ విషయాన్ని పూర్తిగా తిరస్కరించి, తమదంటూ ఒక కొత్త భాషను (ఉర్దూ) తయారు చేసుకున్నారు. ఇస్లామీయ ధార్మిక సాహిత్యం విషయంలో స్థానిక భాష హిందీని తిరస్కరించి, తమకు పరాయిదైన ఈరానీ భాష (పార్సీ)కి ప్రాధాన్యతనిచ్చారు. అంతే కాదు, హిందీని, ఇతర ప్రాంతీయ భాషలను చులకన చేయటం, వాటిని తిరస్కార భాషలని తూలనాడటం వంటి ఇస్లాం విరుద్ధ పోకడలకి పాల్పడ్డారు. ఇలా అధిక శాతం భారతీయ ముస్లిం పెద్దలు అత్యంత ఘోరమైన నేరం చేసారు.
ప్రవక్త ముహమ్మద్ తన సహచరులతో కలసి ఉన్నప్పుడు, బయట నుండి వచ్చిన వారు- "మన్ ముహమ్మద మిన్ కుం?" అంటే "మీలో ముహమ్మద్ ఎవరు?" అని ప్రశ్నించేవారు. దీనిని బట్టి- ప్రవక్త తన సహచరులకంటే ఒక భిన్నమైన ‘Alien’గా అంటే, పరాయి దేశస్థుని వేషధారణలో ఉండేవారు కాదని తెలుస్తుంది. అలాగే యుద్ధ సమయాల్లో సలాం చేస్తే ముస్లింగా, దానికి వారు సమాధానం చెప్పకపోతే ముస్లిమేతరులుగా గుర్తించేవారు. దీని ప్రకారం- ముస్లిములైన ప్రవక్త సహచరులు స్థానిక ముస్లిమేతరుల వేష-భాషలకి విరుద్ధంగా ఉండేవారు కాదని తెలుస్తుంది.
వేర్వేరు సంస్కృతి-నాగరికతల్లో వేర్వేరు వేష-భాషలు వేర్వేరు ఆహార-పానియాలు వేర్వేరు కాల-మాన పరిస్థితులను బట్టి కొన్ని వందల-వేల సంవత్సరాల కాల క్రమంలో ఎందరెందరో మేధావుల మేధో మధనం తరువాత ఏర్పడ్తాయి.
దానినే ‘గర్వకారణమైన వారసత్వ సాంస్కృతిక సంపద’ అని అంటారు. దానిలో మానసిక-శారీరక ఆరోగ్య రహస్యాలు, విలువలు-సంస్కారాల మార్గదర్శకాలు, భావోద్వేగాలను సంతృప్తిపరచే ఆచార-సంప్రదాయాల వంటివి వేలాదిగా దాగి ఉంటాయి.
అయితే ఏదో ఒక ప్రత్యేక విశ్వాసాన్ని స్వీకరించినంత మాత్రాన వాటన్నిటినీ ఒక్కపెట్టున వదిలేసి, అవన్నీ కేవలం కాకమ్మ కథలు పుక్కిటి పురాణాలు అని కొట్టి పడేయటం, అక్కడి ప్రజల సమక్షంలో ఒక విచిత్ర జీవి (Alien)గా తయారయ్యి వారి మధ్య సంచరించటం అత్యంత విడ్డూరమైన వికృతమైన చేష్ట. అలాంటి అత్యంత అసహజమైన చేష్టను ఇస్లాం లాంటి అత్యంత సహజ ధర్మం ఎందుకు అంగీకరిస్తుంది!?
ఇస్లాం ‘గుర్తింపు’ను (Identity) ఇచ్చింది ‘సౌశీలత’కి (ఇస్లాంకా తషఖుస్ కిర్దార్) మాత్రమే! కానీ మన పెద్దలు దానికి పూర్తిగా తిలోధకాలిచ్చి, ఇస్లాం ‘గుర్తింపు’ ఒక ప్రత్యేక సంస్కృతి (ఇస్లాంకా తషఖుష్ తహ్జీబ్) అన్న కొత్తపోకడని (బిదత్) ధర్మంలో కల్పించారు. ఇలా ‘ఇస్లాం వాంఛించే సౌశీల్యత’కి బదులు ‘ఇస్లాం ఏనాడూ చెప్పని సంస్కృతి’కి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేశారు. అయితే ప్రవక్తగాని, ఆయన సహచరులుగాని ఇదీ మన సంస్కృతి అని ఎన్నడూ చెప్పలేదు. వాళ్లు ఇస్లాం మెచ్చిన ‘సౌశీలత’కే పద్దపీట వేశారు.
