Posted by Sakshyam Magazine on Friday, August 18, 2017
మీరు ప్రాథమికముగా గుర్తించవలసిన విషయం:
గీతా-బైబిల్-ఖురాన్ వంటి ధర్మశాస్త్రాలు ప్రతిపాదిస్తున్న ధర్మమునకు మరియు ఆ గ్రంధాలకు చెందిన నేటి పండితులు ప్రచారం చేస్తున్న ధర్మమునకు ఏ విధమైన సంబంధమూ లేదు! అన్నది.
దానికి ఇవే ఆధారాలు:
ధర్మశాస్త్రాలు ప్రకారం - మనిషి పాల్పడే "దురాచరణ"ను బట్టి "దేవుని శాపం" కలుగుతుంది. మనిషి చేసే "సదాచరణ"ను బట్టి "దేవుని అనుగ్రహం" లభిస్తుంది. ఈ క్రింది గమనించగలరు.
గీతాశాస్త్రం
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్..."
సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశ మొనర్చుటకును... -4:8
బైబిల్ శాస్త్రం
వీరు (అనీతిమంతులు) నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. -మత్తయి 25:46
ఖురాన్ శాస్త్రం
నిశ్చయంగా సజ్జనులు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. -82:13,14
ఈ పై వాక్యాల ప్రకారం- హిందూ-హిందూయేతరులు, క్రైస్తవులు-క్రైస్తవేతరులు మరియు ముస్లింలు-ముస్లిమేతరులు అన్న "మత వర్గాల" పరంగా కాక, "శిష్టులు, నీతిమంతులు, సజ్జనులు' అనే "అనుకూల గుణాల" వారీగా మరియు "దుష్టులు, అనీతిమంతులు, దుర్జనులు" అనే "ప్రతికూల గుణాలు"వారీగా ప్రజలు వర్గీకరించబడుతున్నారు. ఈ వర్గీకరణ పూర్తిగా హేతుబద్ధమైనది, అత్యంత న్యాయమైనదీనూ.
కానీ, నేటి "హిందూ-క్రైస్తవ-ముస్లిం"వర్గాలకు చెందిన అధికశాతం పండితుల ద్వారా - "తమ "మతవర్గానికి చెందిన వారికే దేవుని "అనుగ్రహం" ఉంటుంది. ఎదుటి "మతవర్గానికి చెందిన వారికి దేవుని "శాపం" కలుగుతుంది. అనే ధర్మ విరుద్ధ ప్రచారం పరస్పర మతవర్గాలలో జరుగుతుంది. ఈ వర్గీకరణ పూర్తిగా హేతువిరుద్ధమైనది. అత్యంత అన్యాయమైనదీనూ. ఎందుకంటే - ఏ వర్గంలో అయినా పూర్తిగా మంచివాళ్ళూ ఉండరు. అలాగే పూర్తిగా చెడ్డవాళ్ళూ ఉండరు.
చూసారు కదా! "శాస్త్రాల ప్రబోధనల"కు మరియు "శాస్త్రుల ప్రచారాల"కూ మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో! ఇది ఒక మచ్చుతునక! వీరి పోకడ ప్రతి విషయంలోనూ అలాగే ఉంది.
వివిధ మత వర్గాలకు చెందిన "అశాస్త్రీయ పోకడలు" ఆ యా మత వర్గాలకు చెందిన వంచక పండితుల "కల్పన"లే తప్ప వారి ధర్మశాస్త్రాల "ప్రబోధన"లు కావన్న విషయాన్ని గుర్తించాలన్నదే హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక -నాస్తిక మిత్రులకు మా మనవి!