Posted by Sakshyam Magazine on Monday, January 4, 2016
సర్వశక్తిగల
దేవుని పేరుతో...
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను
నిలువదు. -సామెతలు:21:30
పరిశుద్ధ బైబిలు ప్రబోధనల
ప్రకారం:
యేసు సిలువపై మరణించ లేదు!-5
(బైబిలు ప్రకారం- మానవుడు జన్మతః పాపి కాడు!)
గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
యూదులు ఆది నుండీ అత్యంత కఠినాత్ములని, ఘోరమైన హంతక స్వభావులని ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ వాక్యాల ద్వారా తెలుసుకున్నాము. ఇంకా, గతంలో ఎందరో పరిశుద్ధ ప్రవక్తలను సిలువ వేసి హత్య చేసినట్లే; యేసును కూడా సిలువ వేసి హత్యచేయ ప్రయత్నించి విఫలమైనప్పటికీ, యేసును హత్య చేసిన నేరానికి గురైపోయారని తెలుసుకున్నాము. అలాగే దాని కారణంగా తమ పట్ల నాటి క్రైస్తవులలో ఎగసిన ఆగ్రహ ఆవేశాల నుండి తప్పించుకోవటానికే- ‘పరిశుద్ధ బైబిలు గ్రంధము’లో లేని ‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘రక్తం ద్వారా మాత్రమే పాపపరిహారం’ అనే సిద్ధాంతాలను కల్పించి, ప్రచారం చేసి క్రైస్తవులను మాయ చేశారని కూడా తెలుసుకున్నాము. ఇక, ‘మానవుడు జన్మతః పాపి’ అనే ‘సిద్ధాంతము’ను ‘పరిశుద్ధ బైబిలు గ్రంధము’ ఎంత దారుణంగా ఖండించి పడేస్తుందో ఈ వ్యాసంలో చూడగలరు.
‘జన్మ పాపము’ను ఖండిస్తున్న బైబిలు!
‘
మానవుడు జన్మతః పాపి’
అనే సిద్ధాంత వాదులు ఆదాము ఆజ్ఞ అతిక్రమమును దానికి మూల కారణంగా చెబుతారు. అతడు చేసిన నేరానికి అతడే శిక్షార్హుడు కావటం న్యాయమే! కాని, ఆ నేరంతో ఏమాత్రం సంబంధం లేని అతని సంతానాన్ని కూడా ఆ నేరంలో తరతరాలూగా భాగస్తులను చేస్తూ ఉండటాన్ని ఏ నాగరిక న్యాయ శాస్త్రమూ అంగీకరించదు! అటువంటప్పుడు, బైబిలు వంటి ఒక గొప్ప ధర్మశాస్త్రం ఎందుకు అంగీకరిస్తుంది!? ‘మానవుడు జన్మతః పాపి’ అన్న ‘సిద్ధాంతము’ను తుత్తునియులు చేస్తున్న ఈ క్రింది పరిశుద్ధ వాక్యాలను జాగ్రత్తగా గమనించగలరు.
18. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును. 19. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రదుకును. 20. పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. -యెహెజ్కేలు 18: 18-20
ప్రతి వాడు తన దోషముచేతనే మృతి నొందును; ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పళ్లే పులియును.-ఇర్మీయా 31:30
అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని మోషే గ్రంథ మందలి ధర్మశాస్త్రము నందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. -2 వ దినవృత్తాంతాలు 25:4
‘తండ్రి చేసిన పాపం’లో ‘కుమారుని’కి మరియు ‘కుమారుడు చేసిన పాపం’లో ‘తండ్రి’కి ఏమాతం భాగస్వామ్యం ఉండదని, ఉండకూడదని సర్వశక్తిగల దేవుడే స్వయంగా ప్రకటిస్తున్న వైనం పైన పేర్కొన్న పాత నిబంధనకు చెందిన పరిశుద్ధ వాక్యాలలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక, ఈ ‘జన్మ పాపము’ను గురించి యేసు ఏమంటున్నారో తదుపరి అంశాలలో గమనించగలరు.