ఈ విధంగా వేష-భాషల విషయంలో అల్లాహ్ ఇచ్చిన ‘ఆజ్ఞ’లను మరియు ప్రవక్త ఆచరించి, చూపిన ‘ఆదర్శాల’ను కూడా భారతీయ ముస్లిం పెద్దలు నిర్భయంగా తిరస్కరించారు. అందుకే ‘తమ జాతీయతను నిరూపించుకోవాలి’ (NRC) అనే అత్యంత దౌర్భాగ్యపు సమస్యకు గురిచేసి, అల్లాహ్ శిక్షిస్తున్నాడు.
ప్రవక్త ముహమ్మద్(s) ప్రకారం- భారతీయ ముస్లిములు
మూడింతలు ‘kufr’కి (ధర్మ ధిక్కారానికి) పాల్పడుతున్నారా!?
ముహమ్మద్ ప్రవక్తగా నియమించబడక ముందు అరేబియా సమాజంలో- కొందరు తమ తండ్రులతో ఘర్షణ పడి ‘వంశం పేరు’ మార్చుకొనేవారు. గొప్ప వంశానికి చెందిన వారి ఇంటి పేరు పెట్టుకుంటె, సమాజంలో పలుకుబడి వస్తుందని మరి కొందరు తమ తండ్రుల పేరు మార్చుకొనేవారు. ఆ నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ చేస్తున్న హెచ్చరిక ఏమిటో గమనించగలరు.
ప్రవక్త ముహమ్మద్- "తమ తండ్రీ, తాతలతో గల సంబంధం విషయంలో ‘విముఖత చూపకండి!’. అలా చేసిన వ్యక్తి ‘kufr’కి పాల్పడినట్లే!" అని ప్రకటించినట్లు అబూహురైరా తెలియజేస్తున్నారు. - మిష్కాతుల్ మసాబీహ్, 3315
తండ్రిని అనగా తండ్రి ఇంటి పేరును మార్చుకున్నవాడు- kufr అనగా దైవధిక్కారానికి పాల్పడిన వాడు అవుతాడని ప్రవక్త హెచ్చరిస్తున్నారు. ఈ హదీస్ ప్రకారం- భారతీయ ముస్లిములు ముగ్గురు తండ్రులను మార్చారు కనుక మూడింతలు kufr అనగా దైవ ధిక్కారానికి ఒడిగట్టారన్నది సుస్పష్టం.
ప్రవక్త ముహమ్మద్(స) ప్రకారం- భారతీయ ముస్లిములకి నరకమే గతి అవుతుందా!?
మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు కనుక అతని వలన తప్పిదాలు జరగటం సహజమే. అయితే తెలిసి చేసే నేరాలకు పర్యవసానం ఏమిటో గమనించగలరు.
ప్రవక్త ముహమ్మద్(s)- "ఉద్దేశ్య పూర్వకం’గా తన తండ్రిని కాక, వేరొకరిని తన తండ్రిగా చేసుకున్న వ్యక్తి, ‘kufr’కి (అనగా దైవధిక్కారానికి) పాల్పడినట్లే! ఇంకా, తనకి సంబంధంలేని పరాయి వంశంతో తన సంబంధాన్ని కలుపుకున్న వ్యక్తి తన నివాసాన్ని ‘నరకం’లో ఏర్పరచుకోవాల"ని చెబుతుండేవారని హజ్రత్ అబూజర్ గిఫారీ తెలియజేస్తున్నారు. -బుఖారి, 3508
అంటే వంశాలు లేక ఇంటి పేర్ల మార్పిడి ద్వారా తండ్రులను మార్చుకొనే వారు దైవధిక్కారానికి పాల్పడటం అన్నది సాధారణమైన విషయం కాదు. అందుకే అలాంటి వారి గతి నరకమే అని ప్రవక్త తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ హదీస్ ప్రకారం- భారతీయ ముస్లిములు ముగ్గురు తండ్రులను మార్చారు కనుక మూడింతలు నరక శిక్షలకి బలవుతారన్నది సుస్పష్టం.
