Posted by Sakshyam Magazine on Tuesday, October 4, 2016
ప్రతి ముస్లిం తప్పనిసరిగా హదీసు జ్ఞానం పొందాలి. మంచీ చెడుల మధ్య వ్యత్యాసం చూపగలిగే జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అవలీలగా ఎదుర్కోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హదీసు జ్ఞానం పొంది ఉండాలి. అందుకోసం పిల్లలను చిన్నప్పటి నుంచే ధార్మిక విషయాలు నేర్పాలి.
ముహమ్మద్ ప్రవక్త [స అసం] మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో బోధనలు చేశారు. సందర్భానుసారం వాటిని ఆచరించి మరి చూపించారు. మనిషి తన వ్యక్తిగత జీవితంలో సామూహిక జీవితంలో ఎలా ఉంటే పరలోకంలో సాఫల్యం పొందుతాడో కూలంకషంగా వివరించారు. ప్రవక్త [స] తన జీవితంలో చెప్పిన మాటలను, చేసి చూపించిన ఆచరణాలను ''హదీసులు'' అంటారు.
ప్రవక్త [స] ఎప్పుడైనా ఏదైనా విషయం చెబితే, లేదా చేసి చూపిస్తే సహాబాలు దాన్ని గుర్తుచేసుకునే వారు. రాయడం వస్తే రాసుకునే వారు. ఎక్కడికి వెళ్లినా ఆయన [స] బోధనలను బాగా ప్రచారం చేసేవారు. వాటిని బాగా వ్యాపింపజేసేవారు. అలా ప్రవక్త [స] బోధనలు ఆనాతి కాలంలోనే ప్రజల్లో వ్యాప్తిచెందాయి. సహాబాలు ప్రవక్త[స] ఆదేశించిన విషయాలను ఆచరించడానికి పోటీపడేవారు. ఆయన [స] వారించిన విషయాలు జోలికి వెళ్లే వారు కాదు. కొందరు సహాబాలు ప్రవక్త[స] చెప్పిన విషయాలను [హదీసులను] ఒక చోట చేర్చి సంకలనాలు చేశారు. అందులో అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ [రజి] ఒకరు. ఆయన కూర్చిన హదీసు సంకలనాన్ని ''సాదిఖ'' అంటారు. ఈ కూర్పులో వెయ్యి హదీసులున్నాయి. అవే కాకుండా ప్రవక్త[స] జీవిత కాలంలోనే మరి కొందరు సహాబాలు కొన్ని హదీసు సంకలనాలు చేశారు. వారిలో అలీ[రజి], అనస్[రజి] అబ్దుల్లా బిన్ మాస్ఊద్[రజి], అబూ హురైనా[రజి], సాద్ బిన్ అబ్బాస్ [రజి] తదితరులున్నారు.
ఖిలాఫతె రాషిద కాలం తదనంతరం బనీఉమయ్యా కు చెందిన ఎనిమిదవ ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ [రజి] కాలంలో హదీసులన్నిటినీ ఒకచోట చేర్చి వాటిని పుస్తక రూపంలో ప్రచురించే పనులు విస్తృత స్థాయిలో ప్రాంభమయ్యాయి. ఖలీఫా సామ్రాజ్యం స్పెయిన్, అల్ జజాయెర్, మొరాకో, ఫలస్త్రీనా, ఇరాక్, హిజాజ్, యామన్, కువైట్, బహ్రైన్, జోర్డాన్,ఈరాన్,అఫ్గానిస్తాన్, ఈశాన్య భారతదేశం వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రాంతాల్లో మొదటినుంచే ప్రవక్త [స] ప్రవచనాల చర్చ జరుగుతూ ఉంది. ఖలీఫా కూడా చాలా జాగ్రతగా ప్రణాళికతో ఈ కార్యం నిర్వహించారు. హదీసు కూర్పు చేసే వారినుద్దేశించి ''మీకు ప్రవక్త [స] ప్రవచనం తెలిస్తే బాగా విచారించిన తర్వాతే దాన్ని రాయండి. ప్రవక్త [స] ప్రవచనం తప్ప వేరే విషయాల్ని తీసుకోకండి. వాటిని రాయకండి అని హెచ్చరించారు.