‘జన్మ పాపము’ను ఖండిస్తున్న యేసు!
1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. 2. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా 3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.-యోహాను 9:1
సంతానం శారీరక వైకల్యంతో పుట్టటంలో వారి తలిదండ్రుల పాపంతో ఎలాంటి ప్రమేయమూ ఉండదని యేసు శిష్యులు మరియు యేసు జరిపిన పై సంభాషణ ద్వారా సుస్పష్టం అవుతుంది.
‘జన్మ పాపము’ కలిగిన పిల్లల వలే మారితే నిత్య రాజ్యానికి వెళతారా!?
1. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, 2. ఆయన యొక చిన్నబిడ్డను తన యొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను 3. మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. -మత్తయి 18:1-3
ఒకవేళ పిల్లలు, పుట్టుకతోనే పాపులైతే, ఆ పాపిష్టి వాళ్లుగా మరితేనేగాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని యేసు తన శిష్యులతో ఎందుకు చెబుతారు? దీనిని బట్టి యేసు ప్రకారం- ‘జన్మ పాపము’ లేనట్లే కదా! మానవులందరూ ‘జన్మ పాపము’ను కలిగి ఉంటే- తను కొందరి వద్దకే వచ్చానని యేసు, ఎందుకంటున్నారు?
నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చెబుతున్నట్లే సర్వమానవులూ ‘జన్మ పాపము’ కలిగి ఉంటే, యేసు ఈ క్రింది విధంగా ఎందుకు చెబుతారు?
5. యేసు ఆ పండ్రెండు మందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల [అనగా క్రైస్తవేతరుల] దారిలోనికి వెళ్లకుడి, సమరయులయే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని 6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. -మత్తయి 10:5, 6
16. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా 17. యేసు ఆ మాట విని రోగులకే [అనగా పాపులకే] గాని ఆరోగ్యముగల వారికి [అనగా పాపరహితులకు] వైద్యుడక్కర లేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను [అనగా పాపరహితులను] పిలువరాలేదని వారితో చెప్పెను. -మార్క్ 2: 16, 17
12. ఆయన [అనగా యేసు] ఆ మాట విని రోగులకే [అనగా పాపులకే] గాని ఆరోగ్యము గలవారికి [అనగా పాపరహితులకు] వైద్యుడక్కరలేదు గదా. 13. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను [అనగా పాపరహితులను] పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను -మత్తయి 9: 12, 13
ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. -1 వ కొరంథీయులకు 3:8
పై వాక్యాల ప్రకారం- అటు యేసు దృష్టిలో గాని ఇటు పౌలు దృష్టిలో గాని సర్వమానవులూ ‘జన్మ పాపము’ కలిగి లేరని అర్ధమౌతుంది! అందుకే యేసు ఒక్క నశించిపోయిన ఇశ్రాయేలీయుల వద్దకు తప్ప ఇతరులెవ్వరి వద్దకూ వెళ్లరాదని ఆయన తన శిష్యులను ఖండితముగా ఆదేశిస్తున్నారు. సర్వమానవులూ ‘జన్మ పాపము’ కలిగి ఉన్నారని అధిక శాతం క్రైస్తవ బోధకులు చెబుతున్నదే నిజమైతే, యేసు కూడా తన శిష్యులతో కొందరి దగ్గరకే కాదు, అందరి దగ్గరకు వెళ్లండి అని చెప్పేవారు కదా! ఇంకా ఆయన కొందరిని ‘పాపులు’ అని మరి కొందరిని ‘నీతిమంతులు’ అనగా ‘పాపరహితులు’ అని ఎందుకు వర్గీకరిస్తారు?