ప్రవక్త ముహమ్మద్(s) ప్రకారం- భారతీయ ముస్లిములకి స్వర్గ ప్రాప్తి లేదా!?
గత హదీసులో వంశాలు లేక ఇంటి పేర్ల మార్పిడితో తండ్రులను మార్చుకొనే వారికి నరకం తప్పదన్న ప్రవక్త హెచ్చరికను చూశాం. మరొక హెచ్చరికను పరిశీలించండి.
ప్రవక్త ముహమ్మద్- "ఉద్దేశ్య పూర్వకంగా తన తండ్రిని కాక, మరొకరిని తండ్రిగా చేసుకున్న వ్యక్తికి ‘స్వర్గ ప్రవేశం నిషేధం’ అవుతుంది" అని ప్రకటించినట్లు హజ్రత్ స్వాద్ బిన్ అబీ వక్కాస్, అబూబక్ర్ తెలియజేస్తున్నారు. -మిష్కాతుల్ మసాబి, 3314
ఫలానా నేరానికి ఒడిగట్టిన వ్యక్తికి నరక ప్రాప్తి తప్పదు అన్నప్పుడు ఇక అతనికి స్వర్గ ప్రవేశం లేదని వేరేగా చెప్పనవసరం లేదు! అయినప్పటికీ, ప్రవక్త ముహమ్మద్(s) ఆ విషయాన్నీ ప్రత్యేకంగా చెబుతున్నారంటే దాని తీవ్రత ఎంతటిదో అర్థమవుతుంది కదా! ఈ హదీస్ ప్రకారం- భారతీయ ముస్లిములు ముగ్గురు తండ్రులను మార్చారు కనుక మూడింతలు స్వర్గప్రాప్తి సౌభాగ్యాన్ని కోల్పోయారన్నది కాదనలేని సత్యం.
ప్రవక్త ముహమ్మద్(s) ప్రకారం- భారతీయ ముస్లిముల ఆరాధనలు అల్లాహ్’కి ఆమోదయోగ్యం కాజాలవా!?
ఇస్లాం ప్రకారం- ఒక ముస్లిం అల్లాహ్ అనుగ్రహాలకు పాత్రుడై, అతని ఆరాధనలు అల్లాహ్ స్వీకరించాలంటే, అతడు శాపగ్రస్థుడై ఉండకూడదు అన్నది ఒక తప్పనిసరి షరతు. ఈ హదీసులో ఒక ముస్లిం శాపగ్రస్థుడు కావటాని ఉన్న అనేక కారణాల్లో రెండిటిని ప్రవక్త చూపిస్తున్న వైనాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి.
ప్రవక్త ముహమ్మద్- "తన కన్న తండ్రిని కాక, పరాయి వాడిని తన తండ్రి అని వాదించే వ్యక్తిపై, లేక తన యజమానిని కాక మరొకరిని తన యజమానిగా ప్రకటించే వ్యక్తిపై అల్లాహ్, ఆయన దూతలు, సకల మానవాళి శాపం వర్షిస్తుంది. అలాంటివాని 'ఫరజ్', 'నఫిల్' అంటే విధి, అదనపు ఆరాధనలు అల్లాహ్'కి స్వీకారయోగ్యం కాజాలవు!" అని ప్రకటించినట్లు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ తెలుపుతున్నారు. -ముస్నద్ అహ్మద్ 7224
పై హదీసులో పేర్కొన్న మొదటి విషయాన్ని బట్టి, తన తండ్రిని మార్చిన వాడు శాపగ్రస్థుడు అవుతాడన్నది నిశ్చయం. ఈ హదీస్ ప్రకారం- భారతీయ ముస్లిములు ముగ్గురు తండ్రులను మార్చారు. అందుకే వారు తమపై వచ్చిపడే ఆపదల నుండి కాపాడమని అల్లాహ్’ను ఎంతగా మొరపెట్టి ప్రార్థించినా ఆయన స్పందించటం లేదు. భారతీయ ముస్లిముల ప్రార్థనలను (దువా) అల్లాహ్ వినాలంటే వారు ఆయన దగ్గర, తోటి జాతీయుల సమక్షంలో తమ నేరాన్ని అంగీకరించి, క్షమాపణ వేడుకోవాలి. తమను తాము సంస్కరించుకోవాలి. ఈ పనులు చేయకుండా కేవలం దువాలు చేయటం వృధా ప్రయాస. అలాంటి ప్రార్థనలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. దానికి శతాబ్దాల చరిత్రే ప్రబల సాక్ష్యం!