ఆ ఆదేశంతో అనేక ప్రాంతాల నుండి హదీసులు పుంఖాను పుంఖాలుగా డెమాస్కస్ నగరానికి వచ్చాయి. ఒక్కొక్క హదీసును బాగా పరిశీలించారు. చిన్న పెద్ద హదీసులన్నిటినీ కలిపి పుస్తక రూపం ఇచ్చారు. అలాంటి అనేక పుస్తకాలను తయారు చేసి ప్రతి దేశంలోని ప్రముఖ మసీద్ లకు పంపారు. ఖలీఫా మరణానంతరం కూడా అబూ అబ్దుల్లా మాలిక్ బిన్ అనస్[రజి] హదీసులను సేకరించే పనిని కొనసాగించారు. ఆయనే ఇమామ్ మాలిక్ [రహ్మలై] ఆయన 26 యేళ్ల ప్రాయ వరకు ప్రజలకు హదీసు బోధనలు చేశారు . ఆ హదిసులన్నిటిని కలిపి ఒక గ్రంధంగా మలిచారు. దాని సంకలనాన్నే మనం 'ముఅత్తా' అంటాం. ఈ పుస్తకాన్ని సంకలనం చేసే కార్యక్రమం హి.శ 120లో ప్రారంభమై హి.శ 140లో పూర్తియింది. ఇందులో 1720 హదీసులున్నాయి. 68 సంవత్సరాల వయస్సులో ఆయన కన్నుమూశారు. హదీసు గ్రంధాల మొదటి సంకలనం ఇది.
ఆ తరువాత ఇమామ్ హంబల్ [రహ్మలై] ఈ పనిని కొనసిగించారు. ఈయన కూర్చిన సంకలనాన్ని 'ముస్నద్' అంటారు. ఇందులో ముప్పైవేల హదీసులున్నాయి. ఈయన బగ్ధాద్ నగరంలో జన్మించారు. ఇవే కాకుండా ఆరు ప్రముఖ హదీసు గ్రంధాలున్నాయి. వాటిని ''సిహాహ్ సిత్తా'' లేక'' కూతుబె సిత్తా'' అంటారు.
సహిహ్ బుఖారి: ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ [రహ్మలై] ఈ గ్రంధ సంకలనకర్త . ఈయనే ఇమామ్ బుఖారీ [రహ్మలై]. ఈయన సుమారు పదహారు సంవత్సరాలు పరిశోధించి 5727 హదీసులను సేకరించారు. ఈయన ఇరాన్ లోని బుఖారీలో హి. శ ౧౯౪వ యేట జన్మించారు. 62 వ సంవత్సరాలకు పరమదించారు. హదీసు గ్రంధాల్లో సహిహ్ బుఖారీ ప్రామాణీకత రీత్యా అగ్రగణ్యమైనది.
సహిహ్ ముస్లిం : ఇమామ్ ముస్లిం బిన్ హజ్జాజ్ అల్ ఖషిరీ [రహ్మలై] ని ఇమామ్ ముస్లిం పేరుతో గుర్తిస్తాం. ఈయన ''సహిహ్ ముస్లింగ్రంధాన్ని సంకలనం చేశారు. ఈయన హి.శ 204వ యేట ఇరాన్ లో జన్మించారు. పదిహేను సంవత్సరాలు పరిశోధించి తన గ్రంధంలో 7200 హదీసులను జమ చేశారు. ఈయన హి.శ 216లో పరమపదించారు. సహిహ్ బుఖారీ, సహిహ్ ముస్లింలను ''మజ్ ముయే సహిహైన్'' అంటారు. సహిహ్ బుఖారీ, సహిహ్ ముస్లింలో ఉమ్మడిగా ఉన్న హదీసులను ''ముత్తపఖున్ అలైహ్'' అంటారు. ఇలాంటి హదీసులనే అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తారు.
జామ్ తిర్మిజీ : ఇమామ్ అబూ మూసా ముహమ్మద్ బిన్ ఈసా [రహ్మలై] తిర్మిజీ గ్రంధాన్ని సంకలనం చేశారు. ఈయన్నితిర్మిజీ అని కూడా అంటారు. ఈయన ఇమామ్ బుఖారీ [రహ్మలై] శిష్యులు. ఈయన హి.శ.209లో ఇరాన్ నగరంలోని తిర్మిజ్ ప్రాంతంలో జన్మించారు. హి.శ.279 లో ఈయన పరమపదించారు. జామ్ తిర్మిజీలో మొత్తం 2028 హదీసులున్నాయి.
