Posted by Sakshyam Magazine on Saturday, February 13, 2016
సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును. – జెకర్య 2:10
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. – మలాకీ 4:5,6
పై వాక్యాలలో దేవుడైన యెహోవా “నేను వచ్చి” “మీ మధ్య నివాసం చేతును” అన్నాడు. కాబట్టి యెహోవాయే యేసుగా వచ్చాడన్నది నేటి కొందరు సువార్తీకుల వాదన. ఇలాంటి వాదనలు చేసేవారికి యెహోవా ప్రవక్తలను పంపటాన్నే అలంకారికంగా తాను రావటంగా అనేక చోట్ల చెప్పుకున్నాడన్న విషయం తెలియదు అని చెప్పవచ్చు! అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది వాక్యం గమనించగలరు.
వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్య నున్నాడు. –ద్వితీ 7:21
పై వాక్యంలో యెహోవా “నీ మధ్య నున్నాడు” అని ఇస్రాయేలీయులతో చెబుతున్నాడు. వాస్తవానికి ఇస్రాయేలీయుల మధ్య ఉన్నది యెహోవా కాదు కానీ మోషే! గమనార్హమైన విషయం ఏమిటంటే మోషే చేసిన సూచక క్రియలు సైతం తానే వచ్చి చేసినట్టు ఈ క్రింది వాక్యంలో యెహోవా ప్రకటించుకోవటం.
యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి,యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా... సంఖ్యాకాండము 14:11,12
పై వాక్యంలో యెహోవా, మోషే ద్వారా చేయించిన సూచక్రియలను తానే వచ్చి చేసుకున్నట్టు చెప్పుకోవటం గమనార్హం. అంటే కాదు ప్రవక్త సమూయేలును విసర్జించటాన్ని తనను విసర్జించటంగా యెహోవా ఈ క్రింది విధంగా ప్రకటించుకోవటం గమనార్హం.
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము;వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు. – 1 సమూయేలు 8:7
దేవుడైన యెహోవా, యోహాను రూపంలో దర్శనమిచ్చాడా?
మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను. - లూకా 1:67-69
ప్రవక్త అయిన జెకార్య వృధ్యాప్యంలో ఉండగా యోహాను పుట్టినప్పుడు ప్రవచిస్తున్నవే పై వాక్యాలు. అందులో జెకార్య “ఇస్రాయేలూ దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి” అంటున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడైన యెహోవా, యోహాను రూపంలో దర్శనమిచ్చాడని అర్ధం చేసుకోవచ్చా? ఇలాంటిదే మరొక వాక్యం గమనించగలరు.
అందరు భయాక్రాంతులైమనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి. – లూకా 7:16
పై వాక్యంలో సైతం ఆ దేవుడైన యెహోవా, యేసును ప్రవక్తగా పంపటాన్ని బట్టి దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించియున్నాడని చెబుతున్నారు! అంటే దేవుడు, యేసు రూపంలో దర్శనమిచ్చాడని అర్ధమా? కాదు కదా!
ఈ విధంగా బైబిల్లో అనేక చోట్ల యెహోవా తరఫున ప్రవక్త రావటాన్నే ప్రత్యక్షంగా యెహోవా రావటంగా అలంకారికంగా వ్రాయటం జరిగింది. అలాగే జెకార్య 2:10 మరియు మలాకీ 4:5,6 వాక్యాలలో “నేను వచ్చి” “మీ మధ్య నివాసం చేతును” అని యెహోవా చెబుతున్న దానికి అర్ధం- యెహోవా మానవునిగా ఈ లోకంలో పుడతాడని కాదు! కానీ యెహోవా తన తరఫున ప్రవక్తను పంపటాన్ని అలంకారికంగా “నేను వచ్చి” “మీ మధ్య నివాసం చేతును” అంటున్నాడు.
దేవుని కారుణ్యం రావటం సైతం దేవుడు రావటమే!
దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. – యాకోబు 4:8
పై వాక్యాన్ని బట్టి ఎవరైతే దేవుని వద్దకు వస్తారో అంటే దేవుని వైపునకు మరలుతారో వారి యొద్దకు ‘దేవుడు వచ్చును’ అంటే ఆయన కారుణ్యం వారి వద్దకు వస్తుంది. ఈ వాక్యాన్ని అక్షరార్ధంలో తీసుకుంటే ప్రతీ ఒక్కరి వద్దకూ దేవుడు వస్తుంటాడని చెప్పాల్సి ఉంటుంది.
ఇక యేసు సైతం యెహోవాయే తన రూపంలో అవతరించాడని చెప్పటంలేదు. కానీ ఏమంటున్నారో గమనించగలరు.
జీవముగల తండ్రి నన్ను పంపెను.. –యోహాను 6:57
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. – యోహాను 16:28
నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. –యోహాను 8:42
తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. –యోహాను 20:21