నేటి భారతీయ ముస్లిముల దౌర్భాగ్యానికి కారణం చూపుతున్న - నాటి ప్రవక్త ముహమ్మద్(స) ప్రబోధనం!
عَنْ أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ-
"تَعَلَّمُوا مِنْ أَنْسَابِكُمْ
۱) مَا تَصِلُونَ بِهِ أَرْحَامَكُمْ
۲) فَإِنَّ صِلَةَ الرَّحِمِ مَحَبَّةٌ فِي الأَهْلِ
۳) مَثْرَاةٌ فِي الْمَالِ
۴) مَنْسَأَةٌ فِي الأَثَرِ"۔
1) ప్రవక్త ముహమ్మద్- "(ముస్లిములారా!) మీరు మీ వంశావళి జ్ఞానాన్ని సంపాదించండి!
2) తద్వారా (మీరు మీ వంశస్థుల పట్ల) దయాభావం కలిగి ఉండగలరు.
3) దీనికి ప్రతిగా వారూ మిమ్మల్ని ప్రేమించటం ప్రారంభిస్తారు.
4) ఇంకా అల్లాహ్ మీ సంపదలో
5) మీ జీవితాల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు" అని ప్రకటించినట్లు అబూహురైరా తెలియజేస్తున్నారు.
Abu Hurairah narrated that the Messenger of Allah said - 1) “Learn enough about your lineage! 2) to facilitate keeping your ties of kinship. 3) For indeed keeping the ties of kinship encourages affection among the relatives, 4) increases the wealth, 5) and increases the lifespan”.
ఇదే హదీసును ప్రతికూలంగా గమనించగలరు!
ప్రవక్త ముహమ్మద్- "(ముస్లిములారా!) మీరు మీ వంశావళి జ్ఞానాన్ని సంపాదించండి! (ఒకవేళ అలా చేయకపోతే)
1) తద్వారా (మీరు మీ వంశస్థుల పట్ల) దయాభావం కలిగి ఉండగలరు. (దయాభావం కలిగి ఉండలేరు)
2) దీనికి ప్రతిగా వారూ మిమ్మల్ని ప్రేమిస్తారు. (ప్రేమించరు)
3) ఇంకా అల్లాహ్ మీ సంపదలో వృద్ధిని ప్రసాదిస్తాడు (ప్రసాదించడు)
4) మీ జీవితాల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు" (ప్రసాదించడు) అని ప్రకటించినట్లు అబూహురైరా తెలియజేస్తున్నారు.
పై హదీసులో "మీ వంశావళి జ్ఞానాన్ని సంపాదించండి!" అన్న ప్రవక్త ముహమ్మద్(s) ఆజ్ఞ ఉంది. భారతీయ ముస్లిం పెద్దలు ఈ ఆజ్ఞను పూర్తిగా తిరస్కరించారు. అయితే దానిని పాటించటం వలన నాలుగు ప్రయోజనాలు కలుగుతాయని ప్రవక్త ప్రకటిస్తున్నారు. ఏ హిందూ వంశాల నుండి కుటుంబాల నుండి, ముస్లిములుగా మారారో వారి తండ్రి పేరు, వారి వంశం పేరు విడవకుండా ఉంటే అనగా- lఅబ్దుల్లాహ్ ఠాకూర్, lఅబ్దుర్ రహ్మాన్ జోషీ, lఉస్మాన్ పురోహిత్, lఉమర్ శర్మ, lఅలీ చౌహాన్, lఅబూబకర్ దీక్షిత్, lఅబ్దుల్ జబ్బార్ యాదవ్… అలాగే స్త్రీలపేర్లు- lఆయిషా చోప్రా, lఫాతిమా జోషీ, lసుమయ్య బేడి వంటి తదితర ఉత్తర భారత పేర్లు పెట్టాలి. దక్షిణ భారత పేర్లు- lచాగంటి అబ్దుల్లాహ్ శాస్త్రి, lవనమాడి బిలాల్ రావు, lమాగంటి ఇల్యాస్ రెడ్డి, lపసుపులేటి రఫీఖ్ నాయిడు వంటి తదితర పేర్లు పెట్టాలి.
