సర్వశక్తిగల దేవుని పేరుతో...
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
-సామెతలు 21:30
పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:
యేసు సిలువపై మరణించ లేదు!-6
(బైబిలు దృష్టిలో బలులకు, రక్తానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు!?)
గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
గత వ్యాసం ద్వారా అటు పాత నిబంధన ఇటు కొత్త నిబంధన ప్రకారం- మానవుడు జన్మతః పాపి కాడని తెలుసుకున్నాము. అంతే కాక, ఆ సిద్ధాంతం (యెహెజ్కేలు 18:1-4) ప్రకారం- అన్యులకు అనగా అవిశ్వాసులకు చెందినదని కూడా తెలుసుకున్నాము. అంటే తమపై ఉన్న యేసు హత్యానేరాన్నుండి తప్పించుకోవటానికి ఈ అన్య విశ్వాసాన్ని యూదులు కుట్రపూరితంగా ప్రచారం చేయటం వలన క్రైస్తవులలో వచ్చిందే తప్ప ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ ప్రబోధనలతో దానికి ఎలాంటి సంబంధమూ లేదు. అలాగే ఆ యూదులు- ‘మానవుడు జన్మతః పాపి’ కనుక ‘ఆ పాపం పోవాలంటే రక్తం చిందించటం ఒక్కటే ఏకైక పరిష్కారం’ అనే రెండవ అన్యుల సిద్ధాంతాన్ని పరిశుద్ధ క్రైస్తవ్యంలో ప్రవేశ పెట్టారు. దానిని సమర్ధించుకోవటానికి పాత నిబంధన అంతా రక్తం! రక్తం! రక్తం! రక్తం! రక్తమే రక్తం!!! అనే ఒక అతి దారుణమైన ప్రచారాన్ని క్రైస్తవులలో సాగించి, అత్యంత కరుణామూర్తి అయిన యెహోవా దేవుని రక్తం తాగే రాక్షసుడిగా చిత్రించారు.
దానికి వారు అల్లిన కట్టు కథ ఏమిటంటే- దేవ దేవుడు పాత నిబంధన కాలంలో జంతు బలుల ద్వారా మనుషుల పాపాలను హరించటానికి ప్రయత్నం చేసి, చేసి అలసిపోయి, పాపం ఆ ప్రొజెక్ట్ లో దారుణంగా విఫలమైపోయాడు! ఆ తరువాత మరొక క్రొత్త ప్రొజెక్ట్ కు ప్లాన్ చేశాడు. అదేమిటంటే- “
ఈ బండ మానవుల మొండి పాపాలకు ఏకైక పరష్కారంగా తానే నరవతారం ఎత్తి, వారి చేతికి చిక్కి, వారిచేత నానా నిందారోపణలకు, నానా చిత్ర హింసలకు గురై ఇంకా వారి చేత తిట్టించుకొని, కొట్టించుకొని, ముఖం మీద ఉమ్మిలు వేయించుకొని, ముళ్ళ కిరీటం పెట్టిచుకొని అతి అదారుణంగా అతి హృదయ విదారకంగా తన ‘పరిశుద్ధ రక్తం’ చిందించి, దిక్కులేని చావు చావాలి” అన్నది!! ఈ ప్రొజెక్ట్ ను నమ్మాలంటే అసలు పాత నిబంధన గ్రంధం'లో దేవుడు ‘బలులకు, రక్తానికి అత్యంత ప్రాధాన్యత’ను ఇచ్చి ఉండాలి. అదే కనుక లేకపోతే- ఈ ప్రొజెక్ట్ ఒక కట్టు కథ మాత్రమేనని తేలిపోతుంది!
యెహోవా దేవుడు బలులను కోరుతున్నాడా?
లేక వాటిని అసహ్యించుకుంటున్నాడా?
అధిక శాతం క్రైస్తవ బోధకుల ప్రసంగాలు వింటుంటే, పాత నిబంధన కాలంలో- ప్రజలు, ఇటు పాపం చేస్తూ అటు బలులు అర్పించేస్తూ, ఇటు పాపం చేస్తూ అటు బలులు అర్పించేస్తూ, ఇటు పాపం చేస్తూ అటు బలులు అర్పించేస్తూ, ఏదో భయంకరమైన రక్తదాహంతో ఊన్న మహా రాక్షసుడిని రక్తం ధారబోస్తూ సంతృప్తి పరుస్తూ ఉండే వారన్నట్లు అనిపిస్తుంది! యెహోవా దేవుడు బలులను కోరుతున్నాడా? బలులను అసహ్యించుకుంటున్నాడా? అన్న ప్రశ్నలకు ‘పరిశుద్ధ బైబిలు గ్రంధం’ ఇచ్చే సమాధానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.
అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.-1 వ సమూయేలు 15:22
బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. -కీర్తన 40:6
యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు. -యెషయా 1:11
22. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని -ఇర్మీయా 7:22
పైన పేర్కొన్న పరిశుద్ధ వాక్యములను బట్టి యెహోవా దేవుడు ‘బలులను తీవ్రంగా అసహ్యించుకుంటున్నాడ’ని సుస్పష్టంగా అర్థమౌతుంది.
మానవుడు దేవునికి ఏమైనా ఇవ్వవలసి ఉంటుందా!?
ఈ మహా విశ్వంలో ఉన్న ‘అణువు’ నుండు ‘అనంతం’ వరకు మరియు ‘అండం’ నుండి ‘బ్రహ్మాండం’ వరకు ఉన్న ప్రతి ఒక్కటి మరొక దానిపై ఆధార పడి ఉన్నది. ఏ ఒకదాని సహాయము మరొక దానికి లభించకపోయినా అది నశించి పోతుంది. ఈ విషయం- భౌతిక విజ్ఞానశాస్త్ర అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే! ఇక, మరొకని అవసరం కించిత్తు కూడా అక్కర లేని అస్తిత్వం ఒక్క సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నత దేవ దేవునిదే కదా! అటువంటప్పుడు ఆయన తన కొరకు మనిషి నుండి ఆశించేది ఏముంటుంది? అయితే ఆయన ఆశించేది ఒకటి ఉంది అది- ఈ క్రింది ఉదాహరణలో చూడవచ్చు.
సకల సంపదలు కలిగి ఉన్న ఒక తండ్రి ఉన్నాడు. అతనికి పది మంది సంతానం ఉన్నారు. వారిలో ఐదుగురు కనీస అవసరాలు తీరని పరిస్థితులలో ఉన్నారు. మిగతా ఐదుగురు కనీస అవసరాలు తీరి, మిగులు స్థితిలో ఉన్నారు. ఈ మిగులు స్థితిలో ఉన్న వారు, తండ్రిని ఉద్దేశించి- “నాన్నా! మాకు నీ దయతో లభించిన ఈ సమృద్ధిని బట్టి నీకు ఏదైనా సమర్పించుకోవాలని అనుకుంటున్నాము!" అని విన్నవించుకున్నారు. సకల సంపదలు కలిగి ఉన్న ఆ తండ్రి- “ఓరీ మూర్ఖులారా! నేను సకల సంపదలతో తులతూగుతున్నాను. నన్ను సంతోషపెట్టటానికి ఇక మీరు నాకిచ్చేది ఏముంటుంది!? అయితే, మీరు నిజంగానే నన్ను సంతోష పెట్టాలనుకుంటే- అదిగో నా కుమారులును మరియు మీ సహోదరులును అయిన వారున్నారు కదా! వారు ఇబ్బందులలో ఉన్నారు. కనుక వారిని ఇబ్బందుల నుండి కాపాడటానికి వారికి ఇవ్వండి. అప్పుడు నేను సంతోషిస్తాను!” అన్న విధంగా ఉంటుంది. ఈ క్రింది ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ వాక్యాలను గమనించగలరు.
ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును?
1. దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? 2. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? 3. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? 4. నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది;
1. న్యాయముగా నడుచుకొనుటయు, 2. కనికరమును ప్రేమించుటయు, 3. దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.-మీకా 6:6-8
ఒక భక్తుడు తన సృష్టికర్త ప్రసన్నత కొరకు పైన పేర్కొన్న నాలుగు విషయాలలో ఏవేవో పెర్కొని వాటిని ఇవ్వనా? అని ప్రశ్నిస్తే, దేవ దేవుడు- మూడు విషయాలను పేర్కొని వాటినే కదా నేను కోరుతున్నది అని సమాధానం ఇస్తున్నాడు. ఆ మూడు విషయాలూ ఒకటి- ప్రవర్తనకు సంబంధించినవి. రెండు- వాటి వలన కలిగే ప్రయోజనం తోటి మానవులకే తప్ప, దేవ దేవునికి కాదు కదా!
ఈ
క్రింది ‘పరిశుద్ధ బైబిలు గ్రంధ’ మరొక ప్రబోధనను గమనించగలరు.
3. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు 4. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. 5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా? -యెషయా 58:3-5
పై వాక్యాలలో గమనార్హమైన రెండు విషయాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి- ఒక భక్తుడు మేము ఉపవాసములు పాటిస్తున్నాము కదా నీవు మమ్మల్ని ఎందుకు అనుగ్రహించవూ? అని దేవ దేవుని ప్రశ్నిస్తున్నాడు. రెండు- మీ ఉపవాసదినమున మీరు మీ
1. వ్యాపారము చేయుదురు.
2. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
3. మీరు కలహపడుచు
4. వివాదము చేయుచు
5. అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అట్టి ఉపవాసము నాకనుకూలమా? మరియు మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన విధానం ఇదేనా అని ప్రశ్నించి, ఉపవాసము అంటే, ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చోవటమా? అని దేవ దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
దీనిని బట్టి, అర్థమయ్యేదేమిటంటే- తోటి మానవులతో ‘సత్ప్రవర్తన’ను కలిగి లేకుండా, వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తూ, ఉపవాసం పేరిట కొన్ని కర్మ కాండలను ఆచరించేసినంత మాత్రాన దేవ దేవుని ప్రసన్నతకు అర్హులు కాలేరని అర్థమౌతుంది. దేవ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటో పై వాక్యాలకు కొనసాగింపుగా ఉన్న ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? 7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు 8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. -యెషయా 58:3-8
1. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు
2. కాడిమాను మోకులు తీయుటయు
3. బాధింపబడిన వారిని విడిపించుటయు
4. ప్రతి కాడిని విరుగగొట్టుటయు
5. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు
6. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు
7. దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? అని దేవ దేవుడైన యెహోవా కోరుతున్నాడు. ఈ ఉపవాసంలో మానవాళికి తప్ప ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉందా!? ఈ విధంగా మానవులు ఏమైనా ఇచ్చేది ఉంటే అది తమ తోటి మానవులకే గాని, దేవ దేవునికి ఇచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే- ఆయన స్వయం సమృద్ధి కలిగిన నిరపేక్ష పరుడు. అటువంటప్పుడు ఆయన రక్తానికి బదులుగా క్షమించటం ఏమిటి? ఆయన రక్తాన్ని ఏమి చేసుకుంటాడు? పోని ఆయన రాక్షసుడూ కాడు!
దేవ దేవునికి యేసు రక్తం ‘పేమెంట్’గా చెల్లించ బడిందా!?
ఏ అక్కరా లేని నిరపేక్ష పరుడైన దేవ దేవునికి తన పాపాల పరిహారానికి ప్రతిగా చెల్లించవలసింది ఏమీ ఉండదు. ఒక్క తన ‘దుష్ప్రవర్తన’ను విడనాడి, ‘సత్ప్రవర్తన’ను చేపట్టం తప్ప! ‘పరిశుద్ధ బైబిలు గ్రంధం’ చెప్పేది ఇదే! ఈ విశ్వాసాన్నే కనుక ప్రచారం చేస్తే, క్రైస్తవ సమాజంలో ఎంతో అద్భుతమైన ‘నైతిక విప్లవం’ వచ్చేది.
కాని దానికి బదులుగా పాత నిబంధన కాలంలో ప్రజలు తమ ప్రతి పాపానికి జంతుబలుల ద్వారా దేవునికి రక్తాన్ని ‘పేమెంట్’గా చెల్లించేసి, పాప విముక్తులు అయిపోయేవారు. ఆ తరువాత పాపులకు ఈ సమస్య లేకుండ- సకల పాపుల తరఫున యేసు తన పరిశుద్ధ రక్తాన్ని దేవ దేవునికి ‘పేమెంట్’గా చెల్లించేశారనే తప్పుడు విశ్వాసాన్ని ప్రజలలో ప్రచారం చేసేశారు. దీని కారణంగా- మా పాపాల నిమిత్తం దేవునికి, యేసు తన రక్తాన్ని చిదించేసి ‘పేమెంట్’ చెల్లించేశారు. కనుక మనం ఇక ఎన్ని పాపలు చేసుకున్నా ఫరవాలేదులే!! అనే ఒక నిర్లక్ష్య భావన పాపులకు తన పాపాల పట్ల ఏర్పడిపోయింది. అందుకే క్రైస్తవులు అధికంగా నివసిస్తున్న దేశాలే ‘నేరాలు-ఘోరాల్లో’ ప్రథమ స్థానంలో నిలిచి ఉన్నాయి.
సర్వ మానవుల పాపాల కొరకు దేవ దేవుడైన యెహోవాయే, యేసుగా నరవతారం ఎత్తి,
తన రక్తాన్నే తనకు ‘పేమెంట్’గా తీసుకున్నాడా?
లేక
యేసు అనే ఒక మానవుడిని సృష్టించి, సర్వ మానవుల పాపాల కొరకు
అతనిని బలి ఇప్పించి, అతని రక్తాన్ని ‘పేమెంట్’గా తీసుకున్నాడా?
పై రెండిటిలో ఏది సత్యమో ఏది అసత్యమో మరియు ఆ రెండిటిలో ఏది సత్యమైనా ‘రక్తం’తో ఆయనకు పనేమిటో గౌరవనీయులైన క్రైస్తవ బోధకులు ‘లేఖనాల ఆధారం’గా సమాధానం ఇవ్వాలని సవినయముగా కోరుతున్నాము.
M.A.Abhilash
919666488877
tmcnewstmc@gmail.com