అబూ దావూద్: సులైమాన్ బిన్ అష్ అత్ [రహ్మలై] అబూ దావూద్ హదీసు గ్రంధాన్ని సంకలనం చేశారు ఈయన అబుదావూద్ అని పిలువబడతాయి. ఈయన సంకలనం చేసిన గ్రంధాన్ని ''సుననె అబుదావూద్ '' అంటారు ఈయన హి.శ. 202 యేట అఫ్గానిస్తాన్లో జన్మించారు. ఈయన తన 37వ సంవత్సరంలో మరణించారు. సుననె అబుదావూద్ మొత్తం 4800హదీసులున్నాయి.
సుననెనసాయి: ఇమామ్ అబూ అబ్దుర్రహ్మాన్ అహ్మద్ బిన్ షుఐబ్ నసాయి చేసిన హదీసు సంకలనాన్ని ''సుననె నసాయి'' అంటారు. ఈయన నసాయి అని పిలువబడతారు. ఈయన హి.శ. 251వ యేట ఈరాన్ నగరంలో నసా ప్రాంతంలో జన్మించారు. హి. శ 303లో కన్నుమూశారు.
ఇబ్నెమాజ : ఇమామ్ అబూ అబ్దుల్లా బిన్ యజీద్ ఇబ్నె మాజ సంకలనం చేసిన గ్రంధాన్ని ''ఇబ్నె మాజ'' అంటారు. ఈయన ఇబ్నె మాజ పేరుతో గుర్తించబడతాయి. ఈరాన్ లో జన్మించారు. ఈయన తన 46వ యేట మరణించారు.
సుననె దారిమి : ఇమామ్ అబూ ముహమ్మద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అద్దార్మీ హి.శ 181వ యేట సమర్ఖంద్ లో జన్మించారు. హి.శ. 255 లో మరణించారు. ఈయన ఇమామ్ దారిమి పేరుతో గుర్తింపబడతారు. ఈయన సంకలనం చేసిన హదీసు గ్రంధం సుననె దారిమి ''ఇందులో 3550 హదీసులున్నాయి.
సుననె బైహఖీ: ఇమామ్ అబూ బక్ర్ అహ్మద్ బిన్ అల్ హుసైన్ అల్ బైహఖీ [రహ్మలై] ఈరాన్ లో జన్మించారు. ఈయన్ సంకలనం చేసిన హదీసు గ్రంధం ''సుననె బైహఖీ'' ఈయన్ తన కాలంలో వెయ్యి వరకు రచనలు చేశారు.
మిష్కాతుల్ మసాబిహ్ : ఈ హదీసు గ్రంధాన్నిఇమామ్ వలియుద్దీన్ అబూ అబ్దుల్లాహ్ సంకలనం చేశారు. ఇందులోని హదీసులు కూడా ప్రామాణికమైనవే. మదర్సాల్లో కూడా ఈ గ్రంధాన్ని చదివిస్తారు.
ప్రతి ముస్లిం తప్పనిసరిగా హదీసు జ్ఞానం పొందిలి. మంచీ చెడుల మధ్య వ్యత్యాసం చూపగలిగే జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అవలీలగా ఎదుర్కోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హదీసు జ్ఞానం పొంది ఉండాలి. అందుకోసం పిల్లలను చిన్నప్పటినుంచే ధార్మిక విషయాలు నేర్పాలి. సమయం దొరికినప్పుడు వారికి చిన్నచిన్న హదీసులను కంఠస్త౦ చేయించాలి. హదీసులకు సంబంధించిన చిన్నచిన్న పుస్తకాలను చదివించాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు ధార్మిక గ్రంధాల అవగాహన కల్పించి వారితో చదివిస్తే పుస్తకాలు చదివే అలవాటవుతుంది. ధార్మిక విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. చిన్నప్పుడు అబ్బిన అలవాట్లే పెద్దయ్యాక కూడా కోన సాగుతాయి. పెద్దయ్యక వేరేగా అలవాటు చేయించాలంటేచాలా కష్టం. కనుక పెద్దలు ఈ విషయంపై దృష్టి సారించాలి. మనం కూడా హదీసు జ్ఞానం పొందాలి. మన పిల్లలకూ నేర్పాలి