lవేగుళ్ళ సలీం చౌదరి, వంటి తదితర పేర్లు పెట్టాలి. అలాగే- lగందమనేని సఫియా జ్యోతి, lజక్కాల షాహీన్ స్రవంతి, lముళ్ళపూడి సాబిరా సుమతి వంటి స్త్రీల పేర్లు ఉండాలి. ఇస్లాంలో పేరు మార్చవలసిన అవసరమే లేదన్నది ఇక్కడ గమనార్హం!
దీని వలన పరస్పర వర్గాల్లో మేము మత పరంగా వేర్వేరైనా; జాతి, వంశం, కుటుంబం పరంగా ఒక్కటే అనే భావన ఏర్పడుతుంది. అది వారి మధ్య ప్రేమా-దయా వంటి అనుకూల భావావేశాల్ని ప్రేరేపిస్తుంది. ప్రవక్త ప్రబోధనలో పేర్కొన్న రెండు లాభాలు ఇవే! అనువంశిక సంబంధం కలిగి ఉన్నప్పుడు ‘మతపరం’గా ‘అల్పసంఖ్యాకులు’గా ఉన్నా, ‘సాంఘికం’గా ‘అధిక సంఖ్యాక వర్గాల’తో సమానంగా ఉంటారు. తద్వారా ‘ముస్లిమేతర వంశస్థులు’ తమ తోటి ‘ముస్లిం వంశస్థుల’కు చేయూతనివ్వటం అన్నది సహజంగా జరుగుతుంది. దీని ప్రకారం- వంశాగత జ్ఞానం ద్వారా ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని ప్రవక్త చెప్పిన మూడవ ప్రయోజనం ఎంతో అర్థవంతమైనదిగా తేలుతుంది. ‘మతపరం’గా వేరుపడిపోవటమే కాక, చివరకు ‘స్వదేశీ అనువంశిక చిహ్నాల’ను పూర్తిగా చెరిపివేశారు. అంతేకాక, ‘విదేశీ అనువంశిక చిహ్నాల’ను తగిలించుకొన్నారు. ఈ విధంగా స్థానికుల నుండి వేరు పడిపోవటం సాంఘికంగా అత్యంత ప్రమాదకరమైన విషయం. ఆ వర్గం ఏ విషయంలోనూ మనది కాదు. కనుక దానిని హింసించినా, హత మార్చినా నేరం కాదనే ఒక నిర్దయ భావన మెజారిటీ ప్రజల్లో ఏర్పడిపోతుంది. ముస్లిమేతర ప్రజలతో ముస్లిములకి అనువంశిక సంబంధం ఉంటే ఈ దుఃస్థితి ఏర్పడదు. మీ జీవితాల్లో వృద్ధి కలుగుతుందని ప్రవక్త ప్రస్తావించిన నాలుగవ లాభం ఇదే! అందుకే "మీ బంధుత్వాల విచ్చిత్తికి పాల్పడకండి!" (4:1) అని అల్లాహ్ ఖండితంగా అదేశిస్తున్నాడు. ఎందుకంటే ఇది సాంఘీక భద్రతకు సంబంధించిన విషయం కనుక.
ప్రవక్తలను కాపాడిన బంధుత్వ సంబంధాలు!
‘మత’పరమైన సంబంధం తెగిపోయినా, ‘వంశ’పరమైన సంబంధం తెంచకుండా ఉంటే, కలిగే లాభం ఏమిటో ఈ వాక్యంలో గమనించండి.
