ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అను గ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముందును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్ట బడును. – యెషయా 9:6
పై లేఖనాన్ని చూపి నేటి సువార్తికుల వాదన ఏమిటంటే- “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి” అంటే ఎవరో కాదు అది యేసే! కాబట్టి యేసే దేవుడన్నది!!” ఇలాంటి ప్రచారాలు చేసేవారు ముందు గమనించాల్సింది- నాడు యేసును తిరస్కరించిన యూదుల ముందు ఆయనను ఒప్పించటానికి ఎన్నో లేఖనాలను ఎత్తిచూపి, యేసు వాస్తవికతను గూర్చి యూదులతో వాదించిన ఆదిమ అపోస్తలులు గానీ, పౌలు గానీ ఏనాడైనా, ఎక్కడైనా,ఎప్పుడైనా యెషయా 9:6 లేఖనం చూపి యేసే దేవుడని ఎందుకు వాదించలేదు? అన్నది. ఈ సందర్భంలో పౌలు అనేక లేఖనాలను ఎత్తి చూపుతూ నాడు యూదులతో ఏమని వాదించేవాడో ఈ క్రింది గమనించగలరు.
నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖన ములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు,వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను. –అ.పో.కా 17:3
యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. –అ.పో.కా 18:28
పై వాక్యాలలో “లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు” “లేఖనముల ద్వారా దుష్టాంత పరచి” అన్న వాక్య భాగాలను బట్టి నాడు పౌలు యేసు వాస్తవికతను గూర్చి ఒప్పించటానికి యూదులతో సాధారణ చర్చ చేయకుండా అనేక లేఖనాలను ఆధారంగా తీసుకుని మూడు విశ్రాంతి దినాలు అంటే మూడేసి వారాల వరకు తర్కిస్తూ ఉండేవాడని తేటతెల్లమవుతుంది. అయితే అనేక లేఖనాలను చూపి యూదులతో వాదించిన పౌలు, యేసును గూర్చి ఏమని వాదించేవాడు? యేసు దేవుడనా? కాదు! కానీ యేసే “క్రీస్తు (మెస్సీయ)” అని వాదించాడు.
నాడు యేసే క్రీస్తని ఒప్పించటానికి అనేక లేఖనాలను చూపి యూదులతో వాదించిన పౌలుకు ఈనాడు సువార్తీకులకు కనపడుతున్న యెషయ 9:6 లేఖనం ఏనాడూ కనపడి ఉండదా? నిజంగా యెషయా 9:6 లేఖనం యేసును గురించే ప్రవచింపబడి ఉంటే ఈ లేఖనాన్ని ఎత్తిచూతి పౌలు ఏనాడూ యేసే దేవుడని ఎందుకు ప్రకటించలేదు? నిజంగా యెషయా 9:6 లేఖనం యేసుకు చెందిందే అయితే ఈ లేఖనాన్ని చూపి నేటి సువార్తికులు యేసే దేవుడని ప్రకటిస్తున్న మాదిరిగా నాడు ఆదిమ అపోస్తలులు యేసే దేవుడని ఎందుకు ప్రచారం చేయలేదు?
అంటే ఏనాడూ పాతనిబంధనను పౌలు గానీ, ఆదిమ అపోస్తలులు గానీ సరిగ్గా చదవలేదని అర్థమా? పోనీ యెషయా 9:6 లేఖనం వారు ఏనాడూ చదివి ఉండరా? కచ్చితంగా చదివే ఉంటారు కదా! అయితే ఈ లేఖనాన్ని చదివి, యేసు దేవుడని వారికి ఎందుకు అనిపించలేదు? వారికి అనిపించనిది నేటి సువార్తీకులకు అనిపిస్తుందంటే, వీరికి అనిపిస్తుంది తప్పు అని అర్ధమవుతుంది.
కాబట్టి నిజంగా యేషయా 9:6 లేఖనం ప్రకారం యేసును దేవునిగా ప్రకటించటంలో తప్పు లేదనుకుంటే ఆ పనిని నాటి ఆదిమ అపోస్తలులు కచ్చితంగా చేసి ఉండాలి. మరి ఆ పని వారెండుకు చేయలేదు అన్నది విజ్ఞత కలిగిన ప్రతీ ఒక్కరూ ఆలోచించగలరు.
