Posted by Sakshyam Magazine on Friday, October 24, 2014
వేరొక ఆదరణకర్త
Part- 1
అబ్రాహాము ఇద్దరు కుమారులకూ దేవుని రెండు సమాన వాగ్దానములు - రెండు సమాన నిబంధనలు!
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని (బలి) ఇయ్యవెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి యిసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీన పరచుకొందురు. మరియు నీవు నా మాట విని నందున భూలోకములోజనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి యున్నానని యెహోవా సెలవిచ్చెననెను.ఆదికాండము 22:16-18
దేవుని ఆజ్ఞమేరకు అబ్రాహాము తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి సిద్ధపడినందుకు ప్రతిఫలంగా అతని సంతానం నుండి సకల విశ్వానికి ఒక ప్రవక్త అనుగ్రహింపబడనున్నాడని దేవుడు, అబ్రాహాముకు చేసిన గొప్ప వాగ్దానమే పై వాక్యం.అయితే దేవుడైన యెహోవా అబ్రాహాముతో నీ సంతానమును "ఆకాశ నక్షత్రమువలెను సముద్ర తీరమందలి యిసుక వలెను నిశ్చయముగా విస్తరింపజేస్తానని" చేసిన వాగ్దానానికి పూర్తి అర్హుడు కేవలం ఒక్క ఇస్సాకు మాత్రమే! ఇష్మాయేలుకు దేవుని తరుపున ఏ వాగ్దానం గాని,ఆశీర్వాదంగాని లేదన్నది అనేకమంది యూద-క్రైస్తవ పండితుల వాదన!కానీ వారి వాదనకు భిన్నంగా దేవుడైన యెహోవా, అబ్రాహాము ఇద్దరు కుమారులైన ఇష్మాయేలు మరియు ఇస్సాకులు పుట్టక ముందే వారిరువురినీ "గొప్ప జనములు"గా విస్తరింపజేస్తానన్న రెండు వాగ్దానాలు, రెండు నిబంధనలు వారిరువురి విషయంలోనూ సమానంగా చేస్తున్న వైనం అత్యంత గమనార్హం.
మొదటి నిబంధన :ఇష్మాయేలు పుట్టటానికి ముందే హాగరుతో!
మరియు యెహోవా దూత- నీ సంతానమును (ఇష్మాయేలును) నిశ్చయముగా విస్తరింప జేసెదను;అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో (హాగరుతో) చెప్పెను. మరియు యెహోవా దూత- ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. ఆదికాండం 16:10-12
రెండవ నిబంధన: ఇస్సాకు పుట్టటానికి ముందే శారాతో!
మరియు దేవుడు -నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు;ఏలయనగా ఆమె పేరు శారా.నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను;నేనామెను ఆశీర్వదించెదను;ఆమె జనములకు తల్లియై యుండును;జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. ఆదికాండం 17:15-16
ఈ విధంగా దేవుడైన యెహోవా,అబ్రాహాము ఇద్దరు భార్యలైన హాగరు మరియు శారాలకు వారి సంతానమైన ఇష్మాయేలు మరియు ఇస్సాకులు పుట్టక ముందే వారిరువురినీ "గొప్ప జనములు"గా చేస్తానని రెండు వాగ్దానాలు,రెండు సమాన నిబంధనలు చేశాడు.
అబ్రాహాము ఇద్దరు భార్యలూ (ఇష్మాయేలు తల్లి హాగరు -ఇస్సాకు తల్లి శారా) రెండు నిబంధనలై ఉన్నారు!
దాసి(హాగరు) వలన ఒకడును (ఇష్మాయేలు) స్వతంత్రురాలి(శారా)వలన ఒకడును (ఇస్సాకు)ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను,స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను.ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి.ఈ స్త్రీలు రెండు నిబంధనలైయున్నారు.వాటిలో ఒకటి సీనాయి కొండ సంబధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును;ఇది హాగరు.ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. గలతీ 4:22-25
పౌలు చేస్తున్న పై ప్రసంగంలో గమనార్హమైన విషయాలు:
1.దాసి (హాగరు)వలన ఒకడు (ఇష్మాయేలు),స్వతంత్రురాలి (శారా) వలన ఒకడు (ఇస్సాకు)"ఇద్దరు కుమారులు" అబ్రాహాము కలిగి ఉన్నాడన్నది.
2.ఇష్మాయేలు తల్లి హాగరు మరియు ఇస్సాకు తల్లి శారా ఇద్దరూ "రెండు నిబంధనలు" అయ్యి ఉన్నారన్నది.అంటే - వారిరువురి సంతానమైన ఇష్మాయేలు మరియు ఇస్సాకులు "గొప్ప జనములు"గా చేయబడతారన్న "రెండు సమాన వాగ్దానములు" "రెండు సమాన నిబంధనలు" దేవునిచే పొంది ఉన్న స్త్రీలని అర్ధం.
దీని ప్రకారం భవిష్యత్తులో వారిరువురి ద్వారా కలుగబోయే రెండు శాఖలలోనూ ప్రవక్త పదవి మరియు ధర్మశాస్త్రాలు అనుగ్రహింపబడి, వారిరువురి శాఖలూ
"రెండు గొప్ప జనములు"గా చేయబడాల్సి ఉంది.
ఈ విధంగా సర్వ సృష్టికర్త అయిన యెహోవా, అబ్రాహాము ఇద్దరు కుమారులైన ఇష్మాయేలు, ఇస్సాకులకు "
గొప్ప జనము"గా చేస్తానన్న రెండు వాగ్దానాల ప్రకారం ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలీయులను ముందుగా ఎన్నుకున్నాడు.తన ఆజ్ఞల ప్రకారం ప్రజలను పాలించడం కొరకు వారికి ప్రపంచ ప్రజలపై ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ప్రసాదించాడు.ఇంకా మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు.దానిలోని ఆజ్ఞల ప్రకారమే ఇశ్రాయేలీయులను సంస్కరించటానికి అనేక మంది ప్రవక్తలను పంపాడు.అదే క్రమంలో చివరిగా యేసును పంపాడు.అయితే ఇష్మాయేలు సైతం "
గొప్ప జనము"గా చేయబడతాడన్న యెహోవా వాగ్దానం ప్రకారం అతని సంతానం నుండి రావలసి యున్న చివరి ప్రవక్త ఎవరు?అతని ద్వారా దేవుడు మరొక ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వనున్నాడు? అన్న విషయాలను రాబోయే అంశాలలో గమనిద్దాం.