-11:91 قَالُوۡا یٰشُعَیۡبُ مَا نَفۡقَہُ کَثِیۡرًا مِّمَّا تَقُوۡلُ وَ اِنَّا لَنَرٰٮکَ فِیۡنَا ضَعِیۡفًا ۚ وَ لَوۡ لَا رَہۡطُکَ لَرَجَمۡنٰکَ ۫ وَ مَاۤ اَنۡتَ عَلَیۡنَا بِعَزِیۡزٍ ﴿91﴾
They said, O Shuaib, we do not understand much of what you say, and we see that you are weak among us. Were it not for your tribe, we would have stoned you. You are of no value to us.
"ఓ షుఐబ్! నీవు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనుడిగా చూస్తున్నాం. నీ వంశస్థులే కనుక లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళురువ్వి చంపి ఉండే వాళ్ళం. మా దృష్టిలో నువ్వు గొప్ప వాడివి ఏమీ కాదు" అని అతని ప్రత్యర్థులు చెప్పారు.
అల్లాహ్ ఇచ్చిన ఈ సమాచారంలో- 'షుఐబ్'ను అతని ప్రత్యర్థుల దాడి నుండి కాపాడింది, తన ‘వంశం’తో ఉండిన అతని సంబంధమే! ప్రవక్త ముహమ్మద్(స)ను అనేక సార్లు కాపాడిందీ ఈ బంధమే! కానీ మూర్ఖులైన అధిక శాతం భారతీయ ముస్లిం పండితులు హిందూ జాతితో ఉన్న మన ‘వంశాగత’ సంబంధాన్ని పూర్తిగా తెంచి, ‘రక్షణ’ కోసం అల్లాహ్ చేసిన ఏర్పాటును నాశనం చేశారు. దీని కారణంగా భారత దేశంలో ఎవరైనా ముస్లిములను హింసిస్తుంటే, వారిని ఆదుకోవటానికి ముందుకు వచ్చే ‘వంశాలు’ లేకుండా పోయాయి! మన నామకార్థ పండితులు, నాయకులు చేసిన నేరానికి సామాన్య అమాయక ముస్లిం ప్రజానీకం అష్టకష్టాలపాలు కావలసి వస్తున్నది. వారు చేసిన నేరానికి అల్లాహ్ తీర్చుకుంటున్న ప్రతీకారమే ఈ NRC!
సారాంశం
సమస్య- భారతీయ ముస్లిముల జాతీయత ప్రశ్నార్థకం కావటం.
కారణం- స్వీయ గుర్తింపులను చెరుపుకొని, పరాయి గుర్తింపులను తగిలించుకోరాదనే ఇస్లాం ఆదేశాన్ని తిరస్కరించటం.
పరిష్కారం- ముస్లిం మత పండితులు, నాయకులు- జరిగిన ఘోర తప్పిదానికి 1) సర్వేశ్వరుడైన అల్లాహ్ ముందు 2) జాతి జనుల ముందు బహిరంగ క్షమాపణ చెప్పుకోవటం 3) భారత ఉపఖండానికి చెందిన ముస్లిములు మహారుషి మనువు (ప్రవక్త నూహ్) సంతానం అని ప్రకటించటం. 4) హిందువులకు చెందిన ఏయే వంశాల నుండి ఏయే వర్గాల నుండి ఇస్లాంలోకి వచ్చారో ఆయా వర్గాలను కనిపెట్టి, వారితో తమ బంధుత్వ సంబంధాలను కలుపుకోవటానికి ప్రయత్నించటం.
భారత దేశ ముస్లిములు ప్రస్తావిత ఇస్లాం ప్రబోధనలను కనుక అనుసరించి; ఆ విధంగా ఆచరిస్తే, వారీ సమస్యల నుండి బయట పడటమే కాక, భారత దేశానికి గొప్ప సేవ చేసిన వారవుతారు. దీని కారణంగా మన భారత్ United States of India గా మారి మహా భారత్ అంటే Super Power అవుతుంది. ‘కలసి ఉంటే కలదు సుఖము’ అన్న నానుడీ నెరవేరుతుంది. ఇలాంటి కోరిక మీకూ ఉందా? అయితే ఆ దిశగా మీరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ... సెలవు.
జై హింద్!
ముష్తాఖ్ అహ్మద్ అభిలాష్
96664 88877
theancientislam@gmail.com