యేసు బలవంతుడైన దేవుడా?
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; -యోహాను 5:19
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. –యోహాను 5:30
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను. –యోహాను 12:49-50
నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. –యోహాను 8:42
నిజంగా యేసు యెషయా 9:6 లేఖనం ప్రకారం “బలవంతుడైన దేవుడే” అయి ఉంటే ఒక “బలవంతుడైన దేవుడు “నా అంతట నేను ఏమి చేయలేను” “నా అంతట నేను ఏమీ మాటలాడలేను” అంటూ బలహీనమైన స్థితిని కలిగి ఉంటాడా?
కనీసం యేసు పరలోకంలోనైనా బలవంతుడైన దేవుడా?
పోని యేసు భూలోకంలో మానవునిగా అలా మాటలాడి ఉంటారు! అనుకుందాం. మరి పరలోకంలో అయినా బలవంతుడైన దేవుని స్థానంలో ఉన్నారా? అన్నది గమనిద్దాం.
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. –మత్తయి 20:20-23
పై వాక్యాన్ని బట్టి కనీసం యేసు తన కుడి, యెడమ ప్రక్కన కూర్చొబెట్టుకునే అధికారాన్ని సైతం కలిగి లేరని అర్ధమవుతుంది. పైగా అది సైతం తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారమే లభిస్తుందని చెబుతున్నారు.
యేసు బలవంతుడైన దేవుడే అయితే యెహోవాకు విజ్ఞాపన చేసుకోవటం దేనికి?
ఈయన (యేసు) తనద్వారా దేవుని (యెహోవా) యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు . –హెబ్రీ 7:25
యెషయ 9:6 లేఖనం నిజంగా యేసుకే చెందినదైతే, ఆ లేఖనం ప్రకారం యేసు నిజంగా బలవంతుడైన దేవుడే అయితే ఒక బలవంతుడైన దేవుడనేవాడు విశ్వాసుల కొరకు యెహోవా దేవుని వద్ద విజ్ఞాపన చేసుకోవటంలో అర్ధం ఉందా?
ఇంతకు అదే యెషయా గ్రంధం ప్రకారం యేసు విషయంలో నెరవేరిన లేఖనం ఏమిటి?
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు ... –యెషయ 42:1
పై లేఖనం మత్తయి 12:16-17 వాక్యాలలో నెరవేరినట్లు చూడగలం.
ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా- ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ... –మత్తయి 12:17,18
ఆదిమ అపోస్తలులు యేసును దేవుని సేవకునిగానే గుర్తించారు!
అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు... -అ.పో.కా 3:13
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వ దించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. -అ.పో.కా 3:23
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. -అ.పో.కా 3:26
ఈ విధంగా ఆదిమ అపోస్తలులు యేసును దేవుని సేవకునిగానే గుర్తించారు తప్పితే... యేసును దేవుడని ఏనాడూ భ్రమపడలేదు!
యేసును గురించి నెరవేరిన మరొక లేఖనం!
మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసి యున్నాడు,ఆయన మాట తప్పనివాడు. –కీర్తనలు 110:4
పై లేఖనం హెబ్రీ 7:21 వాక్యంలో నెరవేరినట్లు చూడగలం.
వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను... –హెబ్రీ 7:21
మనం గమనించిన ముందు లేఖనం ప్రకారం యేసు దేవుని సేవకుడై యున్నాడని తెలుసుకున్నాం. ఈ విధంగా యేసు వాస్తవికతను గురించి నేరవేరిన పై లేఖనం ప్రకారం యేసు “బలవంతుడైన దేవుడై లేరు!” కానీ “దేవుని వద్ద విశ్వాసుల కొరకు విజ్ఞాపనము చేసుకునే నిరంతర యాజకుడై” ఉన్నారని తేటతెల్లమ వుతుంది.