ఈ విధంగా ‘మానవుడు జన్మతః పాపి’ అనే సిద్ధాంతాన్ని అటు పాత నిబంధన మరియు ఇటు క్రొత్త నిబంధన కూడా ఖండించి పడేస్తున్న వైనాన్ని పై అంశాలలో చూచారు కదా! దీనిని బట్టి- ఏనాడో ఆదాము చేసిన పాపము అతని కడుపున పుట్టినందుకు అతని ఆ పాపము సర్వమానవులకూ జన్మతః వారసత్వంగా వస్తుందని క్రైస్తవ బోధకులు చెప్పేది ఒక కట్టుకథ అని తేలిపోయింది కదా!
క్రైస్తవ బోధకులారా! ‘మానవుడు జన్మతః పాపి’ అనేది ‘అన్యుల సిద్ధాంతము’ అని బైబిలు చెబుతున్నది మీకు కని పించలేదా!?
క్రైస్తవేతరులను అన్యులు అని, పాపులని, సాతాను సంబంధీకులని ఎంతో హీనంగా మరెంతో నీచంగా చూచే మీకు, వారు కలిగి ఉన్న తప్పుడు విశ్వాసాన్నే తామూ కలిగి ఉన్నామనే స్ఫృహ కూడా కలగటం లేదా!? ‘విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడ!?’ అని గంతులేసి, గొంతుచిoచుకొని ప్రసంగించే బైబిలు పండితులకు ఈ క్రింది వాక్యం ఎప్పుడూ కనిపించలేదా!?
1. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు? 3. నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4. మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. -యెహెజ్కేలు 18:1-4
పై వాక్యాల ప్రకారం- ‘తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులియును’ అనగా ‘తండ్రి పాపంచేస్తే కుమారునికి కూడా శిక్షపడుతుంది!’ అన్న సామెత ‘ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు’ అంటే- ‘అన్యులు మాత్రమే పలుకుతారు!’ కాని, 'విశ్వాసులు పలుకరు!'. ఇక, ‘ఇదే ప్రభువైన యెహోవా వాక్కు’ అనగా- ఇదే, దేవ దేవుని శాసనము! ఈ శాసనానికి పూర్తి విరుద్ధంగా ‘తండ్రి పాపంచేస్తే కుమారునికి కూడా శిక్షపడుతుంది!’ అన్న అన్యుల తప్పుడు సిద్ధాంతాన్ని అధిక శాతం క్రైస్తవ బోధకులు విశ్వసిస్తూ, ప్రచారం చేస్తున్నారంటే- వారు ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ జ్ఞానానికి ఎంత దూరంగా పోయారో అర్థమౌతుంది కదా!?
గమనిక: తండ్రి చేసిన నేరానికి కుమారుడు కూడా శిక్షార్హుడు అవుతాడన్న విశ్వాసాన్ని అంగీకరించే వారికి- ‘మీ తండ్రులు చేసిన నేరాలకు మీకు కూడా శిక్షలు విధిస్తాము!’ అంటే అంగీకరిస్తారా!? లేదే! ‘పరిమిత జ్ఞానము’ మరియు ‘పరిమిత న్యాయ దృష్టి’ కలిగి ఉన్న మీకే ఈ విధానం అంగీకార యోగ్యం కానప్పుడు, ‘అపరిమిత జ్ఞానము’ మరియు ‘అపరిమిత న్యాయ దృష్టి’ కలిగి ఉన్న ఆ దేవాది దేవునికి ఎలా ఆమోద యోగ్యం అవుతుంది మిత్రులారా! కాస్త ప్రశాంతంగా ఆలోచించండి!!
ఈ విధంగా క్రైస్తవ సమాజం ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ బోధలకు విరుద్ధమైన లేక అది ఖండిస్తున్న తప్పుడు (అన్య) విశ్వాసాలను అనుసరిస్తున్న కారణంగానే ఇతర మత వర్గాలకంటే అధికంగా నైతిక పతనానికి గురైపోయిందని అర్థమౌతుంది.
tmcnewstmc@gmail